ప్రజలందరికీ ప్రయోజనకారిగా
కంటిచూపు ప్రసాదించేందుకు
కంకణం కట్టుకుంది ప్రభుత్వం.
అది బాపు కేసీఆర్ దూరదృష్టి, సమదృష్టి, సమ్యక్ దృష్టి
సర్వేంద్రియాణాం.. నయనం ప్రధానం
చూపు తరిగిన వయోజనులకు చూపందించడం
దృష్టి కాదు.. పునఃసృష్టి
అందుకే పెద్దలు దీవిస్తూ భావోద్రేకంతో
కార్చిన రెండు కన్నీటి చుక్కలే
నయనాల నయాగరా
సులోచనాలు తుడుచుకొని మరీ..
చిరునవ్వులు చిందిస్తున్నారు
దరహాసం చిలికిస్తున్నారు..
ఎవరివయ్యా నువ్వు?
మాపట్ల నీకెందుకింత అభిమానం, అనురాగం, ఆత్మీయత?
పెద్ద కొడుకువా.. కన్నతండ్రివా.. పెద్దన్నవా? చిన్న తమ్ముడివా?
లేక.. మళ్లీ ఆ రాముడో, కృష్ణుడో పుట్టాడని అనుకోమంటావా
అంటూ.. మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తున్నారు..
కళ్ళు వదనానికే కాదు.. హృదయానికీ.. బుద్ధికీ ఉంటవి
కంటిదోషం ఉంటే లోకమంతా చీకటి
ఆ కళ్ళతో చూస్తే అంధకార బంధురం.. అభివృద్ధి శూన్యం..
కువిమర్శకులకు, కుటిల తంత్రాలకు
కామెర్ల పసుపు తప్ప పంటల పచ్చదనం కనిపించదు
జలకళ గోచరించదు
మిషన్ కాకతీయ మిథ్యగా తోస్తుంది
మిషన్ భగీరథ మసకగా కనిపిస్తుంది
రైతుబంధు, రైతుబీమా శుక్లాల మధ్య కనిపించదు
కల్యాణలక్ష్మిలు, షాదీ ముబారక్లు
వృద్ధాప్య, ఆసరా, ఒంటరి మహిళల పింఛన్లు
కళ్ళజోళ్ళు పెట్టుకున్నా కనిపించవు
దళితబంధు లాంటివి కళ్ళున్న, కుళ్ళున్న
కబోదులకు ఎలా తెలిసివస్తాయ్?
ఏ కంటి వైద్యుడు బాగు చేయగలడీ మసక కళ్ళనీ
స్వధర్మమపి చావేక్ష్య న వికంపితు మర్హసి
అని గీతాచార్యుని ఉవాచ..
స్వధర్మాన్ని గాక.. వ్యవస్థ ధర్మాన్ని పాటించి
పరిరక్షించేవాడు నాయకుడు
అహర్నిశలు ప్రజోపయోగకర,
ప్రయోజనకర ప్రామాణికతకు
ప్రాధాన్యతనొసగేవాడు ప్రజానాయకుడు,
జనహృదయ నేత..
భవిష్యత్ భారత భాగ్యవిధాత,
అతడే అద్వితీయోద్యమ వ్యూహకర్త
స్వరాష్ట్ర ప్రదాత మన బాపు కేసీఆర్
కంటివెలుగు కలల పంట ఇంటింటా కలుగు
హృత్సాగర తరంగమై హ్లాదోద్గతి చెలగు..
లోకాన్ని దర్శిస్తే లోచనాలకు పర్వం..
లోకులెల్ల హర్షిస్తే నేతలకది సర్వం
తప్పు లేదు.. తప్పు కాదు తరచి చూచి విమర్శిస్తే..
కనులుండీ కనకుంటే గాఢాంధకారమే
స్థిరత్వం, సమత్వం, సభారుచికర వాక్చాతుర్యం,
దృఢ దీక్షాపరత్వం, ఉత్తమ నేతృత్వం,
ఉద్యమ సంఘటితత్వం, బాపు కేసీఆర్ తత్త్వం..
అందుకే తెలంగాణ అభివృద్ధిలో అగ్రశ్రేణి
కర్షకులకు మాగాణి కార్మికులకు శిరోమణి..
ఉద్యోగుల శిఖామణి.. విద్యార్థుల చింతామణి..
కంటివెలుగు అంటూ ప్రతి ఇంటా
ఉచిత నేత్ర వైద్యానికి, శ్రీకారం చుట్టి, దిగ్విజయంగా
కొనసాగిస్తున్న ఓ మహానుభావా..
మా కంటిపాపలా నిలిచిపోయి,
తెలంగాణ నాదాన్ని, నినాదాన్ని, జనపదాన్ని..
భారత జాతీయ సమగ్రతా, సమైక్యతా విధానాన్ని
మీ వెంట నడిచి గెలువనీయండి
బాపూ.. మా కంటిపాపవై నిలిచిపోవా..
(కవయిత్రి: రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలు)
శ్రీదేవి మంత్రి