దేశంలో తొలిసారిగా విదేశీ విశ్వవిద్యాలయాలను నెలకొల్పేందుకు వీలుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ ( యూజీసీ) అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ‘భారతదేశంలో ఉన్నత విద్యా సంస్థల ప్రాంగణాల ఏర్పాటు -నిర్వహణ’ పేరుతో ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. ఆయా విదేశీ విశ్వవిద్యాలయాలకు అనుమతులు ఇచ్చే దిశగా యూజీసీ చైర్మన్ ఎం.జగదీష్ కుమార్ శరవేగంగా అడుగులు కదుపుతున్నారు. ముసాయిదా ప్రతిపాదనలపై ఈనెల 18 లోగా సలహాలు, సూచనలు పంపించాలని కోరారు. ఇది అటు విద్యార్థులనే కాకుండా ఇటు అధ్యాపకులు, విద్యారంగ మేధావులను తీవ్రంగా కలచి వేస్తున్నది.
‘దేశంలోనే విదేశీ విశ్వవిద్యాలయాలు ఏర్పడితే విద్యార్థులకు నివాస వ్యయం, ట్యూషన్ ఫీజు తగ్గి మరింత తక్కువ ఖర్చుతో వారు కోరుకున్న విదేశీ విద్యని అభ్యసించగలుగుతారు’ అనే వాదన సహజమే. అయితే టాప్ 500 ర్యాంక్లో గల విదేశీ మాతృ విద్యాలయాలలో ఉన్న విద్యా ప్రమాణాలు భారతదేశంలో నెలకొల్పబోయే విద్యాసంస్థల్లో ఏ మేరకు ఉంటాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
జాతీయ విద్యా విధానం-2020 సిపార్సు ల మేరకే విదేశీ విశ్వవిద్యాలయాలను స్వాగతిస్తున్నట్లు యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ పేర్కొన్నారు. కానీ అవి అంతిమంగా సంపన్న వర్గాల లబ్ధికే దోహదపడే విధంగా ఉంటాయని స్థూలంగా అంచనా వేయవచ్చు. దేశీయ విద్యార్థులకు దేశంలోనే అధిక నాణ్యతగల అంతర్జాతీయ విద్యను అందించాలనే లక్ష్యంతో విదేశీ విశ్వవిద్యాలయాలను స్వాగతిస్తున్నట్లు ఆయన వ్యక్తీకరించడం ఏమాత్రం సహేతుకంగా కనిపించడం లేదు.
దేశాన్ని విశ్వ విద్యా కేంద్రంగా మార్చడమే లక్ష్యం గా ఈ ముసాయిదా ప్రతిపాదనలు రూపొందించిన ట్లు జగదీష్ కుమార్ పేర్కొన్నారు. కానీ అవి యథార్థానికి ఆమడ దూరంలో ఉన్నాయని చాలా స్పష్టం గా అర్థమవుతున్నది. వివిధ దేశాలకు చెందిన ప్రము ఖ విశ్వవిద్యాలయాలు మనదేశంలో విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తాయనుకుందాం. దానివల్ల విద్య మరింత వ్యయంతో కూడుకున్నదిగా మారి ‘బలహీన వర్గాలకు అందని ద్రాక్ష’గా పరిణమించే ప్రమాదాన్ని ఆయన గుర్తించకపోవడం ఏమాత్రం సమర్థ నీయం కాదు.
మనదేశ విద్యార్థులలో చాలామంది ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వారు. వారు విదేశీ విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలు పొందాలనుకుంటే వారికి ఆర్థిక సహాయం అందించే వెసులుబాటు కల్పిస్తామని చైర్మన్ అంటున్నారు. ఇది ఏమాత్రం నమ్మశక్యంగా లేదు.
‘విదేశాలలో చదువుకోవడానికి మనదేశం నుంచి ఏటా దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు వెళుతున్నారని, దేశంలోనే విదేశీ విశ్వవిద్యాలయాలు ఏర్పడితే వారికి నివాస వ్యయం, ట్యూషన్ ఫీజు తగ్గి మరింత తక్కువ ఖర్చుతో వారు కోరుకున్న విదేశీ విద్యని అభ్యసించగలుగుతారు’ అనే వాదన సహజమే. అయితే టాప్ 500 ర్యాంక్లో గల విదేశీ మాతృ విద్యాలయాలలో ఉన్న విద్యా ప్రమాణాలు భారతదేశంలో నెలకొల్పబోయే విద్యాసంస్థల్లో ఏ మేరకు ఉంటాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అంతేకాకుండా ఆ విద్యార్థులు విదేశాలలో చదువుకుంటూనే సంపాదించుకునే ( లెర్నింగ్ బై ఎర్నింగ్) అవకాశాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉన్నది.
ఒకవైపు అనువైన ఫీజులు అంటూనే మరోవైపు నచ్చిన రీతిలో ఫీజుల విధానాన్ని రూపొందించుకునే స్వేచ్ఛని ఆయా విదేశీ విశ్వవిద్యాలయాలకు వదిలి వేయడం సరికాదు. అంటే ఫీజులు ఎక్కువ మొత్తంలోనే ఉండే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచ నా వేయవచ్చు. దీన్ని బట్టి విదేశీ విద్య మొత్తం కార్పొరేట్ కనుసన్నలలో వ్యాపారాత్మకంగా మారబోతుందనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. మొత్తానికి విశ్వవిద్యాలయాల పేరుతో భారతీయ సంపదను విదేశాలు కొల్లగొట్టడానికి అనువుగా ముసాయిదా ప్రతిపాదనలు ఉండడం విస్తుగొలుపుతున్నది. ఫీజుల విధానం పారదర్శకతని పాటి స్తూ సహేతుకంగా ఉండాలనే తూతూ మంత్రపు నిబంధనలు ఉండడం గమనార్హం. ఒక పక్క విదేశీ విశ్వవిద్యాలయాలు స్థాపించే సంస్థలు తాము ప్రారంభించబోయే కోర్సుల ప్రవేశాల కు సంబంధించిన ఫీజుల వివరాలను 60 రోజుల ముందే వెల్లడించాలని పేర్కొన్నారు. మరోపక్క దేశంలో క్యాంపస్లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్న ఆయా విదేశీ విశ్వవిద్యాలయాలు తమ అడ్మిషన్ ప్రక్రియ, ఫీజుల విధానం, వారి మాతృ క్యాంపస్లకు నిధులని పంపించే విషయంలో స్వేచ్ఛని కలిగి ఉంటాయని యూజీసీ ముసాయిదా ప్రతిపాదనలో పేర్కొన్నారు. అంటే స్వేచ్ఛా వాణిజ్యానికి దోహదం చేసే అవకాశం ఉంద ని చాలా స్పష్టంగా తెలుస్తున్నది.
నిజానికి భారతదేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలను అనుమతించేందుకు భారత ప్రభుత్వం 1995 నుంచి విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందుకు సంబంధించిన తొలి బిల్లును 1995లో తీసుకురాగా పలు కారణాలతో అది ముందుకు కదలలేదు. మళ్ళీ 2005-06 లోనూ ముసాయిదా చట్టాన్ని తీసుకొచ్చినా అది కూడా మంత్రివర్గం దాకా వెళ్లి ఆగిపోయింది. చివరగా 2010 లో యూపీఏ-2 ప్రభుత్వం విదేశీ విద్యాసంస్థల బిల్లును ప్రవేశపెట్టగా కొన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. దీంతో అది పార్లమెంట్ ఆమోదాన్ని పొందడంలో విఫలమైంది. నాడు స్వదే శీ జపం చేసి విదేశీ విశ్వవిద్యాలయాల బిల్లుని వ్యతిరేకించిన బీజేపీ నేడు అదే బిల్లుపై అత్యంత ఉత్సుకతను ప్రదర్శించడం విడ్డూరంగా ఉన్నది.
విదేశీ విద్యని భారతదేశ విద్యార్థులకు చేరువ చేయడమే ప్రధాన ఉద్దేశ్యం అని యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ వెల్లడిస్తున్నది. కానీ అది ముమ్మాటికీ సంపన్నులకు మేలు చేస్తుంది తప్ప సామాన్యులకు ఒరిగేదేం లేదు. ఆయా విదేశీ విశ్వవిద్యాలయా లు దేశీయ విశ్వవిద్యాలయాలను మరింతగా దెబ్బతీస్తాయి. ఇప్పటికే దేశీయ విశ్వవిద్యాలయాలలో అనేక సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించడంలో ఆసక్తి చూపని కేంద్ర ప్రభుత్వం విదేశీ విశ్వవిద్యాలయాలకు అనుమతిచ్చేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నది. ఫలితంగా విద్యార్థుల భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మారనుంది. అందువల్ల బుద్ధిజీవులు యూజీసీ విడుదల చేసిన విదేశీ విశ్వవిద్యాలయాల ముసాయిదా ప్రతిపాదనలను ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
-జె.జె.సి.పి. బాబూరావు
94933 19690