Gods always forgive each other.
They understand jealousy.
They understand ambition.
They understand how people who love each other can end up challenging and sometimes murdering those they love!
నార్వే దేశంలోని ‘వైకింగ్స్’ అనే జాతి గురించి Netflixలో ఉన్న వెబ్సిరీస్ Vikingsలోని సంభాషణ అది. వైకింగ్స్ కూడా భారతదేశ గణరాజ్య ప్రజల లాగే చెట్టూ పుట్టా, రాయీ రప్పా సహా ప్రకృతి సమస్తం దేవుళ్లుగా ఆరాధిస్తరు.దేవుడు ఒక్కడే అనే సిద్ధాంతం (Monotheism-ఏకేశ్వరోపాసన) ఆచరించే ఇతర యూరప్ దేశాలకూ వైకింగ్స్కూ జరిగే యుద్ధాలు, ఆక్రమణలు, గగుర్పొడిచే పోరాటాలు సహా ఎంతో లోతైన చర్చ కూడా ఉంటుంది అందులో. దేవుడు చేసిన మనుషుల గురించి, మనుషులు చేసిన దేవుళ్ల గురించీ!
సరే, ఈ భూమిక ఎందుకు అంటే, పాఠకులారా.. నేటి మన భారతదేశంలోని ప్రజలు కూడా అన్నీ మరచిపోయి ఎవరి దేవుడు గొప్ప అనే పనిలో మాత్రమే పడేటట్టు చేస్తున్నది బీజేపీ. అదొక్కటే వారికి తెలుసు కాబట్టి, ఆ పాప వ్యవసాయం ద్వారానే వారికి బతుకు కాబట్టి. మరి మనమేం చేయాలి? ఆలోచించాలి!
11వ శతాబ్దంలో గుర్రాలపై వచ్చిన ముస్లిం పురుషులు ఈ దేశంలో స్థిరపడ్డరు. వాళ్లు తమ వెంట స్త్రీలను తెచ్చుకోలేదు. ఇక్కడివాళ్లనే పెళ్ళిళ్ళు చేసుకున్నరు. ఈ నేల తమదిగా చేసుకున్నరు. ఇక్కడే మనుగడ సాగిస్తూ, ఇక్కడి సంపద సృష్టికి కారణమవుతూ, ఇక్కడి మట్టిలోనే కలిసిపోతున్నరు. వారు రాకముందు, అంటే 11వ శతాబ్దికి ముందు ఇక్కడ శైవం-వైష్ణవం కొట్లాటలుండేవి. ‘బయటి శత్రువు’ వచ్చాక శైవ-వైష్ణవాల అంతర్యుద్ధం మెల్లిమెల్లిగా సమసిపోయింది. మనుషులకు నిరంతరం ఒక శత్రువు ఉండాలేమో! లేకపోతే సృష్టించేవారు ఉంటరు, బీజేపీ లాగ!
అయితే, వైకింగ్ భాష్యకారుడు అన్నట్టు దేవుళ్లు పరస్పరం గొడవలు పడరు. వారిని సృష్టించిన మనుషులకే రంది! మీకందరికీ తెలుసు దేవ-దానవ వైరుధ్యం గురించి. అసురులకు వరాలిచ్చే శివుడు, వారిని నిర్మూలించే విష్ణువు.. కానీ ఎప్పుడూ వారిద్దరు కొట్లాడుకోలేదు. దస్యులకు అండగా శివుడు ఉండటాన్ని కూడా అర్థం చేసుకున్నడు విష్ణువు. ఎవరి తప్పొప్పులు ఎవరు తేల్చగలరు కానీ అందరికీ ఏదో ఒక, ఎవరో ఒక అదరువు ఉండటం కదా న్యాయం! సారాంశం ఏమంటే, మన సనాతన సంస్కృతిలో సహనం ఇరుసు లాంటిది. పరమత సహనం అంటే, పర అభిమత సహనం కూడా అని! దేవుళ్ల మధ్యే ఆ సహనం, సహకారం ఉంటే, మనమెంత?!
దురదృష్టవశాత్తూ మన సహనశీలత కనుమరుగవుతున్నది. ఆ మురుగులో కమలం విరబూయాలని కలలు గంటున్నది. తెలిసీ తెలియని ఇరుపక్కల మేధావులు దానికి ఎరువు వేస్తున్నరు. ఇది ఇట్లా సాగనిద్దమా? రాముడూ, అంబేద్కరూ ఎపుడన్న చెప్పిన్రా ఇది సబబని?
‘ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ అంత్యక్రియల్లో పాడె మోసిన శ్రీరాముడు, లక్ష్మణుడు’ అంటూ ఒక కర్ణాటక పత్రికలో వచ్చిన కార్టూన్ యెంత వికారంగా ఉన్నదో! ఇది కాదా దేవుడిని అవమానించడం? ఇక్కడ విషయం స్వర్గీయ హీరాబెన్ గురించి కాదు. తల్లి పాడె మోసినంత మాత్రాన మోదీ రాముడవుతాడా? రాజకీయ భక్తులు తమ దేవుడైన రాముడికి తెచ్చే తంటా ఇది!
సరిగ్గా ఇట్లనే నాస్తిక సమాజం పేరుతో అంబేద్కర్ బొమ్మలు పెట్టుకొని నానాచెత్తలు మాట్లాడేవారు కూడా తయారయిన్రు. అసలు అంబేద్కరిజానికి నాస్తికతకు ఏం సంబంధం? అయ్యప్ప గురించి హేళనగా, వెటకారంగా, అవమానకరంగా మాట్లాడటం నాస్తికత్వమా? నాస్తికత్వం అంటే ఆస్తికులను తిట్టడమా? ఈ పిచ్చికి అంబేద్కర్కు ఏం సంబంధం? అచ్చు రామభక్తుల లాగే వీరూ తమ దేవుడైన అంబేద్కర్కు తెచ్చే తంటా ఇది! మీ ఇద్దరి మధ్య గుణాత్మకమైన తేడా ఏమన్నా ఉన్నదా?
రాముడిని బీజేపీ వాళ్లు చదువలేదు. కానీ ఆయనను రాజకీయాలకు ఎట్లా వాడుకోవాలో మాత్రం బాగా తెలుసు. ఇద్దరు ఎంపీలతో మొదలుపెట్టిన ప్రయాణం దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా కుళ్ళబొడవడం దాకా చూస్తనే ఉన్నం! అట్లనే.. నాస్తికులు/ హేతువాదులని చెప్పుకొనేవారు అంబేద్కర్ను సరిగా చదవలేదు. కేవలం వాగాడంబరం, వ్యక్తిగత ప్రచార యావ తప్ప వీరికి లక్ష్యాలేమీ లేవు. కాబట్టే ఒకప్పుడు యూపీని ఊపేసిన రాజకీయం నేడు చప్పబడటం చూస్తనే ఉన్నం. తాము సైద్ధాంతికంగా ఎవరితోనైతే యుద్ధం చేయాలో వారి పంచనే పడి నడుస్తున్న పార్టీనీ చూస్తున్నం! ఇవన్నీ పాలిటిక్స్ లేని టైంపాస్. చీప్ పబ్లిసిటీ కోసం చేసే పనులు. దేవుడు లేడన్న ‘హేతువాదం’ ఎవరికి మేలు చేస్తది? సృజన కావాలి. ప్రాప్తకాలజ్ఞత లేని కేవలం సైంటిఫిక్ టెంపర్ నాశనం చేసేస్తది సైన్స్ను కూడా!
‘మనం బాగుండాలంటే ముందు మన నాయకుడిని నిలబెట్టాలి’ అంటాడు కాన్షీరామ్కు ‘అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్’ పరిచయం చేసిన ఫోర్త్ క్లాస్ ఉద్యోగి దీనాబానా. అంబేద్కర్ విగ్రహారాధనను వ్యతిరేకించారంటే లాభం లేదు. ఆయన ఆశించిన భారతదేశ నిర్మాణం జరగాలంటే, కొన్నిసార్లు ఆయన మాటా వినక్కర్లేదు! ఆయనకు కూడా పూజలు చేయాల్సిందే. కొబ్బరికాయలు కొట్టాల్సిందే. ఆయన బొమ్మ జేబులో పెట్టుకున్న కొంతమందికి ఈ విషయాలు అర్థం కావడం లేదు. అందుకే వెటకారాన్ని మాత్రమే నమ్ముకున్నారు. ఇది అంబేద్కర్ ఆశయాలకే గొడ్డలిపెట్టు. బహుజనుల జీవితాలు బీజేపీ పాలనలో అల్లకల్లోలమవుతూ ఉంటే, సంచలనాలు మాట్లాడే, బాధ్యత లేని వారివల్ల బహుజనులకు తీవ్ర నష్టం.
ఫాసిస్టు హిందూత్వ (హిందువులను కాదు) శక్తులను ఎదిరించాలంటే, ఉదారవాద హిందూ ప్రజలను (ఎస్సీ, బీసీలను ముఖ్యం గా) కలుపుకొనిపోవాలి. వారి సంస్కృతిని తెగడటం అంటే వారిని వదిలేయడమే. అయ్యప్పను తిట్టడం అంటే బీజేపీయేతర ప్రజలను తిట్టడం కూడా. బహుజనులను బాధ పెట్టడం కూడా. మానవతకు మూలాధారమైన అమ్మలనూ వదలడం లేదు. ఈ వ్యాసం రాస్తున్న సమయంలోనే బాసర సరస్వతిపైనా అవాకులు, చెవాకులు పేలిండొకడు. ఇంత మత్తుకు యువత గురవ్వడం ఎంత విషాదం! ఆ మధ్య ప్రముఖ రచయిత బండి నారాయణస్వామి అన్నరు. ‘నిజంగా పాలిటిక్స్ను మానవీకరించాల్ల. గుండెలో తడి ఉన్నవాళ్ళు ఉండాల్ల రాజకీయాల్లో. కవులు, కళాకారులు రాజకీయాల్లోకి రావాల్ల. మంచివాళ్లు బయట ఉంటే, వెధవలు లోపల ఉండక ఏం చేస్తారు? వాళ్ల తప్పు ఎట్లా అవుతుంది’.
కేసీఆర్ కోరుతున్న గుణాత్మక మార్పు ఇదే. కొత్త ఆలోచనలు కావాలి. కొత్త నీరు రావాలి. దేశమంతా వ్యాపించాలి. నేలను సారవంతం చేయాలి. ప్రజలు కేంద్ర బిందువుగా, వారి సమస్యల పరిష్కారమే పరమలక్ష్యంగా పనిచేయాలి. ఇదెవరు చేయాలి? యువతే చేయాలి. మరి యువత మతం మత్తులో, విద్వేషాల ఊబిలో చిక్కుకుపోతే ఎట్లా? దేవుడున్నాడనీ, లేడనీ తగవులు పడుతూ
నిర్వీర్యమైతే ఎట్లా?
కాబట్టే ఈ అప్పీల్…
మతం, కులం, జెండర్, ప్రాంతం.. ఇట్లా ఏ అస్తిత్వమైనా స్పృహతో ఉండి భిన్నత్వంలో ఏకత్వ భావనతో ప్రజాస్వామ్యయుతంగా, ప్రగతిశీలంగా ఉంటే దేశం ఆరోగ్యకరంగా ఉంటుంది. దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం అన్న వైతాళికుల మాట విందాం. దేవుడిని మన మదిలో, పూజా గదిలో కొలువుంచుకుందాం. అసెంబ్లీ, పార్లమెంట్లోకి లాగి రచ్చ రచ్చ చేయొద్దు వారిని. బజారుకీడ్చవద్దు. దేవుడి పేర మనం మనం కొట్టుకు చావొద్దు. పెద్దలు మనకిచ్చిన విలువ కాదది.
రండి, ప్రగతికాముకమైన మహోజ్వల భారతదేశాన్ని నిర్మించే పని ఉన్నది మనకు. మత ప్రచారకుల, మత విద్వేషకుల గోలలో పడొద్దు. తొమ్మిదేండ్ల పాలనలో మీ జీవితాలను నాశనం చేసిన బీజేపీ వైపు ఎక్కుపెట్టండి రాముడిచ్చిన శస్ర్తాలూ, అంబేద్కర్ ఇచ్చిన చదువూ శాస్ర్తాలూ!!
జై శ్రీరామ్! జై భీమ్!! జై భారత్!!!
-శ్రీశైల్రెడ్డి పంజుగుల , 90309 97371