కొన్ని నెలల క్రితం యూట్యూబ్లో ఒక మాజీ ఫారెస్టాఫీసర్ ఇంటర్వ్యూ చూశాను. అతనిప్పుడు మన దేశాన్ని ఏలుతున్న పార్టీలోనే ఉన్నారు. ఇంటర్యూలో ఆయన అలవోకగా చెప్పిన నిజం ఏమిటంటే – పైవాళ్ళు లేదా పవర్లో ఉన్నవాళ్ళు తల్చుకుంటే ఏ నేరం చేయని ఎవరి మీదనైనా అప్పటికప్పుడు ఎలాంటి నేరమైనా మోపి కేసు పెట్టగలరని! బహుశా అలాంటి కేసే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్.
కట్ చేస్తే..
ఊహించనంత వేగంగా మన జీవితాలు నగరీకరణమైపోతున్న నేపథ్యంలో – ఇప్పటికే కనుమరుగైపోయిన మన ఎన్నో పండుగలు, సంప్రదాయాల్లాగే మన బతుకమ్మ కూడా దాదాపు అంతర్ధాన దశకు చేరుకుంటున్న సమయంలో ఒకరి మనసులో ఒక మెరుపులాంటి ఆలోచన మెరిసింది. మిగిలిందంతా చరిత్రే! ఆ ఒకరు మరెవరో కాదు. కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఉద్యమ నేత, మన ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, సారథి. ఎవరూ ఊహించని విధంగా మన బతుకమ్మను తెలంగాణ ఉద్యమానికి అత్యంత అర్థవంతంగా కనెక్ట్ చేసి, ఆ పండుగను పూర్తిస్థాయిలో పునరుజ్జీవింపజేశారు మన కవిత. తెలంగాణలోనే కాదు.. దేశమంతా, ప్రపంచమంతా ఇప్పుడు ‘బతుకమ్మ పండుగ జరుపుకోవడం’ ఒక గర్వపడే అంశంగా తెలంగాణ ఆడపడచుల హృదయాల్లో నిలపడంలో వందశాతం సక్సెస్ సాధించారు కవిత. చివరికి జెట్ ఎయిర్వేస్ ఫ్లయిట్లో కూడా ఉత్సాహంగా బతుకమ్మ ఆడుతూ ఆ ఫ్లయిట్ సిబ్బంది ప్రయాణికులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారంటే కచ్చితంగా ఆ క్రెడిట్ కవితదే.
కట్ చేస్తే –
ఎంపీగా పార్లమెంట్లో తన తొలి స్పీచ్లోనే తనేంటో నిరూపించుకున్నారు కవిత. ఇంగ్లిష్, హిందీలో ఎంతో బాగా మాట్లాడారు. మరోసారి అదే పార్లమెంట్లో కశ్మీరీ పండిట్ల గురించి అద్భుతంగా మాట్లాడారు. నాకు తెలిసి.. తెలంగాణ, ఏపీలకు సంబంధించిన ఎంపీలెవరూ పార్లమెంటులో ఇప్పటివరకూ ఈ అంశం మీద ఇంత లోతుగా అధ్యయనం చేసి మాట్లాడి ఉండరు. సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్ అద్వానీ అదే అంశంపై తర్వాత మాట్లాడుతూ- కవిత ప్రసంగాన్ని ఒకటికి నాలుగుసార్లు మెచ్చుకున్నారు. పార్లమెంటులో ‘జాతీయ ప్రజాప్రతినిధుల సదస్సు’కు మాడరేటర్గా కూడా అద్భుతంగా వ్యవహరించి సత్తా చాటుకున్నారు కవిత. పార్లమెంటులో ఉన్నంతకాలం ఈ తరం మహిళా ఎంపీలకు, మహిళా పొలిటీషియన్లకు ఆదర్శంగా నిలిచారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఓటర్ల చారిత్రక తప్పిదం గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళు చేసిన తప్పేంటో, ఫలితంగా ఏం నష్టపోయారో ఇప్పుడు వాళ్ళకి బాగా అర్థమై ఉంటుందనడంలో సందేహం లేదు. చదువు సంధ్యలు, సర్టిఫికేట్లు, మాటలు, చేతలు, బాండ్ పేపర్లు.. అన్నీ అబద్ధాలైన మనుషులెక్కడ… ఉత్తమ పార్లమెంటేరియన్ మన కవిత ఎక్కడ?
కట్ చేస్తే-
అసలేంటీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు? అసమాన ప్రతిభాపాటవాలు, అద్భుత వ్యక్తిత్వం ఉన్న కవితకు ఈ కేసుతో ఏమిటి సంబంధం? ప్రజాస్వామికంగా ఎన్నికైన 9 ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ కుటిల రాజనీతిలో ఈ లిక్కర్ కేసు ఒకటి. అసలీ కేసే ఒక పచ్చి అబద్ధం అంటారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చి బయటికి వస్తే నిన్నే సీఎంను చేస్తామని మోదీషాల బీజేపీ ఇచ్చిన ఆఫర్ను తిరస్కరించిన ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మీద కక్షతో వండివార్చినదే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు. పనిలో పనిగా, తెలంగాణలో కొరకరాని కొయ్యగా తయారైన కేసీఆర్ ‘బీఆర్ఎస్’తో జాతీయ రాజకీయాల్లోకి కూడా వస్తుండటంతో భయపడి ఇక్కడ కూడా చెక్ పెట్టాలని కుట్ర పన్నారు. కవిత పేరుని ఈ కేసులో చేర్చారు. నిజానికి అసలది ఒక కేసే కాదు. బీజేపీ నాయకులు రూ.8 వేల కోట్ల స్కామ్ అంటారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రూ.144 కోట్ల స్కామ్ అంటారు. మరోవైపు, సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆ స్కామ్ విలువ జస్ట్ ఒక కోటి రూపాయలుగానే పేర్కొన్నారు. ఇంత చిల్లరగా రకరకాల సంఖ్యలు చెప్తున్న దీన్ని ఏం కేసు అంటారో దీని సృష్టికర్తలకే తెలియాలి. ఇలా మోదీషాలు ఒకవైపు కేసీఆర్ను లొంగదీసుకునే ఇలాంటి భ్రమల్లో ఉండగానే, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రను కేసీఆర్ భగ్నం చేసిన తీరు, దేశవ్యాప్తంగా బీజేపీని ఒక దోషిగా ఆయన నిలబెట్టిన తీరుకు మోదీషాల బీజేపీ షాక్తో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. అయినా సరే, కేసీఆర్ మీద ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో తాజాగా మరొక అడుగు ముందుకు వేసింది బీజేపీ.
కట్ చేస్తే –
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ నుంచి కవితకు మొన్న లెటర్ వచ్చింది. ‘ముందు ఆ కేసుకు సంబంధించిన ఫిర్యాదు కాపీని, దాని ఆధారంగా రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ను పంపించండి. అవి అందిన తర్వాతనే హైదరాబాద్లో మనం ఎప్పుడు కలిసేదీ నిర్ణయిద్దాం’ అంటూ సీబీఐకే రివర్స్ షాకిస్తూ ఉత్తరం రాశారు కవిత. తర్వాత ఎఫ్ఐఆర్ గట్రా చూశారు. అందులో తన పేరేం లేదని, అయినా సరే తాను చట్టానికి, న్యాయవ్యవస్థకు సహకరిస్తానని చెప్తూ, తనకు వీలున్న తేదీలను సీబీఐకి పంపించారు కవిత. దటీజ్ కవిత. ఈ నేపథ్యంలో- కవిత ఇచ్చిన తేదీల్లోనే ఒకటైన ఈ నెల 11వ తేదీ నాడు సీబీఐ కవితను హైదరాబాద్లో ఆమె నివాసంలో కలువనుంది. విచారణ కోసం కాదు.. వివరణ కోసం.
(వ్యాసకర్త: రచయిత, సినీ దర్శకుడు )
-మనోహర్ చిమ్మని