తెలంగాణ బిల్లు ఆమోదం జరిగిన వెంటనే కేసీఆర్ తెలంగాణ, ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి ఒక చిన్న ప్రసంగం చేశారు. ‘మన రాష్ర్టాన్ని మనం పాలించుకునే అపురూప అవకాశం వచ్చింది. మనకెవరూ శత్రువులు కారు.మన బాగు కోసమే ఇన్నాళ్లు, ఇన్నేండ్ల ఉద్యమం. తెలంగాణలో స్థిరపడిన, ఉద్యోగాల నిమిత్తం ఇక్కడ ఉన్న వారందరూ మనవాళ్లే. అందరం కలసి మెలసి ఉందాం’ ఇదీ ఆయన ప్రసంగంలోని సారాంశం.
2009 ఎన్నికల సందర్భంలో డాక్టర్ జయశంకర్ ఫోనులో ‘ఏమని దీవించను? నువ్వు గెలవాలనా? ధర్మంగెలవాలనా?’ అని అనటం విని అడిగాను తర్వాత. ‘ఫోనులో ఎవరు సార్?’ అని. ఆయన నవ్వుతూ ‘అధర్మపురి శ్రీనివాస్, ఎన్నికల్లో నిలబడుతున్నాడట. నా దీవెనలు కావాలని ఫోన్ చేశాడు’ అన్నాడు. ఎప్పుడూ, ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించని ఆయన నోట ఈ మాట ఆశ్చర్యం కలిగించింది. అంత మాట అన్నారంటే కాంగ్రెస్ నేత శ్రీనివాస్ గురించి ఎన్ని విషయాలు తెలియాలి అనిపించింది.
నిజానికి సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ కానీ, ఉద్యమ నాయకుడు కేసీఆర్ కానీ ఏనాడూ సామాన్య ప్రజలకు, ఆంధ్రా సోదరులకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఒకటే మాట.. ‘మీ నీళ్ళు మాకు ఒక్క చుక్క వద్దు; మా నీళ్ళు ఒక్క చుక్క వదులుకోం. మా రాష్ట్ర వనరులు, నిధులు మా ప్రగతికి ఉపయోగపడాలి. మా ఉద్యోగాలు న్యాయబద్ధంగా మాకే రావాలి’ ఇవే ఉద్యమ సందేశాలు. ముఖ్యంగా తెలంగాణేతరుల పట్ల వ్యతిరేకత చూపమన్న వారి మాటలవల్లనే పద్నాలుగేండ్ల ఉద్యమం శాంతియుతంగా సాగి, విజయవంతంగా ముగిసింది.
ఇక తెలంగాణ వచ్చి మొట్టమొదటి ఎన్నికలు జరిగినప్పటి నుంచి, కేసీఆర్ ఒకేమాట పదేపదే చెప్తూ వచ్చారు. రాజకీయాల్లోనూ ప్రజలు సామాన్యంగా ఆశించే, పాటించే విలువలుండాలి. పదవి కోల్పోయినా ఫరవా లేదు, విలువలు కోల్పోకూడదు. అందుకు సుసంపన్నమైన తెలంగాణ సంస్కృతికి రాజకీయాల్లోనూ పెద్దపీట వేశారు. రాష్ర్టాన్ని ప్రగతిపథంలో నడిపించారు. కరెంటు నుంచి సాగునీరు, ప్రాజెక్టులు, పాఠశాల స్థాపన, సాంస్కృతిక పునరుజ్జీవనం.. ఇలా ప్రతిరంగంలోనూ అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల వలె పరుగులు పెట్టేటట్టు ప్రణాళికలు రూపొందించి, అమలుచేశారు. రెండవసారి ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించారు. అప్పుడూ ‘మాకు ఓటేయండి’ అన్న మాట ఎక్కడా అడగలేదు. ‘రాజకీయ పార్టీ ఏం చేసిం దో విశ్లేషించండి. తెలంగాణ రాష్ట్రమయ్యాక మీ ఊళ్లలో ఏయే మార్పులొచ్చాయో చర్చించం డి. ఆగం కావద్దు ఎన్నికలు మా పాలనకు పరీక్షలు. మీరు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయం డి’ అని చాలా ఉన్నతమైన విలువలు ప్రజాస్వామ్యంలో ఉండాలని చెప్పారు. ఆ ఆరేండ్లు చాలా ప్రశాంతంగా, రాష్ట్రప్రగతి కళ్లముందు కనిపిస్తుంటే తెలంగాణ ప్రజలు తమ కష్టాలు తీరాయన్న సంతోషంతో గడిపారు. ఎప్పుడైతే బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కొన్ని స్థానాలు సంపాదించిందో, అప్పటినుంచి తెలంగాణలో అశాంతి మొదలైంది. ఇక స్వర్గాన్ని దింపుతామని కొందరు బీజేపీ నాయకులు దుబ్బాక, హుజూరాబాద్, నిజామాబాద్, కరీంనగర్లో ఎన్నికల హామీలిచ్చి గెలిచారో, అప్పటినుంచీ తెలంగాణ ప్రజల మానసిక ప్రశాంతత మాయమైపోయింది. దుబ్బాకకు తెస్తానన్న కేంద్ర నిధులు, స్థాపిస్తామన్న సంస్థల గురించి, నిజామాబాద్ రైతులకు రాతపూర్వకంగా ఇచ్చిన పసుపు బోర్డు హామీ గురించి, టీఆర్ఎస్లో ఆత్మగౌరవం దెబ్బతిన్నదని ఒక మతతత్వ పార్టీలో చేరిన హుజూరాబాద్ నాయకుడికి దక్కతున్న గౌరవం గురించి ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అని ఆయా నాయకులు ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. టీఆర్ఎస్ పాలన అవినీతిమయమైందని పదేపదే ఆధారాలు చూపకుండానే నిందలు ఆపాదించటం ఇక సభ్యసమాజం సహించలేని భాషలో వ్యక్తిగతంగా కించపరచటం వారికి రోజువారీ చర్యగా మారింది. దీనికితోడు మత విద్వేషాన్ని వెళ్లగక్కుతూ హరితహారంతో ప్రాణవాయువును పెంచుతున్న తెలంగాణ వాతావరణాన్ని విషపూరితం చేస్తున్నారు రాష్ట్రంలోని బీజేపీ (వీరిని నాయకులు అనటానికి మనసు రావటం లేదు) ప్రతినిధులు.
అసలు మానవజాతికి మాత్రమే వరంగా వెలసిన భాష ఏం చెప్తుంది? మనిషి గురించి ఏం సూచిస్తుంది? నిజానికి మనిషి లోపలి భావాలు వారి మాటలు, చేతల వల్లనే ఇతరులకు తెలుస్తాయి. అయితే ఈ భావాల స్థాయిని, వారు వాడే భాష స్థాయి తెలుపుతుంది. ఉదాత్తమైన మనసున్న వారికి కిందిస్థాయి భాష పలకటానికి రాదు. భావాలు నీచమైనవైనప్పుడే భాషా సంస్కారం కూడా తగ్గుతుంది.
అందుకే ఒక మనిషి సంస్కారాన్ని వారు వాడే భాష వల్ల బేరీజు వేస్తారు. ఒక విమర్శ కూడా సంస్కారవంతమైన భాష ద్వారా వెలిబుచ్చితే, దానికి విలువ వస్తుంది. కానీ ఎవరైనా అసభ్యమైన భాష వాడితే అది వారి కుసంస్కారానికి, నీచమైన భావనలకు అద్దం పడుతుంది. ఇక వ్యక్తిగత విమర్శలు ఇటువంటి భాష ద్వారా చేసేవారు అసలు సభ్యసమాజంలో ఉండటానికి అర్హులు కారు.
ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ప్రస్తుతం సుపరిపాలన వలన పూర్తి భద్రతతో బతుకుతున్న తెలంగాణ సామాన్య ప్రజలకు రాజకీయాల్లో బీజేపీ విజయాలు- ఎంత కొద్దివైనా కూడా- ఆశనిపాతంలా దాపురించాయి. కేసీఆర్ను, కేటీఆర్ను వినకూడని మాటలతో తిట్టినా, బీజేపీవారిని వారిద్దరూ పట్టించుకోకపోవటంతో, పరిధిని అతిక్రమించి వారి కుటుంబసభ్యురాలైన శ్రీమతి కవితను వ్యక్తిగతంగా అవమానించటమే మార్గంగా ఎంచుకున్నాడు పసుపుబోర్డు అధర్మ పురి ప్రతినిధి. ఇతను ఇంత దిగజారి మాట్లాడటం, ప్రవర్తించటం ఎందుకు అని అర్థం చేసుకోవాలంటే ఒక సంఘటన గురించి తెలుసుకోవాలి. 2009 ఎన్నికల సందర్భంలో డాక్టర్ జయశంకర్ ఫోనులో ‘ఏమని దీవించను? నువ్వు గెలవాలనా? ధర్మం గెలవాలనా?’ అని అనటం విని అడిగాను తర్వాత. ‘ఫోనులో ఎవరు సార్?’ అని. ఆయన నవ్వు తూ ‘అధర్మపురి శ్రీనివాస్, ఎన్నికల్లో నిలబడుతున్నాడట. నా దీవెనలు కావాలని ఫోన్ చేశా డు’ అన్నారు. ఎప్పుడూ, ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించని ఆయన నోట ఈ మాట ఆశ్చర్యం కలిగించింది. అంతమాట అన్నారంటే కాంగ్రెస్ నేత శ్రీనివాస్ గురించి ఎన్ని విషయాలు తెలియాలి అనిపించింది. ఆ రోజు జయశంకర్ సార్ శ్రీనివాస్కు తెలంగాణ పట్ల ఏ మాత్రం అభిమానం లేదని, పచ్చి అవకాశవాది అనీ చెప్పారు. అలాగే కపిలవాయి దిలీప్కుమార్ (ఈయన తండ్రి జయశంకర్ గారి మిత్రుడు) గురించి కూడా మాట్లాడారు. వీరందరి అవకాశవాదం, స్వార్థపరత్వం గురించి తెలిసినా సార్ ఎప్పుడూ వారిగురించి ఒక్క పొల్లు మాట మాట్లాడలేదు. అదీ తెలంగాణ సంస్కారం!
ఇక ఇప్పుడు మన రాష్ట్ర ప్రజలు జాగ్రత్త పడాల్సింది మన సంస్కృతి, సంస్కారం గురిం చి. బీజేపీ పార్టీ ప్రతినిధుల భావాలు, మాటలు, చేష్టలు చూస్తున్నాం. వారుచేసిన ప్రమాణాలు ఎన్నికల తర్వాత ఎంత ఆనందం గా మర్చిపోతారో గమనించాం. అన్నం ఉడికిం దా అని తెలుసుకోవటానికి ఒక మెతుకు చాలు. బీజేపీ మోసాలు తెలుసుకోవడానికి ఈ నలుగురైదుగురు గెలిచిన సభ్యులు చాలు. ప్రజ లు అప్రమత్తంగా ఉండి, కేసీఆర్ చెప్పినట్టు విచక్షణతో రాష్ట్ర ప్రగతిని, టీఆర్ఎస్ పాలనను విశ్లేషించుకొని, తమ స్వాతంత్య్రం, సంస్కృతి ఎవరి చేతులలో భద్రంగా ఉంటాయో గమనించి, ఇకపై వచ్చే ఎన్నికలలో ఓటేయాలి. మతతత్వం, పేద, సామాన్య ప్రజల వ్యతిరేక పార్టీ అయిన బీజేపీ ఇంత కొద్దిమందితో, ఇం త కొద్దికాలంలో ఇంత అశాంతి సృష్టించి, ప్రగతినే అడ్డుకోగలిగితే, ఇంక ఆ పార్టీని బలోపేతం చేస్తే తెలంగాణ భవిష్యత్తు ఏమౌతుందో, సామాన్యుల బతుకులు ఎంత నాశనమవుతా యో తెలుసుకోవాలి.
యూపీ వలె మత విద్వేషాలు, రైతుల వ్యతిరేక చర్యలు ఈ రాష్ర్టాన్ని ఎక్కడికి తీసుకెడతాయో అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా అన్ని మతాలు, అన్ని భాషలకు చెందినవారు శతాబ్దాలుగా ప్రశాంతంగా బతికిన ఈ నేల మీద అదే సుహృద్భావంతో ప్రజలంతా జీవించాలంటే ఈ సంస్కారహీన పార్టీ అయిన బీజేపీకి ఇక్కడ స్థానం లేకుండాచేయాలి. ఇది కేవలం ఓటు ద్వారానే సాధించాలి! ఎన్నికల ముందు చేసిన ప్రమాణాల గురించి ప్రశ్నించి, గెలిచిన బీజేపీ ప్రతినిధులను తరమాలి. దాదాపు 46 ఏండ్ల ఉద్యమస్ఫూర్తితో గెలుచుకున్న తెలంగాణ సంస్కారాన్ని ‘ఈనగాచి కుక్కలు పాలు చేసినట్టు’ వదులుకోకూడదు. అది మన భవిష్యత్ తరాలకు మంచిది కాదు!
జై తెలంగాణ.
-కనకదుర్గ దంటు
89772 43484