దేశంలో పేదల బతుకులు ఇక మారవా? వారి కష్టాలు తీరేదెన్నడు? దేశ జనాభాలో 81 కోట్ల మంది పేదలున్నారు. కేంద్రం లక్షల కోట్లు ఖర్చుచేసి వీరికి ఉచితంగా రేషన్ అందిస్తున్నది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ పథకాన్ని పొడిగిస్తున్నది. ఉచితంగా ప్రతీ ఒక్కరికి రేషన్లో ఐదు కేజీల బియ్యం లేదా గోధుమలు ఇస్తున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ దాకే ఉన్న ఈ పథకాన్ని గుజరాత్, హిమాచల్ప్రదేశ్లో ఎన్నికల కారణంగా డిసెంబర్ వరకు పొడిగించింది.
ముఖ్యంగా దగాపడ్డ యువత ఆలోచించాలి. హంగర్ ఇండెక్స్లో ప్రపంచంలోనే 107 స్థానంలో ఉన్న భారత్లోని పేదల బతుకులు ఇంకెంతకాలం 5 కేజీల బియ్యం, గోధుమల మీద ఆధారపడి బతుకాలో చెప్పండి మోదీజీ? మోదీ తాన అంటే తందానా అనడానికి ఉయ్యాలా జంపాలా మీడియాకు దేశంలో కొదువ లేదు. ఈ పరిస్థితిలో దేశంలోని బుద్ధిజీవులు నేల మీది నిజాల్ని వెలికి తీయడానికి సిద్ధం కావాలి.
దేశంలోని కోట్ల మంది యువతకు ఉద్యోగాలు లేవు, పైగా వ్యవసాయ ఆధారిత కూలీలకు ఉపాధి హామీ పథకంలో కోతలు విధించడంతో ఉపాధి కరువైంది. దేశంలోని సుమారు 45 కోట్ల అసంఘటిత, వలస కార్మికుల్లో 70 శాతం మందికి సరైన పనులు లేవు. ఉద్యోగాలు లేకున్నా కష్టం చేసి సంపాదించుకోవడానికి ప్రభు త్వం ఎలాంటి పని చూపడం లేదు, చూపే పరిస్థితిలోనూ కేంద్రం లేదు. దేశంలో 18 కోట్ల మంది చదువుకున్న రిజిష్టర్డ్ నిరుద్యోగులు ఖాళీగా ఉంటున్నారు. ఇటీవల 75 వేల వివిధ ఉద్యోగాలు అం టూ ఉద్యోగాల భర్తీ లెక్కలను పీఎం నరేంద్ర మోదీ ఇచ్చారు. దాన్ని ఏదో ఉత్సవ కార్యక్రమం మాదిరి నిర్వహించారు, కానీ ఏ లెక్కన ఏ ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పలేదు. కనీసం భర్తీ చేశారో లేదో కూడా తెలియలేదు. ఇలా 2023 డిసెంబర్ దాకా పది లక్షల ఉద్యోగాలు ఇస్తారట! అంటే భర్తీ పేరుతో మాయలు చేయటం తప్ప ఉద్యోగాలు ఎవరికి వచ్చాయో, ఎవరు చేస్తున్నారో మాత్రం తెలియదన్నమాట. దేశంలో 2014 నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. అధికారంలోకి వస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలని ఇచ్చిన హామీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది.
వారు అన్నమాట ప్రకారం ఉద్యోగాల కల్పన జరిగి ఉంటే ఈ ఎనిమిదిన్నరేండ్ల పీఎం మోదీ పాలనలో 17 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఏటా కనీసం 12 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ విభాగాల్లో ఇప్పటిదాకా 28 లక్షల ఉద్యోగాల ఖాళీలను గుర్తించారు. అయినా వాటిని భర్తీ చేయాలనే ఆలోచన కేంద్రానికి లేదు. ఆ ఖాళీలకు నోటిఫికేషన్లు లేవు, ఒకప్పుడు రైల్వే, బ్యాంకుల్లో ఏటా వేలల్లో నియామకాల నోటిఫికేషన్లు ఉండేవి. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బ్యాంకుల, రైల్వేల ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, అమ్మకానికి పూనుకున్న తర్వాత నియామకాలు స్వల్పమైపోయాయి. ఒకరకంగా చెప్పాల్నంటే ఆ ఉద్యోగాల మీద యువతకు నమ్మకం పోయింది. మిలిటరీలో ఉద్యోగాల కోసం లక్షల మంది ట్రైనింగ్లు చేసి సిద్ధంగా ఉండేవారు. ఎప్పుడు రిక్రూట్మెంట్ నిర్వహించిన వేలాదిగా యువకులు పోటీపడి ఉద్యోగాలు సాధించేవారు. కానీ ‘అగ్నివీర్’ పథకం పేరిట ఈ భర్తీలను కూడా ఔట్సోర్సింగ్ ఉద్యోగం మాదిరి నాలుగున్నరేండ్లకే పరిమితం చేసింది. ఈ విధానాన్ని వ్యతిరేకిస్త్తూ దేశమంతా నిరసన తెలిపినా, ఆందోళనలు జరిగినా పథకాన్ని అమలుచేశారు. ఏండ్ల తరబడి శిక్షణ తీసుకున్న యువత ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో లక్ష ఉద్యోగాలకు 35 లక్షల మంది దరఖాస్తు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే దేశంలో ఒక్క అటెండర్ ఉద్యోగానికి 10 వేల దరఖాస్తులు వస్తున్న పరిస్థితి ఉన్నది. ఆ ఉద్యోగం కూడా వస్తుందన్న నమ్మకం యువతకు లేదు.
ఇంటికో ఉద్యోగం, ఉచిత విద్యుత్, వైద్యం, విద్య లాంటి హామీలతో బీజేపీ, ఆప్, కాంగ్రెస్లు గుజరాత్, హిమాచల్ప్రదేశ్ రాష్ర్టాలలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమం, ఉచితంగా అవి ఇవి అంటూ నేతలు ప్రజల్లో ఆశలు రేపుతూ ప్రచారం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రకటన అనంతరం ఇప్పటికే ఐదుసార్లు గుజరాత్కు వెళ్లారు. గుజరాత్ను నిర్మించిందే నేను అంటూ ఆయన ప్రచారం మొదలుపెట్టారు. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. ఆయన మాడల్గా చెబుతున్న సొంత రాష్ట్రం గుజరాత్లోని మోర్బీలో వంతెన ప్రమాదంలో 140 మంది మరణించిన సందర్భంలో ఆ రాష్ట్రంలోనే ఉన్నప్పటికీ రెండు రోజుల తర్వాత మోర్బీని సందర్శించారు. అంటే ఆయనకు ప్రజల మీద ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతున్నది. ప్రమాదంలో గాయపడిన వారిని అక్కడి దవాఖానలో పరామర్శించారు. ఆయన రాకముందు తలకింద దిండు కూడా గతి లేని ప్రభుత్వ దవాఖానలో గాయాలతో చికిత్స పొందుతున్న బాధితులకు పీఎం వస్తున్నాడనగానే తలతో పాటు కాలు కింద దిండు వచ్చేసింది. గోడలకు పెయింట్లు, వాటర్ కూలర్లు వచ్చేశాయి. అంతా కుశలమే అనే పరిస్థితి కనిపించిందంటే అతిశయోక్తి కాదు. దేశంలో ఒక దిక్కు అదుపు లేకుండా వంట గ్యాస్ సిలండర్ల, పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. ఇలా ఒక్కొక్కటిగా పరిశీలిస్తే మొత్తంగా కేంద్రంలో పీఎం నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజల అభీష్టాన్ని, అందులో నిరుద్యోగుల ఆశలపై పూర్తిగా నీళ్లు చల్లారని తేటతెల్లమవుతున్నది.
బుద్ధిజీవులు ఇప్పటికైనా జర ఆలోచించాలి. అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా దగాపడ్డ యువత ఆలోచించాలి. హంగర్ ఇండెక్స్లో ప్రపంచంలోనే 107 స్థానంలో ఉన్న భారత్లోని పేదల బతుకులు ఇంకెంతకాలం 5 కేజీల బియ్యం, గోధుమల మీద ఆధారపడి బతుకాలో చెప్పండి మోదీజీ? దేశం చివరికి సంతోషం ఇండెక్స్లోనూ వెనుకబడుతున్నది. ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. మోదీ తాన అంటే తందానా అనడానికి ఉయ్యాలా జంపాలా మీడియాకు దేశంలో కొదువ లేదు. ఈ పరిస్థితిలో దేశంలోని బుద్ధిజీవులు నేల మీది నిజాల్ని వెలికి తీయడానికి సిద్ధం కావాలి. అబద్ధాన్ని ఓడించి ధర్మస్థాపనకు ప్రతినబూనాలి. కుల, మతాలకతీతమైన సమాజం కోసం పాటుపడాలి.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-ఎండీ మునీర్
99518 65223