భారత రాజకీయాలను ఒక మలుపు తిప్పడానికి బీఆర్ఎస్కు మునుగోడు గడ్డ పునాదిరాయి వేసింది. మునుగోడైనా, ఢిల్లీ అయినా బీజేపీపై పోరాటంలో తగ్గేదేలే అని అంటున్నారు కేసీఆర్. ప్రజాస్వామ్యశక్తులతో కలిసి బీజేపీ ముక్త్ భారత్ సాధించడానికి ఆయన పట్టుదలగా పనిచేస్తున్నారు.
మునుగోడు విజయంతో బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. కాంట్రాక్టుల కోసం రాజగోపాల్ రెడ్డి కోవర్టుగా మారి అహంకారంతో రాజీనామా చేయడం వల్ల మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. అప్పనంగా సంపాదించిన వందల కోట్ల రూపాయలు కుమ్మరించి ఎన్ని అబద్ధాలు చెప్పినా మునుగోడులో బీజేపీ రాజకీయ పాచికలు పారలేదు. జనం వెర్రిబాగులోళ్ళు కాదనే తత్వం బీజేపీకి బోధపడింది. చైతన్య పూరితమైన మునుగోడు గడ్డ కమలం చెంప చెల్లు మనిపించింది. కేసీఆర్ ఉద్యమ నేతగా తెలంగాణవా సుల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకుంటూ రాష్ట్రం నలుచెరుగులా తిరిగిన సమయంలోనే కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నల్లగొండ దుఃఖాన్ని తీర్చడానికి ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు అందించి ఫ్లోరైడ్ సమస్యను శాశ్వతంగా దూరం చేశారు. ఇటీవల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను నిరసిస్తూ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ తరుణంలో మునుగోడు ఆయనకు అండగా నిలిచింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను, రాజ్యాంగబద్ధ సంస్థలను అడ్డుపెట్టుకొని రాష్ర్టాల్లో ప్రజా ప్రభుత్వాలను కూలదోస్తున్నది. ప్రలోభాలతో, కుతంత్రాలతో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే రచన సాగిస్తున్నది. అర్హత లేకున్నా రూ.18 వేల కోట్ల కాంట్రాక్టులు ఆశ చూపి రాజగోపాల్రెడ్డితో ఉప ఎన్నిక తెప్పించింది. మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ విధానమని తెలిసిన మునుగోడు ప్రజలు ఆ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టారు. ఉప ఎన్నిక కుట్ర చాలదన్నట్లు టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నించింది. కానీ ఈ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి తెలంగాణలో తమకున్న కొద్దిపాటి సానుభూతిని పొగొట్టుకున్నది.
దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేదని అనుకున్న తరుణంలో కేసీఆర్ దేశానికి టార్చ్ బేరర్లా కనిపించారు. ఆయన దేశ రాజకీయాల్లోకి రావడాన్ని 140 కోట్ల మంది భారతీయు లు స్వాగతించారు. కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించడంతో బీజేపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ పార్టీ గుండెల్లో చావు డప్పులు మోగాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ రాజకీయ పోరాటానికి సిద్ధమైంది. శిథిలమవుతున్న భారత ఆర్థికవ్యవస్థకు ప్రాణం పోసేందుకు; వ్యవసాయం, కుల, చేతి వృత్తి దారుల్లో జవసత్వాలు నింపేందుకు కేసీఆర్ అహోరాత్రులు కృషిచేస్తున్నారు.
సమాఖ్య స్ఫూర్తిని కాలరాసి రాష్ర్టాలపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు మునుగోడు ప్రజలందించిన విజయంతో ముం దుకు కదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీని వ్యతిరేకించేపార్టీల నేతలతో కేసీఆర్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. జాతీ య స్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న బీజేపీ యేతర, కాంగ్రెసేతర రాజకీయ నేతలతో నిరంతరం చర్చిస్తున్నారు. ప్రధానమంత్రి సొంత గడ్డ గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ పతనానికి నాందిపలకాలని, అక్కడ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేయాలని ఆలోచిస్తున్నారు. కేసీఆర్ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే బీజేపీ ముక్త్ భారత్ సాధ్యమవుతుంది!
(వ్యాసకర్త: జర్నలిజం
శాఖ విభాగాధిపతి, కాకతీయ యూనివర్సిటీ)
డాక్టర్ సంగని మల్లేశ్వర్
98662 55355