ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్)కు సంబంధించిన ధాన్యం సేకరణ విధానాన్ని మార్చాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.పీడీఎస్ను సంస్కరిస్తే ప్రజల ఆకలికేకలు మిన్నంటుతాయన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. అంతిమంగా పీడీఎస్ను ప్రైవేటీకరించి ప్రైవేటు వ్యక్తులకే లాభాలు అందించాలని చూస్తున్నది.
పీడీఎస్ ద్వారా పేదలకు ఆహారధాన్యాలను పంపిణీ చేయడాన్ని కేంద్రం ‘ప్రమాదంగా, ఆర్థిక భారంగా’ భావించడమే ప్రస్తుత దుస్థితికి కారణం. కేంద్రం ఈ విధానాన్ని నిలిపేయాలని భావిస్తే భవిష్యత్తులో మనకు ఎక్కడా రేషన్ షాపులు కనిపించవు. వ్యాపారులు ఎవరైనా కఠినమైన నియంత్రణలతో స్వేచ్ఛగా బహిరంగ మార్కెట్లో ఆహారధాన్యాలను అమ్ముకునే అవకాశం ఏర్పడుతుంది.
దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి, సేకరణ, నిల్వలు సంక్షోభంలో ఉన్న సమయంలోనే కేంద్రం పీడీఎస్ను సంస్కరించాలని చూస్తున్నది. 2022-23 మొదటి ముందస్తు అంచనాల ప్రకారం ఖరీఫ్లో 10.4 కోట్ల టన్నుల బియ్యం పండవచ్చు. గతేడాదితో పోలిస్తే ఇది 6 శాతం తక్కువ. పప్పు ధాన్యాల దిగుబడిది అదే పరిస్థితి. ఈ ఏడాది ఆరు రకాల నూనె గింజలన్నీ కలిపి 23.57 కోట్ల టన్నుల దిగుబడి రావచ్చని అంచనా. రుతుపవనాలు దారితప్పడమే ఈ ఏడాది దిగుబడి తగ్గడానికి కారణం. ఉత్తరాదిలో వేడిగాలుల ప్రభావం వల్ల 2021-22 రబీ సీజన్లో గోధుమల దిగుబడి 10.59 కోట్ల టన్నులుగా నమోదైంది. 2020-21తో పోలిస్తే 3 లక్షల టన్నుల దిగుబడి తగ్గింది. ఈ ఖరీఫ్లో వరి, పప్పుధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిలో తగ్గుదల నమోదైనా, గతంలో ఉన్న నిల్వలు దేశీయ అవసరాలకు సరిపోతున్నాయి. కానీ ప్రస్తుతం కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల ఆహారధాన్యాల నిర్వహణలో సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉన్నది.
గత మూడేండ్ల గణాంకాలను పరిశీలిస్తే ఆహారధాన్యాల నిల్వలు తగ్గిపోవడం దిగ్భ్రాంతికి గురిచేస్తున్నది. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్లో 293 లక్షల టన్నుల ఆహారధాన్యాల నిల్వలు తగ్గాయి. ముఖ్యంగా గోధుమ నిల్వలు గతేడాది 518 లక్షల టన్నులుండగా అవి ఈ ఏడాది 248 లక్షల టన్నులకు పడిపోయాయి. బియ్యం నిల్వలు 268 లక్షల టన్నుల నుంచి 245 లక్షల టన్నులకు పడిపోయాయి. కేంద్ర ప్రభుత్వ హ్రస్వ దృష్టి, అసమర్థ నిర్వహణే ఈ సంక్షోభానికి కారణం. గతేడాది 13.02 కోట్ల టన్ను ల బియ్యం దిగుబడి వచ్చినా, కేంద్రం ఈ ఏడాది 55 లక్షల టన్నుల బియ్యాన్ని గోధుమలకు బదులుగా పంపిణీ చేసింది. దీనివల్ల బియ్యం నిల్వలు తగ్గాయి. ఇది సరే మరి గోధుమల నిల్వలు ఎందుకు తగ్గాయి?
ఈ ఏడాది ఏప్రిల్లో మార్కెట్లోకి వచ్చిన గోధుమలను వెంటనే ఎగుమతి చేయడం వల్ల దేశీయ నిల్వలు తగ్గాయి. కేం ద్ర ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల వ్యాపారులు భారీగా గోధుమలు కొనుగోలు చేశారు. దీనివల్ల ఈ ఏడాది 187 లక్షల టన్నుల గోధుమలు మాత్రమే కేంద్రం సేకరించి నిల్వ చేయగలిగింది. గతేడాది మాత్రం 433 లక్షల టన్నుల గోధుమలను సేకరించి నిల్వచేసింది. చివరి నిమిషంలో తన తప్పు తెలుసుకున్న కేంద్రం గోధుమల ఎగుమతులపై నిషేధం విధించింది. దీనివల్ల గోదాముల్లో, నౌకాశ్రయాల్లో వేల కొద్దీ టన్నుల గోధుమలు మూలుగుతున్నాయి. ఇవి ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం సేకరించడానికి లేదా ఎగుమతులకు అందుబాటులో లేకుండా పోవడమే ప్రస్తుత సంక్షోభానికి కారణం.
అర్థరహితమైన ప్రణాళికలే కారణం: ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన’ ద్వారా మే 2020 నుంచి రేషన్ కార్డున్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి నెలకు 5 కేజీల ఆహారధాన్యాలను కేంద్రం పంపిణీ చేస్తున్నది. అయితే ‘నిపుణులు’ కొందరు ఈ పంపిణీని కొనసాగించడం వల్ల ప్రభుత్వంపై చాలా భారం పడుతుందని, కాబట్టి దీన్ని ఆపేయాలని సూచిస్తున్నారు! కానీ ఆహారధాన్యాల పంపిణీ ఆపేస్తే ప్రభుత్వానికి బాగా చెడ్డ పేరు వస్తుందని ప్రధాని మోదీ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆహారవిభాగం కార్యదర్శి సుధాంశు పాండే ఆహార ధాన్యాల సేకరణ విధానాన్ని గాడిలో పెట్టడానికి చాలా సూచనలు చేశారు. వ్యాపారులు తమ వద్ద ఎన్ని గోధుమ నిల్వలు న్నాయో వెల్లడించాలని, వారు నిల్వ ఉంచే గోధుమలపై పరిమితి విధించాలని సూచించారు. కేంద్రం సేకరించకుండా, వ్యాపారులు ఎగుమతి చేయకుండా గోదాముల్లో మూలుగుతున్న గోధుమల లెక్కలు వెలికితీయడానికే ఆయన ఈ సూచ న చేశారు. కానీ ఆ గోధుమలన్నీ కొంచెం కొంచెంగా బహిరంగ మార్కెట్కు తరలిపోతున్నాయి. ఈ కృత్రిమ కొరత కారణంగా కొన్ని నెలలుగా గోధుమల ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
పీడీఎస్ ద్వారా పేదలకు ఆహారధాన్యాలను పంపిణీ చేయడాన్ని కేంద్రం ‘ప్రమాదంగా, ఆర్థిక భారంగా’ భావించడమే ప్రస్తుత దుస్థితికి కారణం. కేంద్రం ఈ విధానాన్ని నిలిపేయాలని భావిస్తే భవిష్యత్తులో మనకు ఎక్కడా రేషన్ షాపులు కనిపించవు. వ్యాపారులు ఎవరైనా కఠినమైన నియంత్రణలతో స్వేచ్ఛగా బహిరంగ మార్కెట్లో ఆహారధాన్యాలను అమ్ముకునే అవకాశం ఏర్పడుతుంది. ఒకసారి అమలుచేస్తే దీనివల్ల కలిగే దుష్ఫలితాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. కానీ వచ్చే ఏడా ది నుంచే ప్రైవేటు వ్యక్తులకు ఆహారధాన్యాల సేకరణ అప్పగించే అవకాశం ఉన్నది. ఇటీవల తాను హాజరైన అంతర్జాతీ య ధాన్యాల సదస్సులో ప్రైవేటు కంపెనీలు ధాన్యాల సేకరణ సమర్థంగా నిర్వహిస్తాయన్న అభిప్రాయం వెల్లడైందని సుధాంశు తెలిపారు. ఆహారధాన్యాల సేకరణ ఖర్చును వాటి ధరతో బేరీజు వేసి ఇకపై 2 శాతానికి తగ్గిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ర్టాలకు 6 నుంచి 8 శాతం మొత్తాన్ని సేకరణ ఖర్చులకు ఇస్తున్నామని, ఇది చాలా ఎక్కువని ఆయన వాపోయారు.
పేదలకు తక్కువ ధరలో ఆహార ధాన్యాలను అందించే ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరించడానికి కేంద్రం రంగం సిద్ధం చేస్తున్నది. దీని వల్ల రానున్న రోజుల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆహార భద్రత దారుణంగా దెబ్బ తింటాయి. అప్పుడు లాభార్జనే ధ్యేయంగా కలిగిన ప్రైవేటు వ్యక్తులే పీడీఎస్ కోసం ఆహార ధాన్యాలను సేకరిస్తారు.
– సుబోధ్ వర్మ (‘న్యూస్ క్లిక్’ సౌజన్యంతో..)