ఏడాది తర్వాత రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. ఇలాంటి స్థితిలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు కారణమైండు. తన నియోజకవర్గంలో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయడం లేదన్న సాకుతో రాజీనామా చేశాడు. ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలున్నాయి. రాజీనామా చేస్తేనే పనులు జరుగుతాయనేది తప్పుడు సంకేతం ఒకటి కాగా, కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి రాజీనామా చేసిన రాజగోపాల్రెడ్డి తాజాగా బీజేపీ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో పోటీ చేయటం వింతైన రెండో అంశం.
తెలంగాణలో పాగా వేసేందుకు మునుగోడు నియోజకవర్గాన్ని బీజేపీ ఒక ప్రయోగశాలగా ఎంపిక చేసుకున్నది. అయితే, చైతన్యవంతమైన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రజలందరితో పాటు మునుగోడు నియోజకవర్గ ప్రజలు, ఈ ఉప ఎన్నికకు సంబంధించి రాజగోపాల్ రెడ్డి స్వప్రయోజనాన్ని బీజేపీ అంతర్గత ఎజెండాగా స్పష్టంగా అర్థం చేసుకున్నారు.
మునుగోడు నియోజకవర్గం పట్ల ప్రభుత్వం నిజంగానే పక్షపాత వైఖరి అవలంబిస్తున్నదని ఆయన భావించినట్లయితే గతంలో ఎంపీగా, ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించినప్పుడు జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలి. అభివృద్ధి కార్యక్రమాలు జరుగకపోతే ఎమ్మెల్యేగా ఆయన చట్టసభలో ప్రభుత్వంపై ప్రజావాణి గట్టిగా వినిపించి ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టాలి. లేదా ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వాన్ని ఒప్పించి అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి కృషిచేయాలి. ఆ పని చేయకుండా పిరికిపంద వలె ఏ పోరాటం చేయకుండా రాజీనామా చేసి ఉప ఎన్నిక తీసుకురావడం చేతకానితనానికి నిదర్శనం. వాస్తవంగా తన సొంత ప్రయోజనాల కోసమే ఈ ఎన్నిక తీసుకొచ్చారని ప్రజలు భావిస్తున్నారు. అదే నిజం కూడా.
రాజగోపాల్రెడ్డి ఒక రాజకీయ నాయకుడే కాదు, దేశంలో గుర్తింపు పొందిన కాంట్రాక్టర్లలో ఒకడు. కేంద్ర బీజేపీ పాలకులు తనకు రూ.18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు పని కట్టబెట్టారని ఆయన స్వయంగా ప్రకటించడం గమనార్హం. ‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే, దూడ మేత కోసం’ అన్నట్టు, తన స్వప్రయోజనాన్ని మునుగోడు అభివృద్ధితో ముడిపెట్టి ప్రచారం చేయడాన్ని మునుగోడు ప్రజలు అర్థం చేసుకోనంత అమాయకులు కాదు. తన స్వార్థ ప్రయోజనాలకు బీజేపీ నేతల అంతర్గత ఎజెండాను అభివృద్ధి కార్యక్రమాలకు ముడివేయడాన్ని ప్రజలు అర్థం చేసుకోవడంతో ఆయనకు చలి జ్వరం పట్టుకున్నది. మునుగోడు నియోజకవర్గంలో తమ ఓటమి ఖాయమని తెలిసిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయనకు బడా కాంట్రాక్టు అప్పగించడంతో పాటు, రాజకీయ ఆశ్రయం ఇచ్చిన బీజేపీ నేతలు కమ్యూనిస్టుల మీద సంధి ప్రేలాపనలకు దిగారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. దేశంలో తమకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను అక్రమ పద్ధతుల్లో, అనైతికంగా, అప్రజాస్వామికంగా కూల్చి అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటున్నది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను నామరూపాలు లేకుండా చేయడానికి పూనుకుంటున్నది. దాంట్లో భాగంగానే తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వందల కోట్ల రూపాయలతో, మధ్యవర్తులుగా స్వాములను ఉపయోగించి కొనడానికి ప్రయత్నం చేసి బయటపడ్డ విషయం ప్రజలందరికీ తెలుసు. బీజేపీ వారికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడినా ఈడీ, సీబీఐలతో దాడులు చేయించి కేసులు పెట్టి వేధిస్తున్నారు. బీజేపీలో చేరితే నీతిపరులు, ఆ పార్టీని వ్యతిరేకిస్తే అవినీతిపరులు. అంతేకాకుండా ‘ఒకే దేశం, ఒకే జాతి, ఒకే సంస్కృతి’ అంటూ ప్రజలను చీలుస్తూ మత సామరస్యాన్ని సమాధి చేస్తున్నారు.
శాంతియుత ప్రజా జీవనాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఈ దేశ ప్రజల భవిష్యత్తును బడా పెట్టుబడిదారులకు తాకట్టు పెడుతూ నిరంకుశపాలన కొనసాగిస్తున్నారు. మరో మారు అధికారంలోకి వచ్చేందుకు, విచ్ఛిన్నకర రాజకీయ ఎత్తుగడలకు పూనుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పాగా వేసేందుకు ఉప ఎన్నిక ద్వారా మునుగోడు నియోజకవర్గాన్ని బీజేపీ ఒక ప్రయోగశాలగా ఎంపిక చేసుకున్నది. అందుకు బడా కాంట్రాక్టర్ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీకి బలమైన ఎరగా కనబడ్డారు. అయితే, చైతన్యవంతమైన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రజలందరితో పాటు మునుగోడు నియోజకవర్గ ప్రజలు, ఈ ఉప ఎన్నికకు సంబంధించి రాజగోపాల్రెడ్డి స్వప్రయోజనాన్ని బీజేపీ అంతర్గత ఎజెండాగా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మతతత్వ, విచ్ఛిన్నకర, ఫాసిస్టు విధానాలను తిప్పికొట్టేందుకు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చాయి. ఈ ఐక్య సంఘటనతో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి, బీజేపీ నాయకులకు ఓటమి భయం పట్టుకున్నది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో అవకాశవాద, విచ్ఛిన్నకర రాజకీయాలకు సమాధి కడుతా మని మునుగోడు ప్రజలు తీర్పు చెప్పడం ఖాయం.
(వ్యాసకర్త: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ శాసనసభాపక్ష నాయకుడు)
-జూలకంటి రంగారెడ్డి