భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ర్టానికి, ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాలకు చేస్తున్న తీవ్ర అన్యాయాన్ని, వివక్షను చూశాక ఆ పార్టీలో కొనసాగడంలో ఏ మాత్రం అర్థం లేదని భావిస్తున్నాను. తెలంగాణ రాష్ర్టానికి అండగా ఉంటామంటూ బీజేపీ చేసిన వాగ్దానాలను నమ్మి ఆ పార్టీలో చేరాను. మాజీ ఎమ్మెల్యేగా, సీనియర్ నాయకునిగా రాజకీయాల్లో దాదాపు రెండున్నర దశాబ్దాల అనుభవం ఉన్న నాకు ఆ పార్టీలో చేరిన నాటినుంచి అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. పార్టీలో నాలాంటి బీసీ నాయకులను పట్టించుకొనేవారే లేరు. పైగా ఈ మధ్యకాలంలో పదే పదే తెలంగాణ రాష్ర్టానికి, బడుగు, బలహీనవర్గాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ తీసుకుంటున్న పలు నిర్ణయాలు ఆ పార్టీలో నన్ను కొనసాగకుండా చేశాయి.
ప్రధాని మొదలు కేంద్రమంత్రుల దాకా ప్రతి ఒక్కరూ డబుల్ ఇంజిన్ సర్కార్ పేరిట మాటలు చెప్పారే కానీ, తెలంగాణకు నయా పైసా అదన పు సాయం చేయలేదు. ఇక్కడ మా సర్కారు ఉంటేనే నిధులి స్తాం, అప్పటిదాకా ఈ రాష్ర్టాన్ని పట్టించుకోమన్నట్లు కేంద్రం వ్యవహరిస్తున్నది. బీజేపీ చెప్తున్న డబుల్ ఇంజిన్ సర్కారు నమూ నా డొల్లతనానికి ఇది నిదర్శనం. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తుందని ఎదురుచూశాను. కానీ నాకు నిరాశే ఎదురైంది. నేతన్నలకు అమలుచేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను కేంద్రం రద్దు చేసింది. చేనేత రంగంపై జీఎస్టీ విధించి చేనేత పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టింది. పద్మశాలి సోదరులపై మోయలేని పన్ను వేయడం నాకెంతో బాధ కలిగించింది. తెలంగాణ బీజేపీ నాయకులపై బీజేపీ అధిష్ఠానానికి ఏ మాత్రం పట్టులేదనే విషయం ఆ పార్టీలో చేరిన కొద్దికాలానికే నాకు అర్థమైంది. గత దశాబ్దకాలంలో తెలంగాణలో ఎలాంటి మత ఘర్షణలు జరగకుండా శాంతియుత వాతావరణం ఉన్నది. కానీ తెలంగాణ బీజేపీ నేతలు ఆ వాతావరణాన్ని చెడగొట్టేలా విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ హైకమాండ్ వారి వ్యాఖ్యలను ఖండించకపోవడం నన్ను కలచివేసింది. హిందూ సమాజం భావోద్వేగాలను రెచ్చగొట్టడమే బీజేపీ పనిగా పెట్టుకున్నది. ఆధునిక భారతదేశ చరిత్రలో అద్భుతంగా నిర్మించారని పలువురి ప్రశంసలందుకుంటున్న యాదాద్రి ఆలయానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. దీన్నిబట్టి వారి మాటలకు, చేతలకు పొంతన లేదని అర్థం అవుతున్నది.
నా చిన్నతనం నుంచి చూస్తున్న ఫ్లోరైడ్ రక్కసిని మిషన్ భగీరథ కార్యక్రమంతో తెలంగాణ ప్రభుత్వం తరిమికొట్టింది. ఈ పథకానికి కేంద్రం ఒక్క రూపాయీ ఇవ్వలేదు. 2016లో అప్పటి కేంద్ర ఆరోగ్య మంత్రి, ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడైన జేపీ నడ్డా మర్రిగూడలో ఫ్లోరైడ్ బాధితుల కోసం 300 పడకల దవాఖాన హామీ కట్టిస్తానన్నారు. ఆ హామీకి నేటికీ అతీగతి లేదు. చౌటుప్పల్లో ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని కూడా నడ్డా హామీ ఇచ్చారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించినప్పటికీ కేంద్రం నయా పైసా మంజూరు చేయలేదు. ఫ్లోరైడ్ బాధితులకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి బీజేపీ మాట తప్పింది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి సోదరులు వందలాది గౌడ్ సోదరుల రాజకీయ జీవితాలను సమాధి చేశారు. కోమటిరెడ్డి సోదరుల దుర్మార్గపు రాజకీయాల నుంచి దూరంగా ఉండేందుకే బీజేపీలో చేరాను. కానీ రాజగోపాల్రెడ్డి కాంట్రాక్టుల కోసం బీజేపీలో చేరారు. ఆయనకు వేల కోట్ల లాభం వచ్చేందుకు ఉప ఎన్నిక తెచ్చిన బీజేపీ.. మనోభావాలకు విలువ లేకుండా చేసింది. రాజగోపాల్రెడ్డి రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. తెలంగాణకు నిధులు ఇవ్వకుండా, దక్కాల్సినవి ఆపుతున్న కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆ పార్టీని వీడుతున్నాను. ఇప్పటికైనా శాంతి యుతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మత చిచ్చు రగిలించవద్దని బీజేపీకి విజ్ఞప్తి చేస్తున్నాను. కనీసం ఈ ఉప ఎన్నిక సందర్భంగా అయినా మునుగోడు నియోజకవర్గానికి బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చి తన నిబద్ధత నిరూపించుకోవాలని కోరుతున్నా.
-బూడిద బిక్షమయ్య గౌడ్ , (మాజీ ఎమ్మెల్యే, ఆలేరు)