ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు సేవ చేయడంలో పోలీసులు నిజమైన హీరోలు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసులను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా ఏటా ‘అక్టోబరు 21’వ తేదీని ‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినం’గా పాటిస్తున్నాం.
లడఖ్ సరిహద్దులో కరమ్సింగ్ నేతృత్వంలోని 20 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల బృందం విధులు నిర్వహిస్తుండగా… 1959, అక్టోబర్ 21న చైనా సైన్యం వారిపై దాడిచేసింది. ఈ దాడిలో పది మంది భారత సైనికులు వీరమరణం పొందారు. వారి స్మరణలో ఏటా అక్టోబర్ 21న ‘పోలీస్ అమరవీరుల దినోత్సవం’గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. సమాజంలో పోలీసుల బాధ్యత గొప్పది. వారి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడానికి, అమరులైన పోలీసులను స్మరించుకోవడం, వారి కుటుంబాలకు మేమున్నామనే భరోసానివ్వడం ఈ సంస్మరణ దినోత్సవ ముఖ్య ఉద్దేశం.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటివరకు విధి నిర్వహణలో 34,418 మంది పోలీసులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. గతేడాది దేశవ్యాప్తంగా 377 మంది పోలీసులు వీరమరణం పొం దారు. ఇటీవల చైనా సరిహద్దు ఘర్షణలో తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్కుమార్ వీర మరణం పొందారు. ప్రజలను రక్షించడానికి, ప్రజల భవిష్యత్కు భరోసా ఇవ్వడానికి తమ జీవితాలను త్యాగం చేసిన వారిని స్మరించుకోవడం ప్రతి పౌరుని బాధ్యత. దీంతో పాటు వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలపాలి. వారికి మేమున్నామనే భరోసాను ఇవ్వాల్సిన అవసరం ఈ పౌర సమాజంపై ఎంతైనా ఉన్నది.
పోలీసు విధి నిర్వహణ బాధ్యతతో కూడుకున్నది. ఇతర ఉద్యోగుల వలె రోజులో కొన్ని గంటలకు మాత్రమే పరిమితమైంది కాదు. 24 గంటల ఉద్యోగం చేసే వ్యక్తి పోలీసు మాత్రమే. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం. ప్రజలకు ఏ ఆపద వచ్చినా ముందుగా ఆశ్రయించేది పోలీసులనే. అన్ని పరిస్థితుల్లో అన్నివేళల్లో పోలీసులే ముందుంటారు. విదేశీ శత్రుమూకల నుంచి దేశాన్ని కాపాడేవారు సైనికులైతే అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడేవారు పోలీసులు. ప్రజలకు భద్రతను, భరోసా ఇచ్చేది, సామాజిక ఆస్తులను సంరక్షించేది పోలీసులు. శాంతిభద్రతలను అదుపులో పెట్టడం, నేరాలను నియంత్రించడం పోలీసు కర్తవ్యం.
గతంలో పోలీసులు అంటే సామాన్య ప్రజానీకంలో ఒక విధమైన వ్యతిరేక భావన ఉండేది. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ను ప్రోత్సహిస్తున్నది. తద్వారా పోలీసులపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కనుమరుగైంది. గత ఎనిమిదేండ్లుగా రాష్ట్రంలో పోలీసులు అధికారులు స్నేహపూర్వకంగా మెదలడమేకాకుండా ప్రజలకు అండగా నిలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘షీ’ టీమ్స్ ఫలితంగా మహిళలపై అరాచకాలు, అఘాయిత్యాలు కనుమరుగయ్యాయి. వారి సేవలను వివరిసున్న కొద్దీ కొల్లలుగా వస్తుంటాయి. వారి సేవలు అనన్య సామాన్యం.
(నేడు పోలీస్ సంస్మరణ దినోత్సవం)
-సీవీవీ ప్రసాద్ , 80196 08475