బ్రిటన్-భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్టీఏను) దీపావళిలోపు కుదుర్చుకోవాలన్న ఇరుదేశాల లక్ష్యం నెరవేరేలా లేదు. రెండు దేశాలకూ ప్రయోజనం కలిగించేలా ఉన్న ఈ ఒప్పందానికి ఈ ఏడాది మొదట్లో అడుగులు పడ్డాయి. ఏప్రిల్లో భారత్కు వచ్చిన అప్పటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. దీపావళిలోపు ఎఫ్టీఏను పూర్తి చేద్దామని ప్రతిపాదించారు. ఆ దిశగా పలుమార్లు చర్చలు సాఫీగానే జరిగాయి. కానీ, బ్రిటన్లో మారిన రాజకీయ పరిస్థితులు, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ ఒప్పందంపై ప్రభావం చూపాయి. ఆ దేశ హోంమంత్రి స్యూలా బ్రేవర్మన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. భారత్తో ఎఫ్టీఏను కుదుర్చుకుంటే దేశ సరిహద్దులను భారతీయులకు బార్లా తెరిచినట్లే అవుతుందని, ఆ దేశం నుంచి వలసలు విపరీతంగా పెరిగిపోవచ్చని, ఇప్పటికే బ్రిటన్లో వీసా గడువు తీరినా అనేక మంది భారతీయులు ఇక్కడే ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు.
బ్రిటన్ హోంమంత్రి వ్యాఖ్యలతో ఎఫ్టీఏ ఇక సాకారం కాకపోవచ్చని మీడియా విశ్లేషణలను వెలువరించింది. బ్రిటన్ ఆర్థికమంత్రి కూడా తాము గడువు మీద కన్నా ఒప్పందంలోని అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టామని వ్యాఖ్యానించారు. అయితే, భారత్ మాత్రం దీనిపై ఆచితూచి వ్యవహరించింది. బ్రిటన్ హోంమంత్రి వ్యాఖ్యలపై ఆ దేశం నుంచి అధికారికంగా తమకు ఏమీ సమాచారం రాలేదని, కాబట్టి 0ఒప్పందం ప్రక్రియ కొనసాగుతున్నదని స్పష్టం చేసింది. వాస్తవానికి, ఈ ఒప్పందంపై అందరికన్నా ఎక్కువగా బ్రిటన్లో స్కాచ్ విస్కీ పరిశ్రమ భారీ ఆశలు పెట్టుకున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ మార్కెట్ అయిన భారత్లోకి దీపావళి పండుగలోపే ప్రవేశించాలని స్కాచ్ పరిశ్రమాధిపతులు భావించారు. కానీ సకాలంలో ఎఫ్టీఏ కుదుర్చుకోకుండా వారి సర్కారే వారికి మొండిచెయ్యి చూపింది.
అంతర్జాతీయరంగంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో పాశ్చాత్య సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి చైనాకు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అనుకూలంగా కనిపిస్తున్నది. బ్రెగ్జిట్ మూలంగా కూడా బ్రిటన్ దృష్టిలో భారత్ ప్రాధాన్యం పెరిగింది. సుంకాలు, పన్నుల భారం లేకుండా వ్యాపార కార్యకలాపాలకు అవకాశం కల్పించే ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ భాగస్వామ్య దేశాలకు ఉభయ ప్రయోజనకారిగా ఉంటుంది. కానీ ఏ ఒప్పందం కూడా పూర్తిగా షరతులు, మినహాయింపులు లేకుండా ఉండదు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మూలంగా ఎగుమతులను మించి దిగుమతులు పెరిగే ప్రమాదం ఉన్నది. గతంలో తూర్పు, ఆగ్నేయాసియా దేశాలతో ఒప్పందాల తరువాత ఇదే జరిగింది. మోదీ ప్రభుత్వ విధానాల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుదేలైంది. దీంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల నుంచి ఆశించిన ఫలితాలను రాబట్టగలదా అనే సందేహాలు కలుగుతున్నాయి.