ఒక చారిత్రక సన్నివేశం కొన్ని గంటల్లో ఆవిష్కృతం కాబోతున్నది. ఒక అద్భుత ఘట్టానికి నాందీవాక్యం పలికే క్షణం ఆసన్నమైంది. తెలంగాణ చరిత్రలోనే కాదు, భావి భారత చరిత్రలో నమోదయ్యే ఒక నూతన శకారంభానికి ఊపిరినివ్వబోయే ఉద్విగ్నభరిత ఘడియలకు శ్రీకారం చుట్టబోతున్నది. జనమే జీవితం, ప్రజలే ప్రభువులు, జాతిహితమే తన హితం అనుకొని కర్షకులు, కార్మికులు, తాడితులు, పీడితులు, పండితులు, పామరులు, కులవృత్తులు, జనవృత్తులు, వ్యాపారం, వ్యవహారం, లోకా సమస్త సుఖినోభవంతు అని మనసా వాచా కర్మణా భావించే నాయకమణ్యుడు, పోరాటఝరి, దార్శనికుడు కేసీఆర్ యావత్ భారతజాతి ఆశలకు, ఆకాంక్షలకు, వెన్నుదన్నుగా నేను సైతం అంటూ జాతీయ యవనికపై తన ప్రారంభాన్ని అధికారికంగా ప్రకటించేందుకు ముహూర్తం సిద్ధమైన వేళ, ప్రజలు, రాజకీయ విమర్శకులు, పత్రికాధిపతులు, వివిధరంగాల నిష్ణాతులు, ఒక చిన్నదైన, నూతన రాష్ట్రం నుంచి ఇదెలా సాధ్యమన్న మీమాంసలో ఉన్న వేళ చరిత్రలోని కొన్ని సన్నివేశాలు, పాలిస్తున్న పార్టీ పదనిసలు, అవకాశానవకాశాల, దొంతరలను ఒక్కసారి పరికించే ప్రయత్నమే ఈ వ్యాసం.
‘యదా యదా హి ధర్మస్య
గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం
సృజామ్యహమ్’
‘ఓ భరత వంశీయుడా, అర్జునా, ధర్మం నశించి, అధర్మం
పెచ్చు మీరినప్పుడల్లా నన్ను
నేనే సృష్టించుకుంటూ ఉంటాను.’
‘యద్య దాచరతి శ్రేష్ఠ స్తత్త దేవేతరో జనః
స యత్ప్రమాణం కురుతే లోక
స్తదనువర్తతే॥
ఉత్తములు దేనిని ఆచరిస్తారో, అన్యులు కూడా దానినే ఆచరిస్తారు. ఉత్తముడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే సమస్త లోకం అనుసరిస్తుంది.
ఎప్పుడైతే సమాజం తనని పాలకులు విస్మరిస్తున్నారని, ప్రజా శ్రేయస్సును నిర్లక్ష్యం చేస్తున్నారని, తద్వారా ఈ తరమే కాదు భావితరం కూడా నష్టపోతుందని భావిస్తుందో, మనుగడే ప్రశ్నార్థకమని తలుస్తుందో అప్పుడు తానే ఒక నాయకున్ని సృష్టించుకుంటుంది. ఆ సృష్టిక్రమంలో నాయకున్ని ఆపాదమస్తకం నిశితంగా పరిశీలిస్తుంది. నిలుచుంటే మనవాడు, కొనసాగితే తనవాడు, దారిచూపితే నాయకుడంటుంది. కేసీఆర్ తన రాజకీయ ప్రస్థానంలో ఇవన్నీ చవిచూశాడు, కాలపరీక్షను తట్టుకున్నాడు, తెలంగాణమంతా మా ధైర్యం కేసీఆర్ అనుకునే స్థాయికి చేరాడు. రాజకీయ నాయకత్వమే కాక పాలనా సామర్థ్యాన్ని సైతం ప్రజలకు అనుభవంలో చూపగలిగాడు. బీజేపీ పాలకుల దుర్మార్గాలను, నిష్కర్షగా ప్రశ్నించగలుగుతున్నాడు కాబట్టే అధికార బీజేపీలో కలవరపాటు, మాటల్లో తత్తరపాటు.
నాటి ప్రధాని ఇందిర ఏలుబడిలో ప్రజాస్వామ్యం పరిహాసం పాలైన వేళ, హక్కుల హననం యథేచ్ఛగా జరిగిన వేళ, నిరంకుశత్వం రాజ్యమేలిన వేళ, జనగళమై నినదించి, జాగృతమై పోరాటం సల్పిన లోక్నాయక్ జయప్రకాష్ నారాయణను భారతజాతి అక్కు న చేర్చుకున్నది. మరో సందర్భంలో మాజీ ప్రధాని వీపీ సింగ్ లాంటి నేత కొంత ప్రత్యామ్నాయ భావనను వ్యక్తీకరిస్తే కూడా ప్రజలు ఆదరించారు. ఈ రెండు సందర్భాల్లో ప్రజలు మార్పు కోరుకున్న విషయం ప్రధానం అలాంటి పరిస్థితులే నేడు దేశంలో ప్రబలంగా ఉన్నాయనేది వాస్తవం.
బలమైన కేంద్రం, బలహీన రాష్ర్టాలనే వ్యూహంతో ముందుకెళ్తున్న బీజేపీ కేంద్ర నాయకత్వానికి… జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఒక కొత్త సవాల్గా పరిణమించిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ మధ్యకాలంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలను మననం చేసుకుంటే దేశంలోని వ్యవస్థలపై, బీజేపీ యేతర పక్షాల ప్రభుత్వాలపై, ప్రాంతీయ పార్టీలపై, పాలక పార్టీ ఉద్దేశం ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. బీజేపీ ఒక్కటే ఉంటుంది, మిగతా పార్టీలన్నీ మనుగడలో లేకుండాపోతాయని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యం పట్ల, బహుళ పార్టీ వ్యవస్థ పట్ల బీజేపీకి ఏ మాత్రం గౌరవం లేదన్నదానిని వెల్లడిస్తాయి.
బీజేపీ అనుసరిస్తున్న విధానంతో మొత్తంగా ప్రాంతీయపార్టీలే అంతరించిపోయే పరిస్థితులు ఉత్పన్నమవుతున్న వేళ, కేసీఆర్ టీఆర్ఎస్ జాతీయపార్టీగా రూపాంతరం చెందాలి, తద్వారా దేశ విశాల ప్రయోజనాల కోసం పనిచేయాలనుకోవడం సముచితం, సమంజసం. ఎనిమిదేండ్లుగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలను తెలంగాణ మాడల్గా దేశమంతా పరిచయం చేసి ఆయారంగాల్లో, ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపటం సత్వర అవసరం. అందుకే కేసీఆర్ జాతీయ ప్రకటనకు సర్వామోదం లభిస్తున్నది. కేసీఆర్ గత ఏడాది కాలంలో వివిధ సందర్భాల్లో ఇప్పటివరకు పాలించిన కేంద్ర ప్రభుత్వాలు వనరులు వినియోగించుకోలేని అసమర్థతను, మంచి నీరు, విద్యుత్తు లాంటి కనీస సదుపాయాలు సరిగా ఇవ్వలేని ఆశక్తతను ప్రశ్నించినప్పుడు, రైతాంగానికి ఉచిత విద్యుత్తు ఇవ్వడానికయ్యే ఖర్చును లెక్కలతో సహా విశదీకరించినప్పుడు, సర్వత్రా ఆసక్తి వ్యక్తమవడమే గాక జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది.
ప్రజాభివృద్ధి కోసం కృషిచేయటం పాలకుల ప్రథమ కర్తవ్యం అనే ప్రాథమిక సూత్రాన్ని, సాధారణ అవగాహనను, బీజేపీ నాయకత్వం కోల్పోయింది. ప్రజలు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగానే బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టారు. ఉత్సవం చేయాలంటే మూలవిరాట్టు అంటూ ఒకటి ఉండాలనే పద్ధతిని అనుసరించి కొంతలో కొంత బీజేపీ తెస్తానన్న మార్పును విశ్వసించి ప్రభుత్వంలో కూర్చోబెట్టారన్న విషయాన్ని మరిచి, తాము దైవాంశసంభూతులం కాబట్టే తమకు అదికారమిచ్చారన్న స్థాయికి బీజేపీ కేంద్ర ద్వి నాయకత్వం ఆలోచనలు వెళ్లి చాలా కాలమైంది.
అందుకే రైతులు ఆందోళనలు చేసినా, ఉద్యోగులు, కార్మికులు నిరసించినా, ప్రజాస్వామ్యవాదులు, రాజకీయపక్షాలు, కేంద్ర నిరంకుశ విధానాలను ప్రశ్నించినా, సామాన్యులు ధరలు పెరిగి, అవకాశాలు సన్నగిల్లి, కుంగి కృశించి అరిచి గీపెట్టినా మోదీ షా ద్వయానికి చీమ కుట్టినట్లయినా లేదు. పెరుగుట విరుగుట కోసమే అన్నట్లు 2014 తర్వాత 2018కి ముందు 21 మంది ముఖ్యమంత్రులతో, 75 శాతం భారత జనాభా కూడిన భూభాగాన్ని ఏలిన బీజేపీ, 2021 నాటికి 12 మంది బీజేపీ, ఎన్డీయేతో కలిపి 16 మంది ముఖ్యమంత్రులు 49 శాతం ప్రజలతో కూడిన భూభాగానికే పాలన పరిమితమైపోయిందనన్నది వాస్తవం.
యూపీఏకు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. ఎన్డీయేకు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. యూపీఏ బాగా పాలించకపోతే ఎన్డీయేను ఎన్నుకున్నారు. అప్పటిదాకా బలంగా కనిపించినవాళ్ళు, సామాన్యుడు కళ్ళుతెరిస్తే, ఆగ్రహిస్తే అయిపూ అజా లేకుండా పోయినారనే విషయాన్ని గ్రహించగలిగేస్థాయిలో బీజేపీ నాయకత్వం లేదు.
అయితే బీజేపీ అధికారంలో లేకపోతే ఆ పార్టీ వ్యవహార శైలి ఎలా ఉన్నా ప్రజలకు పెద్దగా పట్టింపు ఉండేది కాదు. అధికారంలో ఉండి ప్రజల బాగోగులు పట్టించుకోవాల్సింది, దేశ పురోగతికై అనుక్షణం కృషి చేయాల్సిందీ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమాజ నిర్మాణం చేయాల్సిందీ బీజేపీ నాయకత్వమే కనుకనే అసలు చర్చ. 2014కు ముందు గుజరాత్ మాడల్ అభివృద్ధి పేరుతో, న్యూ ఇండియా పేరుతో సమ్మోహనకరమైన ప్రచారసరళిలో దూసుకొచ్చిన మోదీని ప్రజలు విశ్వసించారు. అధికారమిచ్చారు. అనుకున్న లక్ష్యాలు ఇసుమంతైనా నెరవేరకున్నా ప్రచార సంరంభఝరిలో 2019లో మరోసారి అవకాశం ఇచ్చారు.
బతుకులు బాగుపడతాయేమోనని, అద్భుతాలు చోటు చేసుకుంటాయేమోనని ఎదురుచూసిన సగటు భారతీయుడు అలసిపోయాడు. పెరిగిన ధరలు నిత్యజీవితాన్ని దుర్భరం చేస్తుంటే, అవకాశాలు అందనిద్రాక్షలై నిస్పృహ పరుస్తుంటే, ప్రజా సంపదను అస్మదీయులకు దోచిపెడుతుంటే వ్యవస్థలన్నీ నిర్వీర్యమైన వేళ సామాన్యుడు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాడు. కాదేదీ దోపిడీకనర్హం అన్న రీతిలో ఇంటినీ, వంటినీ, మంటినీ గుల్లబారుస్తున్న బీజేపీ ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడాలనుకుంటున్నాడు. సామాన్యుని భావనను అర్థం చేసుకొని, దేశ యువతతో సహా అన్నివర్గాల ఆకాంక్షలను చిత్తశుద్ధితో నిజం చేయగలిగే నాయకత్వం రావాలని స్థిరనిర్ణయంతో కోరుకుంటున్నాడు. ఒక బలమైన, నిర్మాణాత్మకమైన, సమభావనతో కూడిన, మానవీయ కోణమున్న, దార్శనికుడైన నాయకుడు రావాలని కోరుకుంటున్నాడు. కేసీఆర్ లాంటి నాయకుడు ఆ దిశగా అడుగులు వేస్తుంటే ప్రజలు ఆదరిస్తున్నారు.
అందుకే నేటి సూర్యోదయం ప్రత్యేకం, నేటి దినం చారిత్రాత్మకం, సబ్బండవర్ణాల గొంతుకై నినదించి, తెలంగాణ సాధించి, శోధించి, వృద్ధిపరచిన కేసీఆర్ జాతిజనుడై, 140 కోట్ల భారతీయుల ఆత్మగౌరవ ప్రతీకయై, అభివృద్ధి ప్రణాళికయై, సంక్షేమ అభిలాషియై, భవిష్యత్తు కు ఆశాకిరణమై, భారత సార్వజనీన, సౌభ్రాతృత్వానికి, సార్వభౌమత్వానికి నిజమైన గౌరవాభివృద్ధులు ప్రోదిచేసే దిశగా జాతి ప్రాభవానికి, పూర్వవైభవ స్థాపనా కదనానికి తొలిమెట్టు. నేటి రోజు.అందుకే కదులుదాం, తోడవుదాం, పయనిద్దాం, పోరాడుదాం, విజయం మనందరిది, విజయం భారత్ది,జై తెలంగాణ, జై భారత్.
(వ్యాసకర్త: రాష్ట్ర విద్య, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్)
-రావుల శ్రీధర్ రెడ్డి
99855 75757