కేంద్రంలోని బీజేపీ సర్కారును గద్దె దింప గల సమర్థ నాయకత్వం కోసం దేశం ఎదురుచూస్తున్నది. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపై తీసుకురాగలిగిన సమర్థ నాయకుడు ఎవరని చర్చిస్తున్నది. ఈ సమయంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించడాన్ని మేధావులు, బీజేపీ, కాంగ్రెసేతర రాజకీయపార్టీలు స్వాగతించాయి. ఎనిమిదేండ్ల నరేంద్ర మోదీ పాలన పట్ల ఏ ఒక్క రంగం కూడా సంతృప్తిగా లేదు. నియంతృత్వం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, పన్నుల మోత మొదలైన సమస్యలతో సామాన్యులు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల అజెండాతో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
ఓట్లు, సీట్ల ప్రాతిపదికన కాకుండా ఈ దేశం ఏం కోరుకుంటుందో మీకు తెలుసా అని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయాధారిత దేశంలో పంటలకు ఉచిత విద్యుత్తు ఎందు కివ్వరని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో పుష్కలమైన సహజ వనరులను ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నామో వివరించారు. నేడు బీజేపీని ధైర్యంగా ఎదుర్కొంటున్న రాజకీయ నాయకుడు కేసీఆర్ ఒక్కరే. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పుట్టిన టీఆర్ఎస్ పార్టీ విజయవంతం కాగలిగినప్పుడు కేసీఆర్ స్థాపించే జాతీయపార్టీ ఎందుకు విజయవంతం కాదు? ప్రజా ఎజెండా రూపకల్పనతో జనం మధ్యే చర్చ పెట్టి అదే జనం నుంచి నాయకులను ఎందుకు పుట్టించలేరు? తెలంగాణ మాదిరి ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతు బీమాలను దేశ రైతులందరికీ ఎందుకు అందించకూడదు? ఈ నేపథ్యంలో దేశంలో తిష్ట వేసుకున్న సమస్యల పరిష్కారం కేసీఆర్తోనే సాధ్యమవుతుందన్న చర్చ సాగుతున్నది. అందుకే దేశం పిలుపునకు కేసీఆర్ ఆమోదం తెలిపి జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు.
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని దేశమే సృష్టించుకుంటున్న చరిత్రను మనం చూస్తు న్నాం. కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ నియంతృత్వం వల్ల ఆ పార్టీ బలహీనబడింది. దీంతో ప్రాంతీయ పార్టీలు బలపడ్డాయి. దక్షిణాది నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన పీవీ నర్సింహా రావు, కర్ణాటకలోని ప్రాంతీయ పార్టీ జనతాదళ్ (సెక్యులర్) అధినేత దేవె గౌడ మాత్రమే ప్రధానులు కాగలిగారు. వారిలో కూడా దేవెగౌడ ఎక్కువకాలం పదవిలో కొనసాగలేకపోయా రు. దక్షిణాది ప్రాంతీయ పార్టీలు ఇప్పటివరకు దేశ రాజకీయాలను శాసించే స్థాయి పాత్ర పోషించలేదు. కానీ జాతీయ రాజకీయాల్లోని కోణాలు, పరిణామాలను బేరీజు వేసుకుంటే నాటి కి, నేటికీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోదీ హయాంలో నియంతృత్వం పెచ్చరిల్లింది.
ప్రాంతీయ పార్టీలను అణచివేయడం, రాష్ర్టాల హక్కులు కాలరాయడం, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడం బీజేపీ పాలనలో హెచ్చుమీరింది. దేశంలోని 29 రాష్ర్టాల్లో కేవలం ఎనిమిది రాష్ర్టాల్లోనే బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నది. పది రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీల సహకారంతోనే ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నప్పటికీ ‘ఒక దేశం-ఒక పార్టీ’ నినాదంతో దేశంలో మిగిలిన పార్టీలను పెద్ద పాములా బీజేపీ మింగాలని చూస్తున్నది. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలను బతికించుకునేందుకు, రాష్ర్టాల హక్కులను కాపాడేందుకు జాతీయస్థాయిలో ఓ బలమైన ప్రత్యామ్నాయ వేదిక అనివార్యం అవుతున్నది. ఆ వేదిక ద్వారా దేశాభివృద్ధికి పాటుపడే నాయకత్వాన్ని కోరుకుంటున్నది. మేధావులు, పారిశ్రామికవేత్తలు దేశాన్ని ముందుకు నడిపించే నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో గత చరిత్ర చూసినా, వర్తమాన రాజకీయాలను పరిశీలించినా కేసీఆర్ మాత్రమే అలాంటి జాతీయ రాజకీయాలను చేయగలరు. వాస్తవానికి దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించి ప్రధాని కావాలనుకుంటున్న వాళ్లు చాలామందే ఉన్నారు. నేషనలిస్ట్ పార్టీ అధినేత శరద్పవార్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వీరిలో ముఖ్యులు. కానీ వీరంతా తమ రాష్ర్టాల్లో సొంత పార్టీలను బీజేపీ ముప్పు నుంచి కాపాడుకునేందుకు నిత్యం అప్రమత్తంగా ఉండే పరిస్థితిని మోదీ సృష్టించారు. అందువల్ల తమకు తగిన పాత్ర దొరికినప్పుడే వీళ్లు జాతీయ రాజకీయా ల్లో కీలక పాత్ర పోషిస్తారేమో తప్ప పూర్తికాలం జాతీయ రాజకీయ నాయకులుగా ఉండే అవకాశం లేదు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నట్లు కనిపించదు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు జాతీయ నాయకుడయ్యే అన్ని అర్హతలున్నా ఆయనకున్న వనరులు, సమయం తక్కువ. తమిళనాడు రాజకీయ నాయకులు జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి చూపించడం లేదు. బీజేపీ, కాంగ్రెస్లను ప్రజలు నమ్మే అవకాశాలు కనిపించడం లేదు.
టీఆర్ఎస్ నాయకులను ప్రత్యర్థి పార్టీలను దీటుగా ఎదుర్కొనేలా కేసీఆర్ ఇప్పటికే తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్కు మాత్రమే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చిన కేసీఆర్ దేశానికి దిక్సూచిగా మారాలని ఆశిద్దాం.
-వెంకట్ గుంటిపల్లి , 94949 41001