సదాలోచనల కేంద్రం ఆ మస్తిష్కం. సదాచరణల పటిమ ఆ వ్యక్తిత్వం. చూడబోతే సింపుల్ ఆహార్యం. వాక్కులో శుద్ధి. చేతల్లో శక్తి. బండ మీద బంగారం పండించే మేధో సంపత్తి. సంపదను పెంచుతారు. ఆ ఫలాలు చిట్టచివరి పౌరులకు దక్కిస్తారు. తద్వారా సమ సమాజాన్ని స్థాపిస్తారు. ఇట్లా మంచి పనులు చేస్తారు. మెజారిటీ ప్రజలను మెప్పిస్తారు. ఒకరిగానే, ఒంటరిగానే కదులుతారు. చూస్తుండగానే యావత్ జాతిని ఒక్కతాటిపైకి తెస్తారు. విశ్వాసానికే శ్వాస అవుతారు. థాట్స్ అండ్ గట్స్కు నిలువెత్తు రూపం.
గత, వర్తమాన, భవిష్యత్తు స్థితిగతులను అంచనా కడతారు. లోక సుభిక్షానికి కంకణ బద్ధులవుతారు. స్థానిక వనరులను కనిపెడుతారు. ఉత్పాదక చోదకాలుగా మలుస్తారు. ప్రకృతి ప్రసాదించిన వనరులను ఒడిసిపడుతారు. మనుషులు సహా సమస్త జీవరాశుల మనుగడకు ఢోకా లేకుండా స్థిరపరుస్తారు. మనందరికీ బువ్వ పెట్టే సగటు రైతుకు నీరు, కరెంటు, పెట్టుబడి వంటివి సమకూర్చి పంటలు పండించేందుకు అసలైన చేయూతగా నిలుస్తారు. తగిన ధరలతో దిగుబడి విక్రయాలకు పెద్ద దిక్కవుతారు. జై కిసాన్ నినాదాన్ని నిలబెడతారు. నలు వైపులా దేశాన్ని చౌబీస్ గంటా కాపాడే సైన్యం పట్ల, వారి త్యాగాల పట్ల దేశభక్తి ఇనుమడించేలా ఎనలేని గౌరవాన్ని చాటుతారు. దేశాన్ని కాపాడే ప్రయత్నంలో అమరులైన వారి కుటుంబాలు ఏ రాష్ట్రంలో ఉంటే అక్కడికి తానే స్వయంగా రెక్కలు కట్టుకొని వెళ్లి సాయం అందించి నైతిక స్థయిర్యం ఇస్తారు. ఆ విధంగా ‘జై జవాన్’ నినాదాన్నీ సార్థకం చేస్తారు. విద్యావంతులకు ఉద్యోగాలిస్తారు. అచేతనులకు సామాజిక పింఛన్తో ఆసరా అవుతారు. ఏ వర్గాన్నీ, మరే రంగాన్నీ విస్మరించకుండా అక్కున చేర్చుకుంటారు. ఈ నిరంతర మహా యజ్ఞం లో ఎటువంటి ఆటుపోట్లయినా, మరెంతటి చిక్కుముడులనైనా ఛేదిస్తారు. రకరకాల సవాళ్లు, వేదనలు, ప్రయాసలను పంటి బిగువున భరించే నిలువెత్తు నాయకత్వ శిఖరం తాను. రాజకీయ, సామాజిక విజ్ఞాన సర్వస్వం. రొటీన్కు భిన్నంగా, అపురూపమైన, తెలంగాణ గర్వించే అరుదైన పరిపాలనాదక్షులు.
సమస్త ప్రయోజనాల కోసం మంచిని ఎంతగా ప్రేమిస్తారో, చెడు ను అంతగా చెండాడుతారు. ప్రగతిరథాలు పట్టాలెక్కే క్రమంలో కుట్ర లు, కుతంత్రాలు, కపటాలను అదే పట్టాలపై తుక్కు తుక్కు చేస్తారు. విలనిజాన్ని నిజానిజాలనే అస్ర్తాలతో తోక ముడిపిస్తారు. పురోగమన ప్రయాణాన్ని సురక్షితంగా గమ్యం చేరుస్తారు. ఆ దశలో అవసరమైనప్పుడల్లా నాగరిక సమాజాన్ని అప్రమత్తం చేస్తారు. చైతన్య కాంతులను వ్యాప్తిలోకి తెస్తారు. పవిత్ర ఆశయాలు, సమగ్ర దృక్పథాలు గలవారు. నిన్న మొన్నటి, నేటి, రేపటితరాల కోసం నిత్యం పాటుపడతారు. ఇంకా ఏదో చేయడం లేదనే గ్యాప్లోనే ఎంతో చేసి చూపించే సాఫల్యాల చిరునామా. సుద్దులు చెప్పడం కాదు, స్వతహాగా పాటించే పరిపాలకులు. సామాన్యులు మొదలు మహనీయుల వరకూ ఎవరినీ విస్మరించరు.
ఉద్యమ బాటలో బాపూజీని, రాజ్యాంగస్ఫూర్తిలో అంబేద్కర్ను మనసా వాచా కర్మణా అనుసరిస్తారు. తెలుగు ఠీవీ మన పీవీ స్మృత్య ర్థం ఏడాది పాటు ప్రత్యేక కార్యక్రమాలు తలపెట్టారు. దేశభక్తి నిలిపే లా ఘనంగా వజ్రోత్సవాలు జరుపుతున్నారు. దేశంలోనే మరెక్కడా లేనంతటి అద్భుతంగా అందుబాటులోకి వస్తున్న నూతన సచివాలయానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు ఇందుకు తాజా కొనసాగింపే. జనం వ్యక్తిగత ఆస్తిపాస్తుల విలువలు పెరిగే ఉపాయాలు సహా ఏ టూ జడ్ వికాసం, సామాజిక స్థితిని సమున్నతం చేస్తున్న సక్సెస్ ఫుల్ ప్రయోగశాల. తన రకరకాల పోరాటాల తపోఫలమే అరువై ఏండ్లు ద్వితీయశ్రేణి పౌరుల మాదిరిగా దిక్కులు చూసిన తెలంగాణ పౌరులు తలెత్తుకొని జీవించే ఎదుగుదల. కనీస జీవన భద్రత, మౌలిక సదుపాయాలు, కడక్ ఆత్మగౌరవాలను మన రాష్ట్ర పౌరుల అనుభవంలో ఉంచారు. ఈ విధంగా కోటి ఎకరాల మాగాణి చేసి ఆల్రెడీ ఇంట గెలిచారు. ఇక రచ్చ గెలిచే దిశగా.. ప్రజా వ్యతిరేక చీకట్లు కమ్ముకున్న భారతదేశంలో చల్లని వెన్నెల చంద్రకాంతుల కోసం నడుం కట్టిన దక్షిణాది సప్తాశ్వరథుడికి శుభం పలుకుదాం, వెంట నడుద్దాం.
-ఇల్లెందుల దుర్గాప్రసాద్ , 94408 50384