విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై ప్రజల ఆగ్రహజ్వాలలు ఇంకా చల్లారనే లేదు, ప్రైవేటీకరణపై కేంద్రం గుడ్డిగా వ్యవహరిస్తూ ముందుకుపోతున్నది. మరో ప్రభుత్వరంగ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని యోచిస్తున్నది. ఒడిశాలోని నీలాంచల్ ఇస్పత్ ప్లాంట్ను టాటా గ్రూపునకు విక్రయించిన తర్వాత మరో ప్రభుత్వరంగ స్టీల్ ప్లాంట్ను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది.
నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) రూ.23,140 కోట్ల అంచనా వ్యయంతో ఏటా మూడు మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంటీపీఏ) సామర్థ్యంతో నాగర్నార్ స్టీల్ ప్లాంట్ను నిర్మిస్తున్నది. ఈ ప్లాంట్ ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో ఉంది. నిర్మాణంలో ఉండగానే దీన్ని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ‘నీతి ఆయోగ్’ సిఫారసుల ఆధారంగా నగర్నార్ స్టీల్ ప్లాంట్లో 51 శాతం ఈక్విటీని ప్రైవేట్ కంపెనీకి విక్రయించడానికి 2016 నవంబర్లోనే క్యాబినెట్ ఎన్ఎండీసీకి ఆమోదం తెలిపింది. మరో నెలరోజుల్లో ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభం కానున్నందున, ప్రస్తుతం ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఈ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడంతో భూ నిర్వాసితులు, కార్మికులు, ప్రజలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. ఉక్కు కర్మాగారం వల్ల స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని, దవాఖానలు, పాఠశాలలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంకా ఆ హామీలేవీ నెరవేరలేదు. ఈ ప్రాంతంలోని దాదాపు 1200 కుటుంబాలు భూ సేకరణ డ్రైవ్ సమయంలో తమ భూమిని వదులుకున్నాయి. 20 ఏండ్లు గడిచినా, వారిలో చాలామందికి ఉద్యోగాలు రాలేదు. ‘ప్రభుత్వ సంస్థ లాభదాయకత కంటే పౌరుల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుందని నమ్మి మేం భూమినిచ్చాం. కానీ అలా జరగలేద’ని స్థానికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర యాజమాన్యం లేదా నియంత్రణలో ఉన్న కార్పొరేషన్ కోసం భూమిని అందించడం అంటే, సేకరించిన భూమిని ప్రైవేట్ కంపెనీకి బదిలీ చేయడం సాధ్యం కాదు. ప్లాంట్ను ప్రైవేటీకరించినట్లయితే, ఆ భూమి రాష్ర్టానికి తిరిగి రావాలి. స్టీల్ ప్లాంట్ కోసం భూమిని సేకరించినప్పుడు స్థానిక గిరిజన కుటుంబాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వరంగ సంస్థకు భూమి అవసరమని చెప్పి వారినుంచి బలవంతంగా భూములు తీసుకున్నారు. ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తుండటాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలోని బైలదాలా పరిధిలో 7 ఎంటీపీఏ సామర్థ్యం గల ఇనుప ఖనిజం గనిని ప్లాంట్కు అవసరమైన ముడిసరుకు అవసరాలను తీర్చడానికి రూ.1900 కోట్ల అంచనా పెట్టుబడితో అభివృద్ధి జరిగింది. ఉక్కు కర్మాగారానికి 5 ఎంటీపీఏ ఇనుప ఖనిజం అవసరాన్ని తీర్చిన తర్వాత, మిగిలిన పరిమాణాన్ని ఛత్తీస్గఢ్ లోపల ఉన్న స్టీల్ ప్లాంట్లకు విక్రయిస్తారు. ప్లాంట్, గనులున్న భూమి ‘షెడ్యూల్డ్ ఏరియా’లో ఉన్నందున, ‘షెడ్యూల్డ్ ఏరియా’లో ప్రభుత్వరంగ కంపెనీకి చెందిన లీజును ప్రైవేటీకరించడం సాధ్యమేనా అనే సందేహాన్ని పలువురు నిపుణులు లేవనెత్తారు.
కార్మికులు, స్థానిక ప్రజల వ్యతిరేకత వల్ల ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నాగర్నార్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణకు ముందుకువెళ్తే గిరిజన బస్తర్ ప్రాంతంలో ఎన్ఎండీసీకి చెందిన నాగర్నార్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ను కొనుగోలు చేయడానికి రాష్ట్రం సుముఖంగా ఉందని రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. రాష్ట్రం మొద ట ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేసి గిరిజన, అటవీ భూములను సేకరించింది. ప్లాంట్ నిర్మించడానికి, గనుల ను అభివృద్ధి చేయడానికి ప్రజాధనాన్ని ఉపయోగించింది. ఇప్పుడు ప్లాంట్ సిద్ధంగా ఉం ది. కాబట్టి నాగర్నార్ స్టీల్ ప్లాం ట్ ప్రైవేటీకరణపై కార్మికులు, ప్రజలు చేసే పోరాటం న్యాయమైనదే.
-ఆళవందార్ వేణుమాధవ్ , 86860 51752