ఎన్నో కష్టాలకోర్చి అనేక వాస్తవిక స్థితిగతుల సమాచారాన్ని ప్రజలకు చేరవేసే జర్నలిస్టులకు సమాజంలో ఎంతో గౌరవం ఉంటుంది. కానీ అదేస్థాయిలో వారు విధి నిర్వహణలో భాగంగా ఎన్నో ఒత్తిళ్లను తట్టుకోవాల్సి ఉంటుంది. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిగ్గు తేల్చే నిజాలను ప్రజల ముందుంచుతారు. అలాంటి జర్నలిస్టులపై ప్రపంచ వ్యాప్తం గా బెదిరింపులు, నిర్బంధాలు, దాడులు, అపహరణ, హత్య లు లాంటి సంఘటనలు పెరిగిపోతున్నాయని జర్నలిస్టుల రక్షణ కమిటీ తాజా నివేదిక వెల్లడించింది.
జర్నలిస్టులపై దాడులు ఇలానే కొనసాగితే పత్రికా స్వేచ్ఛకు భంగం వాటిల్లే ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు తమ బాధ్యత గా జర్నలిస్టుల ప్రాణ రక్షణకు పటిష్టమైన చట్టాలను చేయాలి. రాజకీయ పార్టీలతో పాటు పౌరసమాజం జర్నలిస్టులకు అండగా నిలవాలి. అప్పుడే ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛకు విలువ ఉంటుంది.
జర్నలిస్టుల రక్షణ కమిటీ 2020 వార్షిక నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులపై భౌతికదాడులు పెరుగడమే కాకుండా అనేకమంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. ఆ నివేదిక ప్రకారం 1992 -20 మధ్యకాలంలో 1397 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యా రు. అత్యధికంగా 2009లో ఏకంగా 76 మంది జర్నలిస్టులు హత్యకు గురికావడం ఆందోళన కలిగించే అంశం. మరోవైపు ప్రభుత్వాలు జర్నలిస్టులు రాసే కథనాలపై తప్పుడు కేసులు బనాయించి రాజద్రోహం కేసుకింద అరెస్టు చేసి జైలుకు పంపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గత 28 ఏండ్లలో 5,128 మందిని పలు దేశాలు కనీసం బెయిల్ కూడా రాని కేసుల్లో జైళ్లకు పంపాయి. గతేడాది కాలంలో 274 మంది జర్నలిస్టులు జైలు పాలయ్యారు.
ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా చైనా నుంచి ఏ విధం గా వ్యాప్తి చెందిందనే అంశాన్ని ప్రపంచానికి తెలిపిన పాపానికి అక్కడి న్యాయస్థానం జర్నలిస్ట్ జంగ్జాన్కు నాలుగేండ్ల జైలు శిక్ష విధించింది. ప్రపంచవ్యాప్తంగా జైళ్లలో ఉన్న మూడింట రెండొంతుల మంది జర్నలిస్టులపై ఆయా ప్రభుత్వాలు ఉగ్రవాదులు, నిషేధిత సంఘాలతో సం బంధాలు కలిగి ఉన్నారనే అభియోగాలు మోపుతున్నాయి. వారిలో 19 శాతం కేసుల్లో ఎటువంటి ఆరోపణలు నిర్ధారణ కాకుండానే వారు జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ఇరాన్, సౌదీలలో ఇలా శిక్ష అనుభవిస్తున్నవారిలో సుమారు 13 శాతం మంది మహిళా జర్నలిస్టులే. అలాగే ప్రపంచవ్యాప్తంగా 67 మంది జర్నలిస్టులు అదృశ్యమయ్యారు. మన దేశంలో కూడా జర్నలిస్టులపై దాడులు అదేస్థాయిలో ఉన్నాయి. పత్రి కా హక్కుకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఎ) ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛ ఉన్నది. కానీ ఆ స్వేచ్ఛను కాలరాస్తూ అటు ప్రభుత్వాలు, కొంతమంది దుండగులు పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తూనే ఉన్నారు. ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛ-2020’ ప్రకారం 180 దేశాల్లో నార్వే, ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు మొదటి మూడు స్థానాలలో ఉంటే భారత్ 142 స్థానంలో ఉందంటే దేశంలో పత్రికా స్వేచ్ఛకు ఎంతటి గౌరవం ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ తాజా నివేదిక ప్రకారం 1990 నుంచి 2020 మధ్యకాలంలో భారతదేశంలో 116 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. అత్యధికంగా యూపీలో 11 మంది, జమ్మూకశ్మీర్లో 6, అలాగే హిమాచల్ప్రదేశ్లో ఐదుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. విధి నిర్వహణలో భాగంగా 1997 నవంబర్ 19న ఈటీవీ జర్నలిస్టులు ఎస్.గంగాధర రాజు, ఎస్.కృష్ణ లు ఒకేరోజు ఒకే సంఘటనలో హత్యకు గురయ్యారు. అలాగే దూరదర్శన్లో జర్నలిస్టుగా పనిచేసిన అచ్యుతానంద సాహు 2018 అక్టోబర్ 30న ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో మరణించడం విషాదకరం. 2017 సెప్టెంబర్ 5న కర్ణాటకలో ఆగంతకుల దాడి లో హత్యకు గురైన గౌరీ లంకేశ్ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మన దేశంలో 2014 నుంచి జర్నలిస్టులపై జరిగిన హత్య, దాడుల కేసుల్లో ఇప్పటివరకు ఒక్క నేరారోపణ కూడా అధికారులు నిరూపించలేకపోయారు.
ప్రపంచంలో మీడియా సంస్థలు భారీగా పెరగడంతో వెలువడే కథ నాలు నిజమైనవో నకిలీవో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. కాబట్టి జర్నలిస్టులు సాక్ష్యాధారాలతో కూడిన కథనాలను ప్రచురణ, ప్రసారం చేయాలి. దానివల్ల మీడియా పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుంది. జర్నలిస్టులు తమ వృత్తిధర్మాన్ని పాటిస్తూనే అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకురావాలి. జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. హత్యకు గురైన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలి. జర్నలిస్టులు సమాజ శ్రేయస్సును కాంక్షించేవారు కాబట్టి వారిని గౌరవించడమే కాకుండా వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉన్నది.
-మోటే చిరంజీవి ,9949194327