కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అసమర్థ విధానాల వల్ల దేశ ద్రవ్య లోటు రూ.లక్షల కోట్లకు చేరుకుంది. అంటే, దాని అర్థం ఒక ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు చాలా ఎక్కువ, రాబడి తక్కువ అని. మోదీ సర్కారు ఈ లోటు నుంచి బయటపడటానికి ఆపసోపాలు పడుతోంది. ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల అమ్మకం ద్వారా ఈ లోటు భర్తీచేయాలని ప్రయత్నిస్తోంది.
ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించినప్పుడు అందులో తనకు ఉన్న 51 శాతం లేదా అంతకంటే ఎక్కువ వాటాను ప్రభుత్వం వేరే ఏదైనా కంపెనీకి అమ్మేస్తుంది. దీని వలన కంపెనీ యాజమాన్యం కొత్త కంపెనీ చేతుల్లోకి వెళుతుంది. అదే పెట్టుబడులు ఉపసంహరించినప్పుడు ప్రభుత్వం ప్రభుత్వ రంగ కంపెనీలోని కొంత వాటాను ప్రైవేటు లేదా ప్రభుత్వ రంగ కంపెనీకి అమ్మేస్తుంది. అయితే వాస్తవాలను పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లనే చాలా ప్రభుత్వ రంగ కంపెనీలు నష్టాల్లో నడుస్తున్నాయి. విశాఖపట్నంలోని ప్రభుత్వ ఉక్కు కర్మాగారామే ఇందుకు ఉదాహరణ. కానీ కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల రూపాయిల రాయితీలు ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల పునరుజ్జీవనానికి మాత్రం ఎలాంటి నిధులు కేటాయించడం లేదు. దీని వల్ల అవి ఎదుగు బొదుగూ లేకుండా ఉన్నాయి. ద్రవ్య లోటును అధిగమించడానికి ప్రభుత్వ ఆస్తులను మోదీ ప్రభుత్వం అతి తక్కువ ధరలకే తెగనమ్ముతోంది.
ప్రస్తుతం స్వదేశీ కంపెనీల దగ్గర పెట్టుబడి నిధులు నిండుకున్నాయి. వీటిలో ఎక్కువ కంపెనీలు అప్పుల్లో ఉన్నాయి. బ్యాంకుల పరిస్థితి కూడా అంత బాగా లేదు. వీటిని సాకుగా చూపి కేంద్రం ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలనుకుంటోంది. ఆశ్రిత పెట్టుబడి దారీ విధానాన్ని వేగంగా అమలు చేయాలనుకుంటోంది. ఇందుకోసం ప్రభుత్వం కావాలనే పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా, ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల్లో తన వాటాను 51 శాతానికి తక్కువగా ఉంచుకుంటోంది. దీనివల్ల వాటిపై ప్రభుత్వం యాజమాన్య హక్కును కోల్పోతోంది. కానీ ఇలాంటి కంపెనీలకు కొన్నిసార్లు ప్రైవేటు కంపెనీలు కూడా కొనడం లేదు.
ప్రైవేటీకరణ ఎక్కువైతే మార్కెట్లో ఆయా కంపెనీల గుత్తాధిపత్యం పెరిగి ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రైవేటు కంపెనీలు సామాజిక బాధ్యతను విస్మరిస్తాయి. ఉద్యోగులను తొలగించుకోవడం, నియమించడంలో కంపెనీలు ఇష్టానుసారం వ్యవహరిస్తాయి. ఇక ప్రభుత్వ ఆస్తులు అమ్మడం వల్ల సంపదలో అసమానతలు వస్తాయి. ప్రభుత్వ పరిపాలనపై ప్రజల్లో సందేహాలు తలెత్తుతాయి. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ఠ మసకబారుతుంది. ద్రవ్యలోటును పూడ్చుకోవడానికి కేంద్రం అనుసరిస్తున్న విధానం సరైనది కాదు. ద్రవ్యలోటు తగ్గించుకోవాలంటే ప్రభుత్వం ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించుకోవాలి. వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలి. జీఎస్టీ రేట్లను సరళీకరించాలి. అవసరమైతే రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పు తీసుకోవాలి. ట్రెజరీ బాండ్లను మార్కెట్లోకి జారీ చేయడం ద్వారా డబ్బును సమకూర్చుకోవాలి. అంతేకానీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించకూడదు. దానికి బదులుగా ప్రభుత్వ రంగ సంస్థలను సంస్కరించి వాటిని ప్రైవేటు కంపెనీలతో పోటీపడేలా తీర్చిదిద్దాలి. నాణ్యమైన ఉత్పత్తులు తయారుచేసేలా వాటిని ప్రోత్సహించాలి. వాటికి పెట్టుబడిని సమకూర్చాలి. స్వదేశంలో, విదేశాల్లో వాటి ఉత్పత్తులకు గిరాకీ పెరిగేలా చూడాలి. తద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలి.
(వ్యాసకర్త: దండంరాజు, రాంచందర్ రావు, 9849592958, రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్, సింగరేణి భవన్ )