ప్రజల మధ్య విద్వేష వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు. అమాయక యువత మనసుల్లో విషం చిమ్ముతూ దేశభక్తి ముసుగులో ద్వేషాన్ని నింపుతున్నారు. వారిని మానసికంగా విడగొట్టి రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారు. అభివృద్ధి ఆనవాళ్లే లేకుండా అరాచకంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫాసిస్టు పాలనను సాగిస్తున్నది. కేంద్రం ఎత్తుగడలను తిప్పికొట్టే రాజకీయ చతురతతో పాటు, అధికార బలాన్ని సమర్థవంతంగా ఢీ కొనగల నేత కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. స్తబ్ధుగా మారిపోయిన దేశ రాజకీయాలను చూసి దిక్కుతోచని స్థితిలో యావత్ దేశం కొట్టుమిట్టాడుతున్నది.
సమాజంలోని వైరుధ్యాలను సమగ్రంగా అధ్యయనం చేసి స్పష్టంగా, ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం దేశంలో విభిన్న ప్రాంతాల్లో భిన్న రాజకీయ, సైద్ధాంతిక అభిప్రాయాలు కలిగి ఉన్నటువంటి అభ్యుదయవాదులను, అభివృద్ధి కాముకులను ఒప్పించి ఏకాభిప్రాయంతో ఏకతాటిపైకి తీసుకొచ్చి సరైన పోరాట పంథాను సూచించగల ప్రత్యామ్నాయ నాయకుని కోసం దేశం వేచి చూస్తున్నది. మొన్నటికి మొన్న స్వరాష్ట్ర సాధనలో అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించి యావత్ భారతావనిని తనవైపు తిప్పుకున్న కేసీఆర్ మాత్రమే బీజేపీకి సరైన రాజకీయ ప్రత్యర్థి అని దేశం బలంగా నమ్ముతుంది.
‘ఏ దేశంలో అయితే ప్రజలు మతం, ధర్మం అంటూ కొట్టుకు చస్తారో, ఆ దేశం తప్పుడు వ్యక్తుల ద్వారా నడిపించబడుతుందన్నదని అర్థం’ అన్న మార్టిన్ లూథర్ కింగ్ వ్యాఖ్యలను భారత సమాజం గుర్తెరగాలి. వాస్తవమైన హిందుత్వాన్ని గాలికి వదిలేసి, దానిలోని సమగ్రతను, ఉన్నత విలువలను దిగజార్చి, రాజకీయ హిందుత్వాన్ని భుజాలపైకి ఎత్తుకొని అధికారమే ఎజెండాగా బీజేపీ చౌకబారు రాజకీయం చేస్తున్నది. మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టి బీజేపీ వారే నిజమైన హిందువులన్న తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి పంపుతున్నది. హిందువులనే సాటి హిందువులపైకి ఉసిగొల్పి హిందూ మత ఔన్నత్యాన్ని దిగజారుస్తున్నది. దేశంలో మారణ హోమం సృష్టిస్తూ, పవిత్రమైన దేవాది దేవుళ్లను అపవిత్రం చేస్తున్నది. ఇది బీజేపీ రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ఠ. అందుకే స్వార్థపూరితమైన బీజేపీని సాగనంపే సమయం ఆసన్నమైంది. హిందూ మత ఖ్యాతిని ఖండాంతరాలు వ్యాపింపజేసిన మహనీయుడు స్వామి వివేకానంద. నేటి మన సువిశాల భారతావని ప్రపంచ ఆకలి సూచిలో అగ్రస్థానం పొందడం, సంపద మొత్తం ఒకేవైపు పోగవుతున్న అధికార వైఫల్యాలు, అన్నపు రాశులు ఒకవైపు, ఆకలి కేకలు ఒకవైపు ఉన్న దేశాన్ని చూసి ఆయన ఆత్మ ఎంతగా ఘోషిస్తున్నదో?
ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలు సామాజిక మాధ్యమాల్లో విమర్శిస్తున్నారు. అయితే వీరిపై అల్లరి మూకలు అస భ్య పదజాలంతో విరుచుకుపడుతున్నాయి. మేధావులు మీడియాలో తమ విశ్లేషణలు వినిపిస్తున్నారు. కవులు, రచయితలు తమ గళంతో నిరసిస్తున్నారు. అయితే వీరు నిర్బంధాలకు, వ్యక్తిగత దూషణలకు గురవుతున్నారు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎదిరించిన వారిపై ఈడీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థలు ముప్పేట దాడులు చేస్తున్నాయి. బీజేపీయేతర రాష్ర్టాలపై పక్షపాత వైఖరి అవలంబిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలోకి తొక్కుతున్నది కేంద్ర ప్రభుత్వం. అభివృద్ధి సంక్షేమ పథకాలు కుంటుపడేలా, సాధారణ బీద బిక్కి జనజీవనం స్తంభింపజేసి అహంకారపూరితంగా వ్యవహరిస్తూ, రాజకీయ కక్షను తీర్చుకుంటున్నది బీజేపీ. ఒకరకంగా చెప్పాలంటే దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నది.
అప్రస్తుత చారిత్రక సందర్భమైన సెప్టెంబర్17ను కేంద్రం రాజకీయ అత్యాశతోనే అధికారికంగా నిర్వహిస్తున్నది. విమోచన వేడుకలంటూ భావోద్వేగాలను రెచ్చగొడుతున్నది. కేంద్రం తీరును ముందే పసిగట్టిన తెలంగాణ ప్రభుత్వం ప్రజలంతా అన్నదమ్ముల వలె కలిసి ఉండాలని జాతీయ సమైక్యతా దినోత్సవంగా వజ్రోత్సవాలను సంవత్సరమంతా జరపాలని నిర్ణయించింది. జాతి సమగ్రత దెబ్బతినకుండా, భారతావనికి ఐక్యతా రాగాన్ని వాగ్దానం చేసింది. ఒక పెద్ద సమస్యను చారిత్రకంగా ఎలా చూడాలో, వర్తమానంలోకి ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలో అనే రాజకీయ పరిణతి కలిగిన నాయకత్వానికి నిదర్శనమే తెలంగాణం.
బీజేపీని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్కు లేదన్నది జగమెరిగిన సత్యం. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో చాలా రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. అవి ఆత్మగౌరవ పాలనను, నిర్ణయాత్మక ప్రతిపక్ష పాత్రను కొనసాగిస్తున్నాయి. ఏ ఉద్యమం మొదలైనా ఎర్ర జెండా పార్టీలు ముందుండి కదం తొక్కుతూ, ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నాయి. వీటన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకురాగల రాజకీయ చాణక్యం, చతురత కేవలం కేసీఆర్కు మాత్రమే ఉంది. దేశం ముందు కనబడుతున్న ప్రత్యామ్నాయం ఆయన ఒక్కరే.
‘అన్నార్తులు, అనాథలుండని
ఆ నవయుగమదెంత దూరం
కరువంటూ కాటకమంటూ
కనిపించని కాలాలెపుడో
మానవ కళ్యాణం కోసం
ఫణమెత్తిన రక్తమెంతో..’
దాశరథి కృష్ణమాచార్యుల అక్షరాల స్ఫూర్తితో కంఠంలో ప్రాణమున్నంత వరకు ఎందాకైనా సరే కొట్లాడేందుకు, భారత మాత సంకెళ్లను నలుగురి చెర నుంచి విడిపించి రైతు రాజ్యాన్ని నిర్మించే దిశగా అడుగులు వేస్తున్న కేసీఆర్ వెన్నంటే భారతీయ సమాజం ఉంటుంది. ఆయన అడుగులో అడుగు కలిపి కదం తొక్కి సామాన్యుల చేతిలోకి భారతదేశం వచ్చే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. మరో స్వాతంత్య్ర సమరానికి శంఖారావం తెలంగాణ నుంచి పూరించడం శుభ పరిణామం.
(వ్యాసకర్త: ముఖేష్ సామల, 97039 73946, సామాజిక, రాజకీయ విశ్లేషకులు)