అవకాశవాద ఓటు బ్యాంకు రాజకీయాల్లో పలు పార్టీలు ఆరితేరాయి. 77 శాతం దేశ సంపద ఒక్క శాతం కుబేరుల దగ్గర ఉండటం దుర్మార్గం. ఉచితాలు అభాగ్యులకు, అర్హులకు సముచితం. బడా కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రూపాయిల రాయితీలివ్వడం అనుచితం. ఉచితాల వలలో పడి బడా కార్పొరేట్ శక్తులకు ఇచ్చే అనుచితాలను ప్రశ్నించకుంటే? ఉచితాల పేరుతో సంక్షేమ పథకాలను రద్దుచేసే పెద్ద కుట్రకు కేంద్ర పాలకులకు తెరలేపారు. నేడు ఉచిత పథకాల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఉచితాల పేరుతో ఆర్థికవ్యవస్థ విధ్వంసం అనే శీర్షికలతో కార్పొరేట్ మీడియా గగ్గోలు పెడుతున్నది. ప్రజల మధ్య అసమానతలను రూపుమాపడానికి ప్రభుత్వాలు పాటుపడాలని 308 (2) రాజ్యాంగ అధికరణ నిర్దేశిస్తున్నది. అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వ చేయూత అత్యంత కీలకం అనేది నిర్వివాదాంశం.
మూడు దశాబ్దాలుగా ఆర్థిక అసమానతలు పెరిగాయి. కరోనా కాలంలో సాధారణ ప్రజలందరూ ఉపాధి కోల్పోయి, ఆకలితో అలమటించారు. సంపన్నులు మాత్రం ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్నారు. నేటి చర్చంతా ప్రధానంగా పేదల సంక్షేమం కోసం ఇచ్చే పథకాలను ఉచితాలని, కార్పొరేట్, వ్యాపారరంగానికి ఇచ్చే పథకాలను రాయితీలు, ప్రోత్సాహకాలనడంతోనే. ఉచిత పథకాలైనా, ప్రోత్సాహకాలైనా ప్రజల సంపదే. ఇది ముమ్మాటికీ కాదనలేని నిజం. అభివృద్ధి పేరుతో బడా కార్పొరేట్, వ్యాపార, పారిశ్రామిక రంగాలకు ఇస్తున్న పన్ను రాయితీలు, భూములు, మౌలిక సదుపాయాలు, రాయితీలను కేంద్రం ఉచితంగా భావించడం లేదు. మరోవైపు పారిశ్రామిక రుణాలు తీసుకొని బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన వారి గురించి చర్చే లేదు.
జర్మనీ, జపాన్, ఇంగ్లండ్, ఇటలీ తదితర దేశాల్లో కార్పొరేట్లపై 30-40 శాతం పన్నులు విధిస్తున్నారు. ఆహార ఇతర సంక్షేమ రాయితీలు పెద్ద ఎత్తున ఇస్తున్నారు. కానీ మన ప్రభుత్వం 2019లో తీసుకువచ్చిన ఒక జీవో ద్వారా కార్పొరేట్లు చెల్లించే 30 శాతం పన్నును 22 శాతానికి తగ్గించింది. ఇంకా తగ్గిస్తామనే హామీ కూడా ఇచ్చింది. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వారు 13 రంగాల్లో మోసాలు చేసి బ్యాంకులకు రూ.లక్షల కోట్లు ఎగనామం పెట్టారు. కానీ మన పాలకులు మాత్రం ఉచితాల పేరుతో పేదల నోట్లో మట్టి కొట్టడానికి సిద్ధమయ్యాయి. నేడు జరిగే ఉచితాల పేరుతో జరిగే చర్చలో ఎగనామం పెట్టిన అప్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి కదా? అవినీతి వట వృక్షానికి తల్లి వేరు రాజకీయాలేనని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. దీన్ని చర్చలో పరిగణనలోకి తీసుకోవాలి.
మన రాజకీయ పార్టీలు దేశ ప్రజల నుంచి ఓట్లు, కార్పొరేట్ కంపెనీల నుంచి నిధులు పొం దుతూ ఒకరి నుంచి ఒకరిని కాపాడుతామనే అద్భుతమైన హామీ కల్పించడంలో ఆరితేరారు. ఎన్నికల సమయంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి ఓటుబ్యాంకు మ్యానిఫెస్టోలను, ఆర్థిక వ్యవస్థతో సంబంధం లేకుండా వివిధ పథకాలను ప్రకటిస్తున్నారు. గెలుపు కోసం నగదు, మద్యం, బహుమతులుగా ఇవ్వడం లాంటి స్వార్థపూరిత విధానాలపై చర్చ జరగాలి. అధికారం చేపట్టాక పాలకుల ప్రాధాన్యాలు మారిపోతున్నాయి. ఎన్నికల హామీలను అమలు చేయమని ఓటేసిన ప్రజలు అడిగే హక్కు లేదా? మేధావులు, మీడియా, ఆర్థిక నిపుణులు, రాజకీయ విశ్లేషకులు కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు.
ప్రజా ధనాన్ని కాపాడాల్సిన పాలకులు దొంగల్లా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తులకు అమ్మకానికి పెడుతున్నారు. ఇందుకోసమేనా వీరిని ఎన్నుకున్నది? నల్లధనం తెచ్చి, పేదోడి ఖాతాలో వేస్తామన్నారు? అది చేయకుండా జీఎస్టీ రూపంలో సెస్ల రూపాల్లో ప్రజలను దోచుకుంటున్నది నిజం కాదా? దీని మీద కదా చర్చ జరగాల్సింది? బడా కార్పొరేట్, వ్యాపార వర్గాలు, పాలకుల వద్ద ప్రజల సంపద కేంద్రీకృతమైంది. ఆ సంపదను ప్రజలకు పంచాలి. దీనిపై చర్చ జరగాలి. నేటి పాలకులు సరికొత్తగా ఉచిత పథకాల గురించి చర్చ జరగాలని, ఇవి ఎన్నికల దృష్టిలో పెట్టుకొన్న ఓటు బ్యాంకు విధానాలని, వీటి వలన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడుతుందనడం అర్థ రహితం.
ఉచిత పథకాల కేసు చర్చలో కేంద్రం, ఎన్నికల సంఘం, ఆర్థిక సంఘం, నీతి ఆయోగ్, లా కమిషన్, రిజర్వ్ బ్యాంక్, రాజకీయ పార్టీలు, సభ్యులుగా ఉండాలని సుప్రీం కోర్టు చెప్పింది. ఈ కమిటీ గాని, ఉచితాలపై చర్చలు తెరలేపిన వర్గాలు గాని, పైన చర్చించిన అంశాలను విస్తృతంగా చర్చించాలి. ప్రజాధనాన్ని కొద్దిమంది చేతిలోకి కాకుండా దేశ సంపద సమంగా పంచబడేలా విస్తృత స్థాయిలో అధికారాలు గల ఓ స్వయం ప్రతిపత్తి గల సంస్థనో, చట్టాన్నో చేయాలి. ఇన్నాళ్ల దోపిడీని అరికట్టాలి. ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానతను సాధించాలి. ప్రజల స్వేచ్ఛ పరిరక్షించాలి. చిత్తశుద్ధి ఉంటే సమిష్టిగా అన్ని రాజకీయపార్టీలు ముందుకువచ్చి దీన్ని సాధించాలి. వెంటనే దిద్దుబాటు చర్యలకు పూనుకోవాలి.
(వ్యాసకర్త: మేకిరి దామోదర్ , 95736 66650, సామాజిక విశ్లేషకులు)