‘రేషన్ షాపుల దగ్గర మోదీ ఫొటో మీరు పెట్టకపోతే నేనే వచ్చిపెడతా..’ అని కామారెడ్డి కలెక్టర్పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హుంకరింపు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుకు సరైన అనుమతులు లేవు జాతీయ హోదా ఎందుకు ఇస్తాం..’కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రకోపం. ‘కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తాం..’ అమిత్ షా ప్రేలాపన. ‘కేసీఆర్ నయా నిజాం, టీఆర్ఎస్ను తుడిచి పెట్టేస్తాం..’ జేపీ నడ్డా ఆక్రోశం.
ఈ ప్రేలాపనలు, హుంకరింపులన్నీ ఈ నడుమ తెలంగాణకు వచ్చిన బీజేపీ ప్రముఖులు వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలు. ఒకరకంగా తెలంగాణపై ద్వేషంతో బీజేపీ కేంద్ర నాయకత్వం చేస్తున్న దాడిలో భాగంగా వారినుంచి వస్తున్న విద్వేషపూరితమైన ప్రకటనలు. ఇవన్నీ ఆయా నాయకుల అసహనాన్ని, తెలంగాణ పట్ల విషపూరితమైన ప్రవర్తనను తెలియజేయడమే కాకుండా తమ డొల్లతనాన్ని ప్రతీ రోజు ఎండగడుతున్న కేసీఆర్ పట్ల వారి భయాన్ని తెలియజేస్తున్నాయి.
‘కోడిగుడ్డు పెంకుకున్న బలమెంతో బీజేపీ నాయకుల మాటల్లో దమ్మంత’ అనేది తెలిసిన విషయమే. ఇంతవరకు బీజేపీ నాయకత్వంపై, ప్రత్యేకించి సర్వశక్తి మంతుడు, ప్రపంచ నాయకుడు, విశ్వగురు అని చెప్పుకొంటున్న మోదీ ప్రభుత్వ పనితీరుపై, ఆయన వ్యవహారశైలిపై కేసీఆర్ ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరుస్తున్న తీరుపట్ల, ఇతర పార్టీలను చీల్చి రాష్ర్టాల్లో కుంపట్లు పెడుతున్న వైనం పట్ల, అస్మదీయ కార్పొరేట్ అధిపతులకు దేశ సంపదను దోచిపెడుతున్న దుర్మార్గం పట్ల ప్రశ్నలు కురిపిస్తున్నారు. విభజన రాజకీయాలపై, మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై, దేశంలో పెరుగుతున్న అసహన ధోరణులపైనా.., వాటికి ఆజ్యం పోస్తున్న బీజేపీ నాయకుల వైఖరిపై సొంత రాష్ట్రం దాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గళమెత్తుతున్న తీరుని చూసి బీజేపీ అధినాయకత్వం బెంబేలెత్తుతున్నదని జరుగుతున్న ఘటనలు చెప్తున్నాయి.
బీజేపీకి దేశంలో తగ్గుతున్న ఆదరణ, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, మోదీపై ప్రజల్లో తొలుగుతున్న భ్రమలు, ప్రభుత్వాలున్న రాష్ర్టాల్లో బీజేపీ పాలనా వైఫల్యాల పట్ల ప్రజల్లో అసంతృప్తి తీవ్రరూపం దాల్చుతున్నది. ఈ పరిస్థితులు బీజేపీ నాయకత్వాన్ని కలవరపరుస్తున్నాయి. పెరుగుతున్న ధరలు, అస్తవ్యస్థమైన ఆర్థికవ్యవస్థ, తరుగుతున్న జీడీపీ, వర్గాల మధ్య వైషమ్యాలతో నిత్యం దేశంలో ఏదో ఒక మూల జరుగుతున్న కలహాలు మోదీ పాలనాతీరుకు అద్దం పడుతున్నాయి. కేంద్రం ఉద్యోగాల కల్పన చేయలేక ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ ఆస్తులను తెగనమ్ముతున్నది. ఈ తీరు, పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టిని మరల్చడానికి దేశంలో రోజుకో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఆందోళనలు సృష్టిస్తున్నది. ఇందులో భాగంగానే కేంద్రం మీడియా స్వేచ్ఛను పూర్తిగా హరించివేసి సంకెళ్లు బిగిస్తున్నది. మొత్తంగా బీజేపీ అధినాయకత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నది. మోదీ ప్రభుత్వ తీరు దేశ ప్రజలకు భరించలేనిదిగా తయారైంది.
చైనా దురాక్రమణలపై సొంత పార్టీ ఎంపీలు నిలదీస్తున్నా ప్రధాని మోదీ స్పందించరు. విదేశీ సంబంధాలు క్షీణించి శ్రీలంక లాంటి చిన్న దేశం కూడా చైనాకు మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి ఉన్నది. నాయకుల నోటి దురుసుతో విదేశాలకు క్షమాపణలు చెప్పాల్సిన అగత్యం ఏర్పడింది. చివరికి జాతీయస్థాయి నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలను కూడా తమ పార్టీ వారు కాదని చెప్పుకొనే దుస్థితి బీజేపీకి దాపురించింది.
తెలంగాణలోని సొంత పార్టీ నేతల సామర్థ్యం సరిపొవట్లేదని శిఖండి రాజకీయాలకు తెరలేపిన బీజేపీ కేంద్ర నాయకత్వం.. ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్, తీన్మార్ మల్లన్న, షర్మిళ లాంటి వాళ్ళచేత అసత్య ఆరోపణలు చేయిస్తున్నది. వాస్తవ దూరమైన విషయాలను ప్రచారం చేయిస్తూ కేసీఆర్ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రకటనలు చేయిస్తున్నది. ఆయా వర్గాలను దూరం చేసే కుటిల రాజకీయాలు చేస్తున్నది. రాష్ట్రంలో కేసీఆర్పై వ్యతిరేకత పెరిగిందని, బీజేపీయే అధికారంలోకి వచ్చే వాతావరణం ఉన్నదని భ్రమ కలిగించడం వీరందరి కుటిల యత్నం. ఎమ్మెల్సీ, హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా జరిగిన అనేక సంఘటనలు ఆ విషయాలను బహిర్గతపరిచాయి.
బీజేపీ కపట రాజకీయాలేవీ కేసీఆర్ను కించిత్ కూడా ఇబ్బంది పెట్టలేకపోతు న్నాయి. ఇది భావించిన బీజేపీ నాయకత్వం మొదట ప్రభుత్వ పథకాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది. రైతుల నుంచి వరిధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ను ఇరుకున పెట్టాలని ప్రయత్నించి విఫలమైంది. రుణ సమీకరణ విషయంలో అడ్డంకులు సృష్టించి, ఆఖరికి 24 గంటల ఉచిత కరెంటు సరఫరాను దెబ్బతీస్తే ప్రజల్లో కేసీఆర్ పలుచనవుతారని భావించి భంగపడింది. రాష్ట్ర నాయకులను ప్రజలు నమ్మట్లేదని ఢిల్లీలోని కొందరు అనామక నాయకులతో ప్రెస్మీట్లు పెట్టిస్తున్నది. మొత్తంగా బీజేపీ విష ప్రచారంతో కేసీఆర్పై అపనమ్మకం కలిగించాలని ప్రయత్నం చేస్తున్నది.
‘దేశ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తానని, మీరు ఊరుకున్నా నేను మాత్రం మిమ్మల్ని నిలదీస్తాననే’ తెగింపుతో రాష్ట్రం దాటి రివర్స్ అటాక్ మొదలు పెట్టిన కేసీఆర్ను చూసిన బీజేపీలో భయం రాజుకున్నది. అంతర్గత చర్చల్లో కొరకాసుతో కొరివి గోక్కున్నామేమోనని, రాష్ట్ర నాయకత్వం మాట విని మోసపోయి లేనిపోనీ పరిస్థితి తెచ్చుకున్నామేమోనని బీజేపీ వ్యాకులపడుతున్నది. కేసీఆర్ అనుకుంటే దేనికైనా తెగిస్తారు, తెలంగాణ ఉద్యమ ప్రస్థానమే దానికి ఉదాహరణ అని బీజేపీ నాయకులు అర్థం చేసుకున్నారు. ఇలాగే చూస్తూ ఉంటే మొదటికే మోసం వస్తదనే భయంతో కేసీఆర్ను కట్టడి చేయాలని కుట్రలు పన్నుతున్నారు.
ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకులు వరుస తెలంగాణ పర్యటనలు చేస్తున్నారు. రెండు రోజులకొక కేంద్రమంత్రి, ముఖ్యమంత్రులు, తెలంగాణకు వచ్చి విషం కక్కుతున్నరు. ఒక్క రాష్ర్టానికే ఇద్దరు కేంద్ర ఇంచార్జులు; నడ్డా, అమిత్ షా, మోదీ ఏదో ఒక వంకతో రాష్ట్ర పర్యటనలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ హుంకరింపులు, ఘీంకరింపులు కోట్లాది రూపాయల ఖర్చుతో సభలు, సమావేశాలు, సినీ నటులతో భేటీలు. ఎనిమిదేండ్లలో అసత్య ప్రచారాలతో, కాంగ్రెస్పై వ్యతిరేకతతో సాధించిన ఫలితాలతో.. వాపును బలుపని భ్రమపడుతున్నారు. ఎవరు విమర్శించినా దేశ ద్రోహులని ముద్ర వేసి, కేసులతో బెదిరించే అలవాటున్న బీజేపీ నాయకులకు కేసీఆర్ లేవనెత్తుతున్న ప్రశ్నలు నిద్రపట్టకుండా చేస్తున్నాయి.
మోదీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా నల్ల చట్టాలను ఉపసంహరించుకు నేలా చేసి, రైతులకు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి తెచ్చింది దేశ రైతాంగం. అలాంటి రైతు ఉద్యమ నాయకులు తెలంగాణకు వచ్చి కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అమలుచేస్తున్న పథకాలు, సాగునీటి ప్రాజెక్టులను చూసి అబ్బురపడ్డారు. దేశంలోని రైతుల బాగుకోసం తమకు నాయకత్వం వహించాలని కేసీఆర్ను కోరారు. కేసీఆర్ ప్రయత్నాలకు వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, దేశంలోని ప్రముఖ విపక్ష నాయకులు మద్దతు పలుకుతున్నారు. బీహార్ పర్యటనలో నితీశ్కుమార్ కేసీఆర్ పనితీరును ప్రశంసించారు.
అసహనంతో రాష్ర్టానికొస్తున్న కేంద్రమంత్రులు ఈడీ దాడులు చేయిస్తామని బీరాలు పలుకుతున్నారు. గాలివాటం అని తెలిసినా.. రెండు ఉప ఎన్నికల ఫలితాలు చెప్పి ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఒకరకంగా కేసీఆర్ను రాష్ర్టానికే పరిమితం చేయాలని కుయుక్తులు పన్నుతున్నారు. అయితే ఒక విషయం స్పష్టం. చాలా రాష్ర్టాల్లో దొడ్డిదారిన అధికారం చేపట్టిన బీజేపీ తెలంగాణలో కేసీఆర్ ఉన్నంతవరకు అది సాధ్యం కాదనే విషయం గ్రహించింది. దేశ ప్రయోజనాల కోసం కేసీఆర్ వేస్తున్న ప్రశ్నలు, చెప్తున్న విషయాలు జాతీయస్థాయిలో తమకు నష్టం చేస్తున్నాయని బీజీపీకి అర్థమైంది. అందుకే తెలంగాణపై దాడిని ఉధృతం చేసింది. కానీ, రేపటి సూర్యోదయమెంత నిజమో, కేసీఆర్ విజయం కూడా అంతే నిజం. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఉటంకించిన ఒక పద్యం గుర్తుకువస్తున్నది.
‘ఆరంభింపరు నీచ మానవులు
విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజించుదురు
విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘనిహన్య
మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు
సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్..’
నీచులు సత్కార్యానికి నడుం బిగించరు, కొంతమంది నడుంకట్టినా మధ్యలో వదిలేస్తారు వారు మధ్యములు, కానీ ధీరులు విఘ్నాలను అధిగమించి తమ గమ్యం వైపు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతారు, విజయం సాధిస్తారు… దటీజ్ కేసీఆర్.