కేసీఆర్ ఏ విప్లవాత్మక పథకం ప్రవేశపెట్టినా దాన్ని వివాదంగానో వైఫల్యంగానో చూపాలన్న దురద పచ్చ పత్రికల్లో ఎక్కువ. ఆసరా పించన్ల క్యూలైన్లను కూడా ఛిద్ర దృష్టితో చిత్రించి బురద చల్లిన వైనాలున్నాయి. 24గంటల కరెంటు మీద.. కాళేశ్వరం మీద రైతు బంధు మీద కక్కని విషం లేదు. ఆ కొనసాగింపులో భాగంగా ఇటీవల రాతకృష్ణ దళిత బంధు మీద.. వరిసాగు మీద విషం కక్కారు. దళితబంధు పైరవీకార్లకు అడ్డాగా మారిందన్నాడు. అధికారపార్టీకి అవినీతి అంటగట్టాడు.మరోవైపు ఆ పథకానికి నిధులే లేవన్నాడు. పథకం కొనసాగుతుందా? అని అనుమాన బీజం వేసే యత్నమూ చేశాడు. గత కొంతకాలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద వేయని రాయి లేదు. ఇక అయిపోనట్టే అనడం తప్ప అంతా రాసేశాడు. జీతాలకు డబ్బుల్లేవన్నాడు. ప్రాజెక్టులు ఆగినట్టేనని తీర్మానించాడు.
రాతకృష్ణుడికి తెలుసో లేదో.. దేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే రైతునుంచి ప్రతిగింజా కొంటున్నది. ఇతర రాష్ర్టాల్లో ఈ పద్ధతి లేదు. పశ్చిమ బెంగాల్, బీహార్, యూపీ, చత్తీస్ గఢ్లో అక్కడి ప్రభుత్వాలు ఏవీ 25నుంచి 35 శాతానికి మించి ధాన్యం కొనవు. అంటే అక్కడి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర గరిష్టంగా 35శాతం పంటకు మాత్రమే లభిస్తుంది. ఉదాహరణకు పశ్చిమబెంగాల్ ఏటా ఖరీఫ్ కొనుగోళ్లకు ముందు ఒక్కోరైతునుంచి గరిష్టంగా ఎంత కొంటుందో ప్రకటిస్తుంది. గత సీజన్లో అక్కడ ఒక్క రైతునుంచి 45 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే సేకరించింది. రైతు ఎన్ని ఎకరాల్లో సేద్యం చేసినా ఎంత దిగుబడి వచ్చినా కొనేది 45 క్వింటాళ్లే. మిగిలింది ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సిందే.
కేంద్రం కిరికిరీల సంబురం సరేసరి. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన పని తాను చేసుకు పోతున్నది. అడ్డంకులు దాటుకుంటూ ప్రగతియాత్ర కొనసాగిస్తూ ఉంది. ప్రాజెక్టులు ఆగలేదు. పథకాలు నిలిచిపోలేదు. కేంద్రం కొర్రీలు అధిగమించి రాష్ట్ర ఆర్థికరథం ముందుకు సాగుతున్నది. ఇంతకూ దళితబంధుకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? నిన్నగాక మొన్ననే వనపర్తి నూరుశాతం పథకం అమలు ప్రకటించుకున్నది. దళిత విజయగాథలు ఇపుడిప్పుడే పత్రికల్లో కథనాలవుతున్నాయి. అయినా ఆ పథకంలో అనేక సమస్యలున్నాయని చెప్పుకొచ్చాడు. వాస్తవానికి దళితబంధు ఇప్పుడు రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్గా మాత్రమే అమలవుతున్నది. ‘పైలెట్ ప్రాజెక్ట్’ అంటే ఏమిటో తెలిసిన వారు ఈ అమలునే ప్రామాణికంగా తీసుకోరు. పథకం అమలు తీరులో ఏర్పడే ఇబ్బందులు ఇతర సమస్యలు పరిశీలించడానికే పైలట్ ప్రాజెక్ట్. వాస్తవానికి ఏ పథకానికైనా ప్రారంభ దశలో బాలారిష్టాలుంటాయి.
అవి క్రమంగా సర్దుకుంటాయి. సమస్యలు ఉన్నట్టే పరిష్కారాలూ ఉంటాయి. ప్రస్తుతం దరఖాస్తు దారు లు పూర్తిస్థాయిలో సర్టిఫికెట్లు దాఖలు చేయకపోవడం వల్ల కొన్ని యూనిట్ల గ్రౌండింగ్కు ఆటంకంగా ఉందని అధికారులు చెప్తున్నారు. అవి మినహా దళిత బంధు రాష్ట్రంలో పలు చోట్ల గ్రౌండింగ్ దశలో ఉంది. కొన్ని చోట్ల లబ్ధిదారులు శిక్షణ దశలోనో లేక యూనిట్ల ఎంపిక దశలోనో ఉన్నారు. ఆ మేరకు నిధుల కేటాయింపు ఉంటున్న ది. మొత్తం ‘టార్గెట్’లో కేవలం 10శాతం మాత్రమే మిగిలిందని అధికారులు చెప్తున్నారు.
‘దళితబంధు’కు రాజకీయాలు కూడా అంటగట్టారు. కానీ ఈ పథకం అధికారపార్టీకేదో ఆదాయంగా మారిందన్నాడు. కానీ దళితబంధు పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్తో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా అమలులో ఉన్నది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలా ఎంపికలు చేసుకుంటున్నారో అలాగే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ఎంపిక చేసుకుంటున్నారు. హుజూరాబాద్లో ఈటల, ములుగులో సీతక్క, ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క ఎంత స్వేచ్ఛగా అమలు చేసుకుంటున్నారో.., అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమలు చేసుకుంటున్నారు. ఇది పకడ్బందీగానే అమలు జరుగుతున్నది. ఈ బాధ్యత ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలకు ఇచ్చారు.
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్కు కూడా ఒక్క లబ్ధిదారుడిని ఎంపిక చేసే అధికారం లేదు. ప్రపోజల్ నుంచి గ్రౌండింగ్ ద్వారా అంతా ఆన్లైన్లోనే జరుగుతున్నది. ఎమ్మెల్యేలకు ఎంపిక అధికారం అనేది పెద్ద వివాదాస్పద అంశం కాదు. ఎప్పటినుంచో ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులున్నాయి. వాటి అమలు మీద హక్కు, స్వేచ్ఛ ఉండి చాలా కాలంగా ఎలా అమలు జరుగుతున్నదో అదే రీతిలో దళితబంధు కూడా అమలు జరుగుతున్న ది. ఇక నిధుల సమస్య అనేది అన్ని కార్పొరేషన్లకు ఎలా నిధులు సమకూరుతాయో దీనికి అలాగే వస్తాయి. ఈ విషయంలో ఎవరూ బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
వరి పాపం ఎవరిది?
రాతకృష్ణుడి రాతలు అంతటితో ఆగలేదు. నిన్నో మొన్నో తెలంగాణలో వరి ఉల్టాపల్టా అయిందని ఓ వార్త పతాక శీర్షికలో పరిచేశాడు. గమ్మత్తేమిటంటే వరి తగ్గడానికి కేంద్రంతో పంచాయతీ కారణమని తీర్మానించేశాడు. అసలు వరి విషయంలో బీజేపీ విష వైఖరి ఏమిటో రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు పడిందో అందరికీ తెలుసు. అయినా రాష్ర్టానిదే తప్పని తీర్పులు.
వరిసాగును ప్రోత్సహించాలని కేంద్రం కోరిందట! రాష్ట్రం తిరోగమనంలో ఉందట!! ఇతర రాష్ర్టాల కన్నా భారీ వ్యత్యాసముందట. సరే పత్రిక చేతిలో ఉంది కాబట్టి ఏమైనా రాసుకోవచ్చు. కేసీఆర్ పనిగట్టుకొని వరి పీకించాడనీ రాసుకోవచ్చు. ఎవరి స్వేచ్ఛ వారిది. కానీ వరి వేస్తే ఉరి అని కేసీఆర్ ఎందుకు రైతులను హెచ్చరించారు? కేంద్రం కిరికిరీలు పెట్టింది కాబట్టి. రబీలో బాయిల్డ్రైస్ కొనబోం అంటూ పేచీలు పెట్టింది కాబట్టి. ప్రత్యామ్నాయ పంటలు వేసుకొమ్మని సలహా ఇచ్చింది కాబ ట్టి. ఇదంతా తెలియనట్టు.. వరి సాగు తగ్గడానికి కేసీఆర్ కారణమైనట్టు రాతలు. బియ్యం కొనడానికి ఎఫ్సీఐ మొండికి పోయి గత ఖరీఫ్ బియ్యంతో పాటు రబీ బియ్యాన్ని కొనుగోళ్లు అర్ధంతరంగా ఆపేయడం వల్ల ఇవాళ రాష్ట్రం ఆధీనంలో వేల కోట్ల విలువ చేసే బియ్యం వృథాగా పడి ఉన్నాయి. ఈ దశలో మళ్లీ భారీగా వరిసాగు చేస్తే.. కొనడం, కొన్న వాటిని అమ్మడం రెండూ సాధ్యం కాదు కాబట్టి రైతుకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు రైతులు స్పందించి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లారు. దీనివల్ల రాష్ర్టానికి రైతులకు వచ్చిన నష్టమేమీ లేదు. కాబట్టి అనవసరంగా రాతకృష్ణ కన్నీళ్లను ఖర్చు పెట్టుకోకుండా ఉంటే మంచిది.
ఇదీ రైతుకు చేయూత..
రాతకృష్ణుడికి తెలుసో లేదో.. దేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే రైతునుంచి ప్రతిగింజా కొంటున్నది. ఇతర రాష్ర్టాల్లో ఈ పద్ధతి లేదు. పశ్చిమ బెంగాల్, బీహార్, యూపీ, చత్తీస్ గఢ్లో అక్కడి ప్రభుత్వాలు ఏవీ 25నుంచి 35 శాతానికి మించి ధాన్యం కొనవు. అంటే అక్కడి రైతులకు ప్రభు త్వం ప్రకటించిన మద్దతు ధర గరిష్ఠంగా 35శాతం పంటకు మాత్రమే లభిస్తుంది. ఉదాహరణకు పశ్చిమబెంగాల్ ఏటా ఖరీఫ్ కొనుగోళ్లకు ముందు ఒక్కో రైతునుంచి గరిష్ఠంగా ఎంత కొంటుందో ప్రకటిస్తుంది. గత సీజన్లో అక్కడ ఒక్క రైతునుంచి 45 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే సేకరించింది. రైతు ఎన్ని ఎకరాల్లో సేద్యం చేసినా ఎంత దిగుబడి వచ్చినా కొనేది 45 క్వింటాళ్లే. మిగిలింది ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సిందే.
బీహార్లో 2020-21 సంవత్సరంలో భూమి పత్రాలు కలిగిఉన్న రైతునుంచి గరిష్ఠంగా 250 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే సేకరించారు. ఉత్తరప్రదేశ్లో మార్కెట్యార్డుల్లో వసతులు లేవు. చాలా చోట్ల మార్కెట్యార్డులే లేవు. దేశంలో మొత్తం వరి ఉత్పత్తిలో 13శాతం దిగుబడి వచ్చే ఆ రాష్ట్రం ఎఫ్సీఐకి సేకరించి పెట్టేది అందులో 30 శాతం మాత్రమే. అంటే ఉత్తరాది రాష్ర్టాల రైతులు తమ పంటలో సుమారు 60-70 శాతం పంటను ప్రైవేట్ వ్యాపారులకు, సంస్థలకే అమ్ముకుంటారన్న మాట. వాటికి ఎంత ధర వస్తుంది? గత ఖరీఫ్ సీజన్లో ప్రైవేటు వ్యాపారులు వరి ధాన్యానికి మధ్యప్రదేశ్లో రూ.1200, యూపీలో రూ.1500, బెంగాల్లో రూ.1900లు మాత్రమే చెల్లించారు.ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం రూ.1969 మద్దతు ధర ఇచ్చి మొత్తం వరిపంట కొనుగోలు చేసింది.
దేశం సర్వనాశనం..
ప్రతిదానికీ కేసీఆర్ సర్కార్ మీద పడే రాతకృష్ణుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాయో ఏ రోజూ రాయడు. ఆహారధాన్యాల విధానమే తీసుకుంటే.. గత ఏడాదిన్నరనుంచి ధాన్యం కొనుగోళ్ల మీద కేంద్రం ఎక్కడ లేని ఆంక్షలు, కొర్రీలు పెట్టింది. ‘దేశంలో గోదాముల నిండా బియ్యం నిల్వలున్నాయి. వరి వేయడాన్ని ప్రోత్సహించవద్దు’ అంటూ పీయూష్గోయల్ ఆరున్నొక్క రాగంలో పాట ఎత్తుకున్నాడు. ఆ మేరకు ఎఫ్సీఐతో కొనుగోళ్లకు కొత్త మార్గదర్శకాలు పెట్టి నానా కొర్రీలు పెట్టించాడు. రాష్ట్ర ప్రభుత్వాలతో యుద్ధాలు చేశాడు. భారీగా కొనుగోళ్లు తగ్గించాడు.
ఆహార ధాన్యాల సబ్సిడీలు వదిలించుకునే క్రమంలో పారాబాయిల్డ్ రైస్ వివాదం సృష్టించారు. దీనిమీద కేసీఆర్ ప్రభుత్వం పోరాడింది. అయినా కేంద్రం పెడచెవిని పెట్టింది. ఇవాళ పరిస్థితి ఏమిటి? అంతర్జాతీయ మార్కెట్లో బియ్యానికి కనీవినీ ఎరుగని ధరలు పలుకుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన ఆహార భద్రత భయం ఓ కారణం కాగా వరి ఉత్పత్తిలో అగ్రగామి దేశాల్లో వాతావరణ ప్రతికూలత మరో కారణం. ఎగుమతులతో మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉన్నా, ప్రభుత్వం సేకరణ విధానం ఫలితంగా మన దేశం ఎగుమతులు, దిగుమతుల రంగంలో బ్యాలెన్స్ కోల్పోయింది. ఫలితంగా రూపాయి ధర భారీగా పతనమైంది. నిజానికి ఆహార ధాన్యాలు ఏ అడ్డంకులూ లేకుండా కేంద్రం కొనుగోలు చేసి ఉంటే.. ఇవ్వాళ బియ్యం, గోధుమల ఎగుమతుల్లో మంచి వ్యాపారం జరిగి పెద్దమొత్తంలో విదేశీ మారకద్రవ్యం వచ్చి ఉండేది. రాజకీయాల కోసం ఆ ఛాన్స్ను పోగొట్టుకున్నట్టు అయింది.
దేశంలో పడిపోయిన సాగు..
రాతకృష్ణుడు గమనించాల్సింది ఏమిటంటే.. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా వరిసాగు చతికిలపడ్డది. దానికి కేంద్ర వైఖరి అందునా పీయూష్గోయల్ వైఖరే ప్రధాన కారణం. ఆయన చేసిన రభస పుణ్యమా అని దేశంలో ఆహారధాన్యాల సాగు ఈ ఖరీఫ్ సీజన్లో 20 శాతానికి పైగా తగ్గింది. మరో వైపు అంతర్జాతీయంగా ఆహారధాన్యాల డిమాండ్ కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతున్నది. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో 5 శాతం నూకలతో మన పారాబాయిల్డ్ రైస్ బియ్యం ధర టన్నుకు 350 నుంచి 450 డాలర్లు పలుకుతున్నది. ఇతర బియ్యం రకాలు కనీసం 340 నుంచి 450 వరకు పలుకుతున్నాయి. వియత్నాం బియ్యమైతే 500డాలర్లు, థాయ్లాండ్ బియ్యం 449 డాలర్లు పలుకుతున్నాయి. దరిద్రం ఏమిటంటే ఇంత మంచి ధర వస్తున్న సమయంలో మనదేశంలో 35 లక్షల హెక్టార్ల వరిసాగు తగ్గిపోయింది.
బంగ్లాదేశ్, చైనా, ఫిలిప్పీన్స్ దేశాలు మన బియ్యం కోసం అర్రులు చాస్తున్నాయి. బంగ్లాదేశ్ అయితే మన దేశంనుంచి దిగుమతి అయ్యే బియ్యం మీద సాధారణంగా విధించే టారిఫ్లు, సుంకాలను 62.5 శాతం నుంచి 25 శాతానికి తగ్గించింది. అక్కడ వరదల కారణంగా వరి సాగు దెబ్బతిని బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తన అవసరాల్లో కొంతమేర భారత్నుంచి కొనుగోలు చేయడం బంగ్లాకు పరిపాటి. సాధారణంగా సెప్టెంబర్ నెలలో ఇండియానుంచి బియ్యం కొనుగోలు చేసే ఆ దేశం.. బియ్యం కొరత భయంతో ఈసారి జూన్ నెలనుంచే ఇండియానుంచి కొనుగోలు చేసి పెట్టుకున్నది. ప్రపంచంలో బియ్యిం ఎగుమతుల్లో 3వ స్థానంలో ఉన్న వియత్నాం కూడా యుద్ధ నేపథ్యంలో చౌకధరకు ఇండియా నుంచి లభించే 70 వేల టన్నుల బియ్యం కొని స్టాక్ పెట్టుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇండియా బియ్యం 387 డాలర్లు పలికితే వియత్నాం అదేరకం బియ్యాన్ని 500 నుంచి 550 డాలర్లకు టన్ను చొప్పున అమ్ముతున్నది. అంతర్జాతీయ మార్కెట్ రంగం ఇలా ఉంటే దేశంలో సాగు పరిస్థితి ఇలా అఘోరించటానికి కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలే.
కేంద్రం వేధింపులే..
మన దేశంలో ప్రధానంగా బెంగాల్, యూపీ, పంజాబ్, చత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాలు వరి ఉత్పత్తిలో అగ్రగాములుగా ఉన్నాయి. గత రెండు సీజన్లలో కేంద్రం ఈ రాష్ర్టాలను ఎఫ్సీఐ కొనుగోళ్ల విషయంలో తీవ్రంగా వేధించింది. ధాన్యం కొనుగోలులో అయోమయం రైతులను తీవ్రంగా కుంగదీసింది. దీని ప్రభావం సాగుమీద పడింది. అందుకే ఈ ఖరీఫ్ సీజన్లో పంట విస్తీర్ణం 35 లక్షల హెక్టార్లు తగ్గిపోయిం ది. అంతా చేసి ఇప్పుడు.. ‘వరిని ప్రోత్సహించండి’ అంటూ గోయల్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు దేశంలో ఆహారధాన్యాల కొరత ఏర్పడుతుందేమో అనే ఆందోళన కనిపిస్తున్నది. కేంద్రం ఆగమేఘాల మీద గోధుమ ఎగుమతులు నిషేధించటం గమనార్హం.
వెబ్సైట్లో సాగు వివరాలు మాయం..
కేంద్ర విధానాల ఫలితం.. వివిధ ఆహార ధాన్యాలు, పప్పుదినుసుల సాగుమీద స్పష్టంగా కనిపిస్తున్నది. తాజా పరిస్థితి ఏమిటి? దేశంలో ఆహార ధాన్యాల నిల్వల మీద దృష్టి సారించే పరిస్థితి. విమర్శలకు జడిసి ఆహార మంత్రిత్వశాఖ వెబ్సైట్లో రెండు మూడు వారాలనుంచి దేశంలో వరిపంట సాగు విస్తీర్ణమెంతో తెలిపే వివరాలు పెట్టడం మానేశారు. సాగు తగ్గిందని తెలిస్తే మార్కెట్లో రేట్లు పెరుగుతాయట. దేశీయ వరి ఉత్పత్తిలో యూపీ, బెంగాల్లోనే 25శాతం దిగుబడి వస్తుంది. ప్రస్తుతం ఈ రెండు రాష్ర్టాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు. యూపీలో తీవ్ర కరువు పరిస్థితులు, బెంగాల్లో ప్రతికూల వాతావరణం కారణంగా సాగు తగ్గింది. ఇటీవలి వర్షాలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. తెలంగాణలో జూలైలో వరి నారు దశలోనే ఉంటుంది. కానీ బెంగాల్ సీజన్ వేరు. జూలైకి బాగా ఎదిగి వర్షాల కారణంగా తీవ్ర పంటనష్టం జరి గింది. 30శాతం పంట పొలాల్లోనే పాడైంది. మొత్తంగా 40శాతం సాగును నష్టపోయినట్టే. మన దేశం ఏటా 20నుంచి 21మిలియన్ టన్నుల ధాన్యం ఎగుమతి చేస్తుంటుంది.
కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక కేంద్రప్రభుత్వ అపసవ్య విధా నాల వల్ల ఎగుమతులు దిగుమతుల రంగం సమతుల్యత తప్పింది. ఎఫ్సీఐ సేకరణ బాగా తగ్గిపోయింది. ఆహార ధాన్యాలకు ప్రోత్సాహం కరువై రైతులు ఇతర పంటల వైపు మళ్లుతున్నారు. ఇంతా చేసి గత నాలుగైదు ఏండ్లుగా వాతావరణ అనుకూలతల కారణంగా పెరిగిన ఆహారధాన్యాల ఉత్పత్తిని, గత సీజన్తో భారీగా పెరిగిన దిగుబడి వల్ల వచ్చిన ఎగుమతుల పెంపును తన గొప్పగా పీయూష్గోయల్ ప్రకటించుకుంటున్నారు. పోనీ ఎగుమతుల్లో పెంపువల్ల రైతులకేమన్నా ఒరిగిం దా అంటే ఎఫ్సీఐ కొన్నదే తక్కువ. మిగిలిందంతా బీజేపీ మిత్ర వ్యాపారబృందమే అగ్గువ ధరకు కొని ప్రపంచ మార్కెట్లో భారీ లాభాలకు అమ్ముకుంటున్నది.
చక్కెరకే సమర్పయామి…
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఒక్క చక్కెర పారిశ్రామికవేత్తలు తప్ప మరెవరూ వ్యవసాయదారులుగా కనిపించడం లేదు. ఆ పరిశ్రమకు మాత్రం 18వేల కోట్ల రాయితీలు, ప్రోత్సాహకాలు ధారదత్తం చేసింది. దేశంలో ఏ వస్తువుకూ కనీస కనిష్ఠ ధర విధానం ఉండదు. ఒక్క చక్కెరకు మాత్రం ప్రభుత్వం కనిష్ఠ ధర రూ.31గా ప్రకటించింది. ఏ ఫ్యాక్టరీ అయినా అంతకన్నా ఒక్క రూపాయి తక్కువకు అమ్మినా లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కేసు నమోదు చేస్తుంది.
గోధుమల మాయ..
కేంద్రం అపసవ్య విధానాలకు ఇటీవలి గోధుమ ఎగుమతుల నిషేధమే తార్కాణం. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో హఠాత్తుగా నిషేధం విధించింది. యూరప్లో గోధుమల కొరత ఏర్పడి వివిధ దేశాలు భారత్ను అర్థించినా వినలేదు. ఈలోగా ఐక్యరాజ్యసమితి జోక్యంతో టర్కీ మధ్యవర్తిగా ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా నిలిచిపోయిన గోధుమల లోడ్ నౌకలు యూరప్కు చేరుకున్నాయి. ఈ సమయంలో గోధుమలు 250నుంచి 400 డాలర్ల వరకు ధర పలికాయి. మన దగ్గర భారీ నిల్వలు ఉన్నా ఆ అవకాశం వాడుకోలేక పోయాం. అంతా అయిపోయాక ఇపుడు ‘ఓపెన్ ఆక్షన్’ పెడతానని ఎఫ్సీఐ అంటున్నది. గోధుమల ఎగుమతుల మీద నిషేధం ఎత్తేస్తారనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే ఉత్తరాదిలోని మొత్తం గోధుమ పంటను ఐటీసీ, ఆదానీ అగ్రిలాజిస్టిక్స్ భారీగా కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకున్నాయి. ఇపుడు స్టాక్ మార్కెట్లో వాటి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ లోగుట్టు ఏమిటో దేవుడికెరుక.
సబ్సిడీలకు మంగళం..
మోదీ హయాంలో కేంద్రం ఒక్కటొక్కటిగా సబ్సిడీలకు మంగళం పాడే విధానం ఎంచుకున్నది. ప్రస్తుతం మన దేశం లో ఏటా రూ.1,60,000 కోట్ల మద్దతు, సబ్సిడీల రూపంలో ఆహారధాన్యాలకు ఇస్తున్నారు. ఇవి ఎత్తేయడంలో భాగమే ఎప్సీఐ ధాన్యం కొనుగోలు కొర్రీలు. అయితే దేశంలో రైతులు అనాదిగా ప్రభుత్వ మద్దతు మీద ఆధారపడ్డారు. ప్రభుత్వ మద్దతు లేకుంటే దేశంలో వ్యవసాయం సాగలేదు. ఎందరో మేధావులు ఈ దేశంలో వ్యవసాయానికి ఒక విధానం రూపొందించారు. దేశంలో నెలకొన్న పరిస్థితులను, మార్కెట్ మెకానిజంను, రైతు కష్టాలను గమనించి మేలైన విధానాలను రూపొందించారు. ఉన్నమాట చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నపుడు ఎన్నికుంభకోణాలకు పాల్పడ్డా వ్యవసాయ ఆర్థిక విధానాలను నిపుణులకు మేధావులకు వదిలేసింది తప్ప అందులో వేలు పెట్టలేదు. సొంతపైత్యాన్ని జోడించనూ లేదు. కానీ మోదీ సర్కారు వ్యవసాయ చట్టాల పేరుతో వ్యవసాయ ప్రైవేటీకరణ దిశగా తన లక్ష్యాలను నగ్నంగా బయట పెట్టుకుంది.
ఇవాళ ప్రపంచమంతా వ్యవసాయ రంగానికి భారీ సబ్సిడీలు ఇచ్చి నిలబెట్టుకుంటుంటే.. మన దేశంలో రైతు నడ్డి విరిచే విధానాలు ప్రారంభమయ్యాయి. దాని విపరిణామాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. సబ్సిడీలు ఎత్తేస్తే లేదా మద్దతు ధరనుంచి కొనుగోళ్లనుంచి ప్రభుత్వం తప్పుకుంటే ఈ దేశ రైతుకు వ్యవసాయం మానేయడం మినహా గత్యంతరం ఉండదు. ఇది తిరిగి తిరిగి ఆహారధాన్యాల కొరతకు దారి తీస్తుందనే ఆందోళన బుద్ధి జీవుల్లో ఉంది. ఇవాళ్టికి ఇవాళ ఆహారధాన్యాల సాగు తగ్గడం కారణంగా బెంగాల్ వంటి రాష్ర్టాల్లో ఇప్పటికే బియ్యం ధరలు 10శాతం పెరిగాయని వార్తలు వస్తుండటం గమనించదగినది.
రైతు ఆదాయం పెరిగిందా?
అసలు ఆహారధాన్యాలు.., ఆ మాటకొస్తే వ్యయసాయం మీద కేంద్రం విధానమేమిటి? ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీ దిశగా బీజేపీ ప్రభుత్వం ఒక్క అడుగన్నా వేసిందా? ఆ మేరకు వ్యవసాయాన్ని బలోపేతం చేసే కార్యక్రమం ఏమన్నా తీసుకుందా? అంటే సమాధానం లేదు. పైగా రైతుల ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన మార్కెట్ కమిటీలను ఎత్తేసే వ్యవసాయ చట్టం తీసుకొచ్చింది. కాలం కలిసివచ్చి గత నాలుగైదు ఏండ్లుగా వాతావరణ అనుకూల పరిస్థితులు తదితర కారణాల వల్ల దేశంలో ఆహారధాన్యాల దిగుబడి భారీగా పెరుగుతూ వస్తున్నది. అదే సమయంలో వాటికి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాల్సిన కేంద్రం ఒక్కో అడుగూ వెనక్కి తీసుకుంటున్నది!
ఒకనాడు డజనుకు పైగా వ్యవసాయ దిగుబడులను మద్ద తు ధరతో కొనుగోలు చేసిన ఎఫ్సీఐ, ఐటీసీలు బీజేపీ ప్రభు త్వం వచ్చాక వాటిని మూడు నాలుగు పంటలకే పరిమితం చేశాయి.అంతర్జాతీయ మార్కెట్లో 40శాతం వరి ఎగుమతు లు ఇండియావే. అయినా ఇక్కడ ఒక సమగ్ర వ్యవసాయ విధానం లేదు. మనకన్నా చిన్న దేశాలు వియత్నాం, థాయ్లాండ్ దేశాలు అక్కడ వ్యవసాయాన్ని ప్రోత్సహించాయి. వ్యవసాయాన్ని యాంత్రీకరణ చేశాయి. పరిశోధనలు ప్రోత్సహిస్తున్నాయి. రైస్ మిల్లుల ఆధునీకరణ జరిగింది. ఇండియా లో 45వేల మిల్లులున్నాయి. కానీ సామర్థ్యం చాలా తక్కువ. దేశంలో విశాల సాగు భూభాగం ఉంది. కష్టించే రైతులున్నారు. అయినా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. ఇబ్బడిముబ్బడిగా దిగుమతులు వస్తే నిల్వ చేయడానికి స్టోరేజీలు కూడా లేకపోవటం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం కదా?
విశాలమైన వ్యవసాయక దేశమై ఉండీ.. ఏటా లక్షా 40వేల కోట్ల విలువైన వంటనూనెలను మనం దిగుమతి చేసుకుంటున్నాం. సన్ఫ్లవర్, సోయా, పామాయిల్లతో పాటు ఆవాల నూనెను కూడా దిగుమతి చేసుకుంటున్నాం. ఉత్తరాదిలో ముఖ్యంగా యూపీ, రాజస్థాన్లో వంటలకు ఇంటింటా ఆవాలనూనె వాడుతారు. మన వాతావరణంలో ఆవాల పంట బేషుగ్గా పండుతుంది. కానీ ప్రోత్సహించిన వారు లేరు. అలా గే కెనడానుంచి ఏటా 40వేల టన్నుల కందిపప్పును దిగుమతి చేసుకుంటున్నాం. మన దగ్గర కందిపంట పండించలేమా? బీజేపీ ప్రభుత్వం దగ్గర ఇందులో ఏ ఒక్కదానికీ సమాధానం ఉండదు. దేశం ధర్మం మీద నడుస్తున్నది. పౌరులు ఎవరి కర్తవ్యం వారు నిర్వర్తిస్తూ దేశాన్ని నడుపుతున్నారు. ‘గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం’ అన్నట్లు.. జరిగిన మంచిని బీజేపీ తనఖాతాలో వేసుకొని బండిలాగుతున్నది.
దేశాన్ని ఈ దుస్థితికి తెచ్చిన బీజేపీ నాయకులు ఇప్పుడు తెలంగాణలో తిరుగుతూ తామేదో ఫుడింగిలమంటూ కహానీలు చెప్తున్నారు. సంస్కృతంలో ఓ సుభాషితముంది.
‘స్వమణ్డల మపరిపాలయతః
పరమణ్డలాభియోగః
వివననస్య శిరోవేష్టనమివః’
అంటే.. ‘తన రాజ్యాన్నే చక్కదిద్దుకోలేని వాడు.. పర రాజ్యం మీద దండయాత్ర చేయడం దిగంబరుడు తలపాగా ధరించడం వంటిది’ అని. ఇది కేంద్రంలోని బీజేపీకి చక్కగా నప్పుతుంది.
ఎస్జీవీ శ్రీనివాసరావు