నిందితులను విచారించేందుకు ప్రత్యేకంగా తగిన సాక్ష్యాధారాలు లేనపుడు, కొందరు వ్యక్తులు నిర్వహించే అనధికార న్యాయస్థానం ‘కంగారూ కోర్టు’ అని నిఘంటు అర్థం. న్యాయ ప్రమాణాలను, ప్రజల చట్టబద్ధ హక్కులను, రాజ్యాంగాన్ని కంగారూ కోర్టు పట్టించుకోదు. విచారించకనే దోషిని నిర్ధారించి, శిక్ష నిర్ణయిస్తుంది. ఉద్దేశపూర్వకంగా బాధ్యతలను మరిచే చట్టసమ్మత కోర్టులూ కంగారూ కోర్టులే.
పోటీ నిర్వహణలో తటస్థంగా ఉండాల్సిన రెఫరి.. తొండి టీంలో ప్రధాన ఆటగానిగా మారితే, శక్తిసామర్థ్యా లున్న ప్రతిపక్షం కూడా గెలవలేదు. న్యాయవ్యవస్థలో పాలకవర్గ ప్రమేయం ఇలాంటి స్థితినే కల్పిస్తుంది. కం గారూ కోర్టు ఆస్ట్రేలియా పదమని కొందరు అంటారు. కానీ ఈ పదజాల మూలం అమెరికాలో ఉందని ఆక్స్ఫర్డ్ ఆంగ్ల నిఘంటువు పేర్కొంది. 1849లో కాలిఫోర్నియాలో బంగారు గనుల యాజమాన్యంపై హడావు డి విచారణ జరిగింది. సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా దాటేసి ప్రతివాదులకు అనుకూల తీర్పు చెప్పారు. దీంతో న్యాయం కంగారూలాగా గంతులు వేసిందని ప్రచారం జరిగింది. ఈ విధంగా, కంగారూ కోర్టులనే పదం ఉనికిలోకి వచ్చింది.
బొహేమియన్ నవలాకారుడు ఫ్రాంజ్ కాఫ్కా 19 14లో తన జర్మన్ నవల ‘ట్రయల్’లో పాలకులు నేరమే తెలపకుండా తమ వ్యతిరేకులను ఎలా బంధించి ఉరి శిక్ష విధిస్తారో వర్ణించారు. 1933-45 మధ్య జర్మనీ నియంత హిట్లర్ ప్రజాకోర్టుల పేరుతో కంగారూ కోర్టులు నడిపాడు. 20.07.1944న హిట్లర్పై హత్యా ప్రయత్నం చేశారన్న ఆరోపణతో ప్రగతిశీల పోరాట యోధులందరికీ ఈ కోర్టులు ఉరిశిక్ష వేశాయి. మన కోరేగావ్ అరెస్టులు ఈ కోవలోవే. డిసెంబర్ 1989లో సోషలిస్ట్ రొమేనియాలో అంతర్యుద్ధం జరిగింది.
దేశాధ్యక్షుడు, కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన నికోలె క్యూసెస్కు, ఆయన భార్య ఎలేనాలకు కంగారూ కోర్టు ఉరిశిక్షవేసింది. పాలకవర్గ, అధికారుల ప్రోత్సహిత హత్యలు, అఘాయిత్యాల్లో కంగారూ కోర్టులు దోషులను శిక్షించవు. దీనికి గోద్రా, బాబ్రీ మసీదు కేసులు ఉదాహరణలు. ప్రజా పక్షపాత రాజకీయవేత్తలు, ప్రజాసంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలను కంగారూ కోర్టులు శిక్షిస్తాయి. ప్రాచీన హీన సంస్కృతి రూపంలో నేటికి పంచాయతీ కంగారూ కోర్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి గోవధ నుంచి కుల, మతాంతర వివాహాల వరకు ఏకపక్ష తీర్పులు అమలుచేస్తూనే ఉన్నాయి.
పాలకులు న్యాయమూర్తులను రాజ్యాంగ పదవులతో ప్రలోభపెడతారు. కొందరిని పాత సంఘటనలతో బెదిరిస్తారు. మరికొందరిని వారి పాత తీర్పులతో నోర్లు మూయిస్తారు. ఫలితం..‘కంగారూ కోర్టు’లు. ఇటీవలి కాలంలో అధిక శాతం తీర్పులు పాలకపక్ష అనుకూలం. కీలక తీర్పుల్లో కూడా అసమ్మతి నోట్ ఉండటం లేదు. పాలకవర్గ అవసరాలను దృష్టిలో పెట్టుకొన్న కేసులు వెం టనే విచారణకు వస్తాయి. కొన్ని ఎంతకాలమైనా విచారణకు నోచుకోవు. చాలా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు విచారణకే రావు.
బాబ్రీ మసీదు కట్టుకథతో అధికారాన్ని చేపట్టిన పాలకులు రాజ్యాంగాన్ని చట్టపర కట్టుకథగా మార్చారు. పాలకపక్ష నేరస్థులు విముక్తులయ్యారు. భావజాల, తాత్విక అసమ్మతీయులు జైళ్లల్లో ఉన్నారు. ప్రజలను రెచ్చగొట్టి విధ్వంసం, హత్యలకు కారణమైనవారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. రాజ్యాంగం అమలుకావాలంటున్న మేధావులు, ప్రగతిశీల యువత ఉగ్రవాద ముద్రతో జైళ్ళలో ఉన్నారు. రాజ్యం, పాలకపక్ష మాధ్యమాలు కలిసి భారత భవిష్యత్తును హత్య చేశాయి. దేశ ప్రేమికులు మాట్లాడటానికే భయపడుతున్నారు. కంగారూ కోర్టుల్లో చట్టం తన పని తాను చేయదు. రాజ్యాంగ విలువల పతన ప్రక్రియకు కంగారూ కోర్టులు కవచంగా మారుతాయి.
-సంగిరెడ్డి హనుమంత రెడ్డి, 94902 04545
(వ్యాసకర్త: ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి)