అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్ నేడు వెనకబడిన దేశాల జాబితాలోకి వెళ్లింది. ప్రపంచ మార్కెట్లో మన రూపాయి విలువ గణనీయంగా పడిపోయింది. ద్రవ్యోల్బణం పెరిగిపోయి ఆకాశాన్నంటుతున్నది. నిత్యావసరసర ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. రాజకీయాల్లో అధికార దాహం, స్వార్థం, అవినీతి, ఆధిపత్యం, చివరికి దౌర్జన్యం వెర్రితలలేస్తున్నవి. ‘నైతిక విలువలు, మానవీయ, వైజ్ఞానిక దృక్పథం’ లోపించడంతో మన దేశంలో ఇలాంటి వికృత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
కేంద్రం ప్రవచించే ‘వన్ నేషన్-వన్ టాక్స్’ మాటల్లో ద్వంద్వ విధానాలు దాగి ఉన్నాయి. పేరుకే పన్ను ఒక్కటి. మరో రూపంలో సెస్లు, సర్చార్జీలు రెండింటినీ సుంకాలుగానే వ్యవహరిస్తారు. కానీ ఈ రెండిటి మధ్య మౌలిక తేడా ఉన్నది. ‘సెస్’ అంటే ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం వసూలు చేసేది. కానీ ‘సర్చార్జ్’కు నిర్దిష్టమైన ప్రయోజనాలుండవు. దేశంలో రకరకాల పన్నులు లేకుండా, ఒకే పన్ను తీసుకురావటం కోసమే జీఎస్టీ (వస్తు సేవల పన్ను) అని చెప్పుకొంటున్న కేంద్రం సెస్లు, సర్చార్జ్ల రూపంలో వసూళ్లు చేయడమేమిటని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పన్నుల రూపంలో వసూలు చేస్తే వసూలయ్యే మొత్తంలో కేంద్ర డివిజబుల్ పూల్ కింద రాష్ర్టాలకు వాటా పంచాల్సి ఉంటుంది. అదే సర్చార్జ్లు, సుంకాల పేరిట వసూలు చేస్తే పంచాల్సిన పనిలేదు. సెస్లు, సర్చార్జ్లను ట్యాక్స్ల రూపంలో వసూలు చేసి ఆ సొమ్మును రాష్ర్టాలతో పంచుకోనప్పుడు సమాఖ్యకు అర్థమేమిటనే ప్రశ్న తలెత్తుతున్నది. గత ప్రభుత్వం వసూలుచేసిన పన్నుల్లో రాష్ర్టాల వాటా 32 శాతం ఉండేది.
మేం వచ్చాక దాన్ని 42 శాతానికి పెంచామని (ఇచ్చేది 41 శాతమే) గొప్పలు చెప్పుకొనే కేంద్ర పాలకులు రాష్ర్టాలకు వాటా పంచాల్సిన అవసరం లేకుండా దొడ్డిదారిలో సెస్లు, సర్చార్జ్ల రూపంలో దండుకుంటున్న ఆదాయం గురించి మాత్రం చెప్పడం లేదు. ఉదా: రకరకాల సుంకాల పేరిట లీటర్ పెట్రోలుపై రూ.27.90 పైసలు వసూలు చేస్తున్నది. అందులో అన్ని రాష్ర్టాలకు కలిపి ఇచ్చే మొత్తం 60 పైసల లోపే మిగతాది కేంద్రం ఖజానాలోకే. దీన్నిబట్టే కేంద్రం సుంకాల పేరుతో రాష్ర్టాల ఆదాయానికి కొడుతున్న గండి ఏ స్థాయిలో ఉన్నదో తెలుస్తుంది. గతంలో సెస్లు ఎక్సైజ్ డ్యూటీ మీద విధించేవారు. కానీ ఇప్పుడు ఆదాయ పన్ను మీద (విద్యా సుంకం), సేవా పన్ను మీద (స్వచ్ఛభారత్ సుంకం) విధిస్తుండటం గమనార్హం. వీటి ఆదాయాన్ని ఇతర ప్రయోజనాలకు వాడుతున్నట్లు ఆదాయ లోటును పూడ్చుకోవడానికి, ప్రభుత్వ ప్రచార, ప్రకటనలకు వాడుకుంటున్నట్లుగా కాగ్ నివేదిక తేల్చింది.
దేశంలో ఆదాయపన్ను చెల్లించే ప్రతి పౌరుడు ఆరోగ్యం, విద్యపై సర్చార్జితో సహా ఆరోగ్య, విద్యా సెస్ను చెల్లించాల్సిందే. స్వచ్ఛభారత్ సెస్ను 2014లో, కృషి కళ్యాణ్ సెస్ను 2016లో ప్రవేశపెట్టారు. 2017లో జూలై 1న స్వచ్ఛభారత్ను రద్దు చేసినప్పటికీ ప్రభుత్వం ప్రజల దగ్గర పన్ను వసూలు చేస్తూనే ఉన్నది. 2018-19లో కేంద్రం 3 శాతం విద్యాసెస్ బదులు 4 శాతం ఆరోగ్య, విద్యాసెస్ విధించింది. ఇలా కేంద్రం ప్రజల నుంచి సెస్ ల, సర్చార్జీలు వసూలు చేస్తుంది. రెండేండ్లు దాటిన ప్రతి సెస్లోనూ రాష్ట్రాలకు వాటా పంచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కేంద్రం గోరంత ఇస్తూ కొండంత నేరుగా రాష్ర్టాల నుంచి లాక్కొనే విధానాలు ముమ్మాటికి అప్రజాస్వామికమే. కరోనా సృష్టించిన సంక్షోభంలో ప్రజలు ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఇలాంటి వేళ ప్రజలకు ఉపయోగపడే విధాన నిర్ణయాలు జరగాలి. స్వార్థం వీడి ప్రజాకాంక్షలకు పట్టం కట్టే విధానాలతో సమన్వయంతో కృషిచేస్తేనే బలమైన, ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య భా రతం ఆవిష్కృతమవుతుంది. ప్రజల జీవన మనుగడకు భంగం కలిగితే వారు తిరగబడతారు. ఆ బలం ముందు ఏ శక్తులూ నిలబడవు. ఇది చరిత్ర చెప్తున్న సత్యం.
-మేకిరి దామోదర్, 95736 66650