‘ప్రపంచాన్ని మార్చటానికి విద్యకు మించిన ఆయుధం మరొకటి లేదు’ అని అన్నారు నెల్సన్ మండేలా. ఏ దేశానికైనా, రాజకీయ, ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక, సాంకేతిక నాయకత్వాన్ని అందించేవి విశ్వవిద్యాలయాలే. ఏయే విశ్వవిద్యాలయాలు ఎంత గొప్పగా, నాణ్యమైన విద్యార్థులను సమాజానికి అందించగలు గుతాయో ఆయా దేశాలు అన్నిరంగాల్లో సుస్థిరాభివృద్ధి సాధిస్తాయి. అందుకే విద్యాలయాలను దేవాలయాలుగా కొలుస్తాం. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు ఏ మాత్రం తీసిపోనివిధంగా ఉస్మానియా యూనివర్శిటీ సైతం ప్రపంచ యవనికపై తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడం తెలంగాణ రాష్ర్టానికే గర్వకారణం.
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి నాయకత్వం వహించే అవకాశాన్ని కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞుడను. ఓయూ అభివృద్ధి కార్యక్రమాల్లో పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో అమెరికాలో స్థిరపడిన పూర్వవిద్యార్థుల ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లాను. నెలరోజుల పాటు ఆయా రాష్ర్టాలు, విశ్వవిద్యాలయాల్లో పర్యటించి ఉస్మానియాకు అవసరమైన ఆధునిక సాంకేతకతను ఇచ్చిపుచ్చుకునే అవకాశాలను అధ్యయనం చేశాను. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల తీరుతెన్నులు, పరిశోధనలపై వారు చేస్తున్న కృషి, పాఠ్య ప్రణాళిక రూపకల్పన, కోర్సుల కూర్పు, అడ్మిషన్ ప్రక్రియ తదితర అంశాలపై కూలంకషంగా అధ్యయనం చేసిన అంశాలను మన ఓయూ విద్యార్థులకు అందుబాటులోకి తేనున్నాం. ఆయా విభాగాల్లో నిష్ణాతులతో రెండు నెలల పాటు చర్చించి.. అత్యుత్తమ విధానాలను క్రోడీకరించాం. 21 అంశాలతో ప్రత్యేక అజెండాను ఏర్పాటుచేసుకొని పని ప్రారంభించాం.
ఆ అజెండాలో 4 అంశాలను పొందుపరిచాం.
1. టీచింగ్, లెర్నింగ్.
2. పరిశోధన, నూతన ఆవిష్కరణల
సంస్కృతిని పెంపొందించటం
3. మౌలికవసతుల అభివృద్ధి,
4. ఔట్రీచ్ కార్యకలాపాలు.
ఆధునిక సాంకేతికత ద్వారా పాఠ్యాంశాల బోధన, కొత్త కోర్సులను (బీఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్, మైనింగ్, బీఏ హానర్స్ మొదలైనవి) అందుబాటులోకి తీసుకువచ్చాం. ఏ డిగ్రీ చేసినా పీజీలో ఆర్ట్స్, సోషల్సైన్సెస్లో అడ్మిషన్ పొందే విధానాన్ని అమల్లోకి తెచ్చాం. జాతీయ సమగ్రతను పెంపొందించేలా 5 శాతంగా ఉన్న కోటాను 20 శాతం పెంచి వివిధ రాష్ర్టాల విద్యార్థులతో క్లాస్ కంపోజిషన్ మార్చాం. ‘ఫెస్టివల్ ఆఫ్ ఐడియాస్’ పేరుతో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నాం. హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్, సివిల్ సర్వీసెస్ అకాడమీ, పోటీ పరీక్షల శిక్షణా కేంద్రం, స్టూడెంట్ డిస్కోర్స్ సెంటర్.. మొదలైన కేంద్రాలను ఏర్పాటుచేశాం. ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతో ఎంవోయూలు చేసుకున్నాం. మౌలికవసతులు, పరిపాలన సజావుగా సాగేందుకు యూఎంఎస్, ఈ ఆఫీస్, క్లోస్డ్ క్యాంపస్, హాస్టళ్ల మరమ్మతులు, కొత్త హాస్టల్ భవనాల నిర్మాణానికి కసరత్తుతో పాటు ఉస్మానియా ఔన్నత్యాన్ని చాటేందుకు ‘ఉస్మానియా తక్ష్- 2022’, ‘ఉస్మానియా ఫౌండేషన్ డే’ను ఘనంగా నిర్వహించాం.
సమయాభావం వల్ల నెల రోజుల్లో పది ప్రధాన నగరాల్లో (న్యూయార్క్, న్యూజెర్సీ, బోస్టన్, వాషింగ్టన్ డీసీ, అట్లాంటా, డల్లాస్, హ్యూస్టన్, చికాగో, డెన్వర్, శాన్ ఫ్రాన్సిస్కోలోని బే ఏరియా) పూర్వ విద్యార్థులను కలిశాను. తల్లి తర్వాత తల్లి లాంటి ఓయూకు తమ వంతు సహాయాన్ని అందించటానికి ప్రతి ఒక్కరూ ముందుకురావటం చాలా సంతోషకరమైన పరిణామం.
ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు భారతదేశంలోని ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీల అభివృద్ధికి ఆయా సంస్థల పూర్వవిద్యార్థులు వెన్నెముక లాగ పనిచేస్తున్నారు. నేను లీవ్లో భాగంగా ఆస్ట్రేలియా మోనాష్ యూనివర్సిటీ వెళ్లినప్పుడు కూడా అర్థమైంది ఏమంటే.. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ విషయంలో వెనకబడి ఉన్నదని, వెంటనే ప్రత్యేక అలమ్నీ సెల్ను ఏర్పాటుచేసి.. డాటా బేస్ను క్రియేట్ చేయటంతో పాటు నెట్వర్క్ను చేయటం మొదలుపెట్టాం. వందేండ్లలో తెలివిగల విద్యార్థులను రూపుదిద్దిన ఓయూ వద్ద వారి వివరాలు లేకపోవటం కొంత శోచనీయమే. ఇప్పటికైనా ఓ ప్రయత్నం చేయాలని పని ప్రారంభించాం.
ఓయూ నార్త్ అమెరికా తెలుగు అలమ్నీ అసోసియేషన్ ఏర్పాటుచేసిన సమావేశాలతో పాటు ఉస్మానియాలో చదివి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న పూర్వ విద్యార్థులు, అక్కడి ప్రొఫెసర్స్, శాస్త్రవేత్తలు, సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో కలిసి… వివిధ నగరాల్లో జరిగిన సంప్రదింపుల్లో భాగంగా బెస్ట్ ప్రాక్టిసెస్, వారి సలహాలు, సూచనలు ఎంతో విలువైనవని నాకనిపించింది. అందులో ముఖ్యంగా మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), హార్వర్డ్ యూనివర్శిటీ, యూ మాస్ బోస్టన్, డాట్ మౌత్ బిజినెస్ స్కూల్ (టెక్స్కూల్-ఐవీ లీగ్ కాలేజీ), ఎమోరీ యూనివర్సిటీ, జార్జియా టెక్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్, యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్, డిస్కవరీ పార్ట్నర్ ఇన్స్టిట్యూట్, అడోబ్ సెంటర్లను సందర్శించాను. వారితో కూడా సుదీర్ఘంగా చర్చించాను.
మన విద్యార్థుల్లో విల్ ఉంది కానీ స్కిల్ లేదు. వారిలో నైపణ్యాన్ని పెంపొందించటం చాలా ముఖ్యం. ఉస్మానియా ఇంటర్నేషనల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటుచేయాలి. అందులో విదేశీ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, భారత్లో ఉన్న ప్రముఖ ప్రొఫెసర్లు, పారిశ్రామికవేత్తలు.. ప్రతి మూడునెలలకోసారి ఇంటరాక్షన్ మీటింగ్ ద్వారా అకడమిక్, రీసెర్చ్, ఇన్స్టిట్యూట్ బిల్డింగ్లో అనుభవాలు పంచుకోవాడనికి ఓయూ కూడా ప్రపంచ విశ్వవిద్యాలయాల సరసన నిలబెట్టే ప్రయత్నం అందరం కలిసి చేయవచ్చనే నమ్మకం నాకున్నది. ఇందుకోసం చేయిచేయి కలుపుదాం. పూర్వ విద్యార్థులుగా, సమాజంలో బాధ్యత కలిగిన పౌరుడిగా తల్లి లాంటి ఉస్మానియా విశ్వవిద్యాలయ రుణాన్ని తీర్చుకుందాం. సానుకూల దృక్పథంతో ఆలోచిద్దాం. వందేండ్ల ఉస్మానియా ఔన్నత్యాన్ని నిలబెడదాం.
(వ్యాసకర్త: ప్రొ. దండెబోయిన రవీందర్ యాదవ్, ఉపకులపతి, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్)