తెలంగాణ మధ్యయుగంలో కందూరు చోడుల కాలంలో కృష్ణా- మూసీ పరీవాహక ప్రాంతం ప్రముఖ వ్యవసాయం, వర్తక కేంద్రాలతో వర్ధిల్లింది. దేశ విదేశాల నుంచి ఇక్కడికి వర్తకులు వచ్చేవారు. అద్భుత ఆలయాల నిర్మాణం జరిగింది.
తెలంగాణ నేలపై చెరువులను తవ్వించి, సుజల స్రవంతులను పారించిన వారెవరు?, అద్భుతమైన ఆలయాలను నిర్మించిన వాళ్లెవ్వరు? ఇటువంటి పనులు చేపట్టింది కాకతీయులనే అభిప్రాయం బలంగా ఉన్నది. కానీ కాకతీయులు ఇంకా ఎదగకముందే, కృష్ణా పరీవాహక ప్రాంతంలో నీటి వనరుల్ని వృద్ధి చేసి, అందమైన గుళ్ళని కట్టి చిరస్థాయిగా నిలిచినవాళ్లు కందూరి చోడులు. క్రీస్తుశకం 1040 నుంచి 1290 వరకు అంటే దాదాపు 250 ఏండ్లు చిన్న రాజ్యాన్ని పాలించినా తమ ప్రత్యేకతను నిలుపుకొన్నారు. తెలంగాణ నేలపై కాకతీయులు స్వతంత్ర రాజులుగా రాకమునుపు-కాకతీయులతో పాటు కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఎందరో చిన్నచిన్న ప్రాంతాలను పాలించారు. కందూరు చోడులు, ముదిగొండ చాళుక్యులు, పొలవాస పాలకులు, విరియాల వంశస్థులు- ఇలా ఎన్నో సామంత వంశాలు పాలించాయి. కొలనుపాకను ఏలిన పారమార జగద్దేవుడి వంటి కొందరు మహామండలేశ్వరులు చరిత్రపై వారి ముద్రను వేశారు.
కందూరు చోడులు మొదట కళ్యాణిచాళుక్యుల సామంతులుగా ఏరువ నాడును పాలించేవాళ్లు. కృష్ణానదికి రెండువైపులా నేటి తెలంగాణలోని మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం (కొంత ప్రాంతం), ఆంధ్రప్రదేశ్లోని ఆత్మకూరు, మార్కాపురం, దోర్నాల ప్రాంతాలను ఏరువనాడు అనేవారు. క్రీ.శ.1065 నుంచి పాలించిన రెండవ భీమచోడుడు కళ్యాణి చాళుక్య చక్రవర్తి త్రిభువనమల్ల ఆరవ విక్రమాదిత్యుడికి యుద్ధాల్లో సహాయం చేసి కందూరు నాడును బహుమతిగా పొందాడు. దీంతో కొల్లిపాక (కొలనుపాక) 7000, కందూరు 1100 గ్రామాలు పొంది కందూరు చోడులుగా మారారు. కోడూరు, కందూరు, పానగల్లు, వర్ధమానపురము, కొలనుపాక వీరి రాజధానులుగా ఉండేవి. దాదాపు వంద వరకున్న వీరి శాసనాలు, (కొన్ని కళ్యాణి చాళుక్య, కాకతీయ శాసనాలతో సహా), వీరు తవ్వించిన చెరువులు, కట్టించిన గుళ్ళు వీరి చరిత్రకు ఆధారాలుగా మిగిలాయి.
ఆలయాలు: వీరికి ఒకవైపు కళ్యాణి చాళుక్యులు, రెండోవైపు కాకతీయులు, రెండూ పెద్ద సామ్రాజ్యాలే. అందుకేనేమో చరిత్రలో కందూరు చోడులకు రావాల్సినంత పేరు రాలేదు. పానగల్లు, పేరూరు, వర్ధమానపురము, కోడూరు, కందూరు, రాచూరు, వంగూరు, గంగాపురం , సిరికొండ, నేలకొండపల్లి, అనుముల, భువనగిరి, కొలనుపాక, పరడ వంటి దక్షిణ తెలంగాణ గ్రామాల్లో కందూరు చోడుల ఆలయాలు కనిపిస్తాయి. ఆలయాలతో పాటు దుర్గాలు, విద్యా కేంద్రాలు కూడా కందూరు చోడుల కాలపు సమాజాన్ని చూపిస్తాయి.
కందూరు చోడుల శాసనాలేం చెప్తున్నాయి?: మల్లికార్జున చోడుని వల్లాల శాసనం కందూరి చోడులు కావేరి ప్రాంతాన్ని (తమిళనాడు) పాలించిన గొప్ప రాజైన కరికాల చోళుడి వంశస్థులని చెపుతుంది. పానుగల్లులో తొండయ చోడరాజు వేయించిన క్రీ.శ.1091 నాటి శాసనం ఒక అరుదైన శాసనం. తన తండ్రి రెండవ భీమ చోడుడి అస్థికలను గంగలో కలిపి గయలో పిండ ప్రదానం చేసి వచ్చిన యజ్ఞ ప్రోలమయ్య అనే బ్రాహ్మడికి చేసిన దాన వివరాలున్నాయి. నాగర్కర్నూల్ ఆర్డీవో ఆఫీసులో ఉన్న వీరి తెలుగు శాసనం ఇరుగణ చోడమహారాజు (క్రీ.శ.1060) కోడూరు (మహబూబ్ నగర్ జిల్లా) నుంచి పాలించాడని చెప్తుంది. ఇదే జిల్లాలో రెండో ఉదయనుడి (క్రీ.శ.1157) మర్రికల్లు శాసనంలో నాగర్కర్నూల్ పాత పేరు నాగర కిర్వుగా ఉన్నది. నల్గొండ జిల్లాలోని పేరూరు శాసనంలో స్వయంభూ సోమేశ్వర ఆలయానికి మహామండలేశ్వర భీమచోడ మహారాజు భంటు అయిన పేరూరు మన్మ మల్లనాయక ఇచ్చిన దానం గురించి ఉంది. ఇందులో ఉన్న తెలుగు నకరేశ్వరదేవ, అరవ నకరేశ్వరదేవ పదాలు తెలుగు, తమిళ వర్తక సమూహాల గురించిన సమాచారం ఇస్తాయి.
పానుగల్లు ప్రాభవం: నల్గొండ పట్టణంలో భాగమైపోయిన పానగల్లు కందూరు చోడుల నాటి పాలనా కేంద్రమూ, వర్తక కేంద్రం కూడా. తొండ మహారాజు భార్య మైలాంబిక వేయించిన క్రీ.శ.1124 నాటి శాసనంలో నాటి తూనికలు, కొలతల వివరాలున్నాయి. పానుగల్లు మార్కెట్లో అమ్ముతున్న ఉప్పు, జొన్నలు, వడ్లు, ఆకులు, పోకలు, ప్రత్తి, మిరియాలు, అల్లం, బెల్లం, చీరెలు వంటి వస్తువుల వివరాలు, వాటిపై వేసే పన్నులు పానగల్లు శాసనంలో తెలుస్తాయి. వీరికాలంలో పానుగల్లు, పేరూరు, వాడపల్లి, కందూరు మొదలైనవి పెద్ద వర్తక కేంద్రాలుగా ఉండేవి.
గొప్ప పేరున్న ఊరు పేరూరు: నల్గొండ జిల్లా హాలియా పక్కనే ఉన్న ఒక చిన్న గ్రామం పేరూరు. దాదాపు ఐదు శతాబ్దాల పాటు, అంటే కళ్యాణి చాళుక్యులతో మొదలై కాకతీయుల దాకా ఒక పెద్ద వర్తక కేంద్రంగా పేరూరు ఉండేదంటే ఇప్పుడు నమ్మబుద్ధి కాదు. దేశీ, విదేశీ వ్యాపార కేంద్రంగా ఉన్నందున ఇక్కడికి 18 ముఖ్య నగరాల నుంచి వర్తకులు వచ్చేవారట. ఇక్కడ అరవ నకరం (తమిళ వర్తకసంఘం), తెలుగు నకరం (తెలుగు వర్తకసంఘం), బలిజగరు (వీర బలిజల వర్తక సంఘం) వంటి ఎన్నో వర్తక శ్రేణులు వ్యాపారం చేసేవి.
కందూరు చోడులు స్వతంత్ర రాజులు కాకపోయినా కృష్ణా పరీవాహక ప్రాంత భౌగోళిక ప్రాముఖ్యం, రాజకీయ సందర్భం వారికి ఎన్నో ప్రత్యేకతలను ఇచ్చింది. మొదటిది- కందూరు చోడులను ఓడించి సామంతులను చేసుకొన్న తర్వాతే కాకతీయుల విస్తరణ దక్షిణం వైపు అంటే, దక్షిణ తెలంగాణ మీదుగా ఆంధ్ర ప్రాంతానికి సాగింది. రెండవది, కృష్ణా-మూసీ పరీవాహక ప్రాంతం కాబట్టి వ్యవసాయం-వర్తకం అభివృద్ధి చెందింది. దాంతో పాటే నీటి పారుదల పద్ధతులూ, పట్టణాలు వృద్ధిచెందాయి. పచ్చల సోమేశ్వరం, ఛాయా సోమేశ్వరం వంటి అద్భు త ఆలయాల నిర్మాణం సాగింది.
-డా. ఎం.ఎ. శ్రీనివాసన్ , 81069 35000