2014 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని అనుకున్నారంతా! ఫలితాలు విడుదలయ్యాక, అంకెల సంకెళ్లు తెంచుకొని మరీ, ఎవరి మద్దతూ అవసరం లేనంత స్థాయిలో సీట్లు సాధించింది. గెలుపు సంబురంలో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో బీజేపీ పార్లమెంటరీ సభ్యులు సమావేశమయ్యారు. పార్టీ ముఖ్య నేతలూ వచ్చారు. బీజేపీ పెద్దకాపు ఎల్కే అద్వానీ ప్రసంగం పూర్తయింది.
ప్రధానమంత్రి మోదీ వంతు వచ్చింది. ప్రసంగ వశాత్తుగానో, ప్రయత్నపూర్వకంగానో ‘అడ్వాణీజీఁనే ఏక్ శబ్ద్ ప్రయోగ్ కియా! మేఁ అడ్వాణీజీ సే ప్రార్థనా కర్తాహూ.. ఓ శబ్ద్ ఉపయోగ్ న కరే!’ అని గద్గద స్వరంతో అన్నారు మోదీ. (అద్వానీ గారు ఒక మాట వాడారు. నేను వారిని ప్రార్థిస్తున్నాను. దయచేసి ఆ మాట మరెప్పుడూ అనకండి). ఇది వినడంతోనే తానేమైనా అనరాని మాటగానీ అన్నానా అని మనసులో కంగారుపడే ఉంటారు అద్వానీ! మరోవైపు కన్నీటి పర్యంతమవుతూనే ఉన్న మోదీ ‘ఉన్హోఁనే కహా.. ‘నరేంద్ర భాయ్నే కృపా కీ!’ (నరేంద్ర భాయ్ దయ చూపారు) అనడంతో, సెంట్రల్ హాల్లో సభ్యులంతా బల్లలు చరిచారు. అద్వానీ ఊపిరి పీల్చుకున్నట్లే కనిపించారు. మోదీ మాటలు పునఃపరిశీలించుకుంటే మాత్రం ఇక తానేం మాట్లాడాలన్నా ఆచితూచి వ్యవహరించాల్సిందేనని, తనకిక షరతులు వర్తిస్తాయని అర్థం చేసుకున్నట్టున్నారు ఆ పెద్దాయన.
మోదీత్వం ఎంత కఠినంగా ఉంటుందో ముందుగానే అంచనా వేశారో ఏమో గానీ, 2014 ఎన్నికల వేళ తాను గాంధీనగర్ బరిలో దిగనని అద్వానీ భీష్మించారు. ఎన్నికల్లో మోదీ సహాయ నిరాకరణ చేస్తారేమోనని అనుమానించారు. భోపాల్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరిచారు. నియోజకవర్గ మార్పిడిపై ఆయన కన్నీటి పర్యంతమైనా మోదీ అండ్ కో పట్టించుకోలేదు. దాదాపు అదే సమయంలో ఓ చర్చా వేదికలో ‘నన్ను ప్రధానిని చేసే వ్యక్తిని, నేను ఏం చేయగలను?’ అంటూ అద్వానీని రాష్ట్రపతి చేస్తామన్న అర్థంలో నర్మగర్భంగా వ్యాఖ్యానించారు మోదీ. అసలు విషయం మోదీ ప్రధాని అయ్యాక గానీ అద్వానీకి అర్థం కాలేదు. అందుకే, 2017 రాష్ట్రపతి ఎన్నికల వేళకు చాలారోజుల ముందే.. ‘రాష్ట్రపతి రేసులో నేను లేను’ అని అద్వానీ స్వయంగా ప్రకటించారు. విచిత్రమేమంటే, రాష్ట్రపతి రేసులో కనీసం అద్వానీ పేరు కూడా పరిశీలించకుండా ఆయన మాటను నిలబెట్టి గురువు పట్ల తన కృతజ్ఞతాభావాన్ని చాటుకున్నారు ప్రధాని.
మరికొన్నాళ్లకే ఓ సభలో అద్వానీపై మోదీ చాటిన భక్తిప్రపత్తులు చూసి యావద్భారతమూ కంగుతిన్నది. తన రథయాత్ర సమయంలో మైకులు మోసిన వ్యక్తే అయినా, ప్రస్తుతం ప్రధాని కాబట్టి సభా వేదికపైకి మోదీ రాగానే అద్వానీ లేచి నిలబడి నమస్కరించారు. ఆ పెద్దాయనను కనీసం పట్టించుకోకుండా మోదీ ముందుకు వెళ్లిపోయారు. ఆ వరుసలో ఉన్న అందరినీ ఒక్కొక్కరిగా పలుకరించారు. వెనుక వరుసలో ఉన్నవారినీ కుశల ప్రశ్నలు అడిగారు. మళ్లీ వెనక్కి వస్తుండటంతో అంతా అద్వానీని పలకరించడానికనే అనుకున్నారు. ఆ పెద్దాయన కూడా అలాగే భావించారేమో! వినమ్రుడై చేతులు జోడించి, కుర్చీలోంచి లేచారు కూడా. మోదీ మళ్లీ ప్రతిస్పందించకుండానే వెళ్లిపోయారు. మోదీ వ్యవహరించిన తీరుకు అద్వానీ పక్కనే ఉన్న రాజ్నాథ్సింగ్ అవాక్కయినట్టు సదరు వీడియోలో స్పష్టంగా కనిపించింది. నాడు భావోద్వేగాలను అదుపుచేసుకోలేక రోదించిన మనిషేనా.. ఇంతటి ద్వేషం కనబరిచిందని అందరూ అనుకున్నారు. మళ్లీ ఏం ఆశించో, ఇంకేం శాసించాలనో గానీ ఆ కురువృద్ధుడి 94వ పుట్టినరోజు సందర్భంగా స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి కేక్ పంచుకున్నారు మోదీ!
మొన్నా మధ్యా మోదీ మరోసారి కన్నీటి పర్యంతమయ్యారు. బాధాతప్త హృదయంతో కాసేపు విలవిల్లాడిపోయారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు రోడ్డునపడ్డారని కాదు. స్విస్ బ్యాంకుల్లోంచి నల్లధనం వెనక్కి తెప్పించడంలో విఫలమైనందుకూ కాదు. భారతీయుల ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున జమ చేస్తానని బహిరంగంగా చేసిన ఎన్నికల వాగ్దానం మరిచాననే ఆవేదనతో కాదు. పెట్రోల్ ధరల పెరుగుదలను నియంత్రించలేకపోయాననే బాధతోనూ కాదు. కరోనా సమయంలో దవాఖానల్లో ఆక్సిజన్ లేక వేలాది మంది కన్నుమూసినందుకు అస్సలు కాదు. నల్ల చట్టాలతో రైతులను రోడ్డుకు ఈడ్చినందుకూ ఎంతమాత్రం కాదు. పోనీ, ఆ చట్టాలు వెనక్కి తీసుకొని జాతికి క్షమాపణ చెప్పే సమయంలోనూ కించిత్ బాధపడినట్టు కనిపించలేదు. కానీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ పదవీకాలం పూర్తయిన సందర్భంగా కృతజ్ఞతలు చెప్తూ మోదీ ఊహించని విధంగా ఉద్విగ్నతకు గురయ్యారు. ‘జైసే అప్నీ పరివార్ కీ సదస్య్కీ చింతా, వైసీ చింతా..’ అని మాటలను తెలివిగా తడబాటుకు గురిచేసి చింతాక్రాంతుడయ్యారు ప్రధాని. ఆయన అంతలా ఎందుకు కుదేలయ్యారో కాంగ్రెస్లో నిరసన సెగ రాజేసిన జీ-23 నేతకు అంతుబట్టకపోవచ్చు.
పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మోదీ కన్నీటి పర్యంతమైన సమయంలో పెద్దాయన రాష్ట్రపతి కావడం పక్కా అని అనుకున్నారంతా! ప్రతి చిన్నపనితో పెద్ద ఫలితాన్ని ఆశించే మోదీ, అద్వానీకి అత్యున్నత పదవి కట్టబెట్టినంత మాత్రాన తనకు ఒరిగేదేముందని లెక్కలు వేసుకోవచ్చు. ఈ వైఖరి రాజకీయంగా ఆమోద యోగ్యమే కావొచ్చు. కానీ, ప్రధానమంత్రి లాంటి గొప్ప పదవిలో ఉన్న వ్యక్తి, ఒకప్పుడు తన ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడిన వ్యక్తి విషయంలో లాభనష్టాలు బేరీజు వేసుకోవడమే మింగుడు పడని అంశం.
అయితే, భవిష్యత్తులో ఆజాద్ అవసరాన్నిఅంచనా వేసే మోదీ ముందస్తుగా అశ్రునయనాలతో విస్తృత ప్రయోజనానికి నాంది పలికారన్నది రాజకీయ పండితుల విశ్లేషణ. కశ్మీర్ ఎన్నికల వేళకు.. సొంత స్వతంత్ర పార్టీని పెడతారన్న వార్తలు హిమగిరుల్లో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తుండటమే ఇందుకు బలం చేకూరుస్తున్నది. ఈ పార్టీతో కలిసి బీజేపీ అధికారంలోకి రావచ్చేమో!
మోదీ మాటలకూ, చేతలకూ జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుందని బీజేపీ మొదటితరం అతిరథులకు 2014 లోనే తెలిసొచ్చింది. తాజాగా రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికతో రెండోతరం మహారథులకు తేటతెల్లమైంది. రాష్ట్రపతి అభ్యర్థి కోసం 20 మంది పేర్లు పరిశీలించామని చెప్పుకొచ్చారు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. అందులో, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరు ఉండకపోవచ్చన్నది మోదీత్వాన్ని అర్థం చేసుకున్నవాళ్లు అంచనా వేయగలరు. అయితే, రాబోయే రోజుల్లో ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడును కొనసాగించవచ్చు. లేదా, ఇక్కడితో పాత్ర ముగిసిందని సాగనంపవచ్చు. ఒకవేళ, వెంకయ్యకు వీడ్కోలు సమావేశం ఏర్పాటుచేస్తే, దానికి మోదీ హాజరైతే.. జాతికి మరో భావోద్వేగ సన్నివేశం చూసే భాగ్యం దక్కే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే, మోదీ కన్నీళ్ల పర్యవసానం ఎదుర్కొనే జాబితాలో ఎవరైనా ఉండొచ్చు!!
– కణ్వస