కేంద్ర ప్రభుత్వాలు 1993 నుంచి 2022 వరకు ఓబీసీ/ బీసీ రిజర్వేషన్ల అమలులో క్రీమీలేయర్ (సంపన్న శ్రేణి) ఆదాయ పరిమితిని 9 సార్లు పెంచాలి. కానీ నాలుగు సార్లు మాత్రమే సమీక్షించి పెంచడం వల్ల లక్షలాది మంది ఓబీసీ నిరుద్యోగులు, విద్యార్థులు రిజర్వేషన్లను కోల్పోతున్నారు.
1990లో వీపీ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలుపరిచారు. దీనిపై సుప్రీంకోర్టు 9 మంది జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం మెజారిటీ 6:3 తీర్పులో ఓబీసీ రిజర్వేషన్లను ఆమోదిస్తూ, క్రీమీలేయర్ వర్గాలను గుర్తిం చి, వారిని రిజర్వేషన్ల పరిధి నుంచి తొలగించాలన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్లను ఏర్పాటుచేయాలని ఆదేశించింది. 1992లో కేంద్రం ఓబీసీలలో సంపన్న శ్రేణిని గుర్తించడానికి జస్టిస్ రామ్నందన్ ప్రసాద్ అధ్యక్షతన నిపుణుల కమిటీని నియమించింది. సదరు కమిటీ నివేదికను సమర్పిస్తూ, ఓబీసీల్లో 6 విభాగాలుగా సంపన్న శ్రేణిగా గుర్తించింది. అందులో చివరిదైన ఆదాయ పరిమితిలో, తల్లిదండ్రుల వార్షిక ఆదాయ పరిమితిని రూ.లక్షగా నిర్ధారిస్తూ, ఇందు లో ఉద్యోగుల జీతభత్యాలు, వ్యవసాయ ఆదాయాలను మినహాయించింది. అదేవిధంగా మూడేండ్లకోసారి పునఃసమీక్షించి ఆదాయ పరిమితిని పెంచాలని సూచించింది. అవసరమైతే రూపాయి విలువ హెచ్చుతగ్గులను దృష్టిలో పెట్టుకొని కాలపరిమితికి ముందే సమీక్షించాలని పేర్కొన్నది. సదరు నివేదికను కేంద్రం 1993లో ఆమోదించిం ది.
ఈ నేపథ్యంలో ఇప్పటివరకు నాలుగుసార్లు మాత్ర మే ఆదాయ పరిమితిని పెంచారు. కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ 2017లో సంపన్న శ్రేణి వార్షిక ఆదాయ పరిమితిని రూ.6 నుంచి 8 లక్షలకు పెంచింది.కేరళ ప్రభుత్వం బీసీల్లోని సంపన్నశ్రేణిని గుర్తించడానికి కేంద్రం నిర్ధారించిన నిబంధనలను మార్చింది. దీని పై 1999లో సుప్రీంకోర్టు త్రిసభ్య రాజ్యాంగ ధర్మాసనం ఇంద్రా సహానీ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో కేరళ ప్రభుత్వాన్ని తప్పుపడుతూ సంపన్న శ్రేణి నిర్ధారణకు కేంద్రం నిబంధనలను అమలుచేయాలని ఆదేశించింది. అప్పటినుంచి దేశంలోని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రభుత్వాలు కేంద్రం నిబంధలను అమలుచేస్తున్నాయి. కేం ద్రంలో 1993 నుంచి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మూడేండ్లకోసారి సమీక్షించి ఆదాయ పరిమితిని 9 సార్లు పెంచినట్లయితే నేడు వార్షిక ఆదాయ పరిమితి రూ.30 లక్షలుగా ఉండేది. కానీ, అలా జరగలేదు. కేంద్రం నిర్లక్ష్యం ఫలితంగా లక్షలాది ఓబీసీ/ బీసీ విద్యార్థులు రిజర్వేషన్ల ఫలాలను కోల్పోతున్నారు.
మన రాజ్యాంగంలోనే బీసీలకు అన్యాయం జరిగింది. కులాలను కాస్త వర్గాలుగా/ తరగతులుగా గుర్తించారు. అందుకే, ఓబీసీ/ బీసీ క్రీమీలేయర్ సమస్యను అధిగమించాలంటే రాజ్యాంగ సవరణే మార్గం. రాజ్యాంగంలో విద్య, ఉద్యోగాల్లో ఓబీసీ/ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అధికరణలు 15 (4), 15 (5) 340, 338 బీ, 342 ఏ, 366లోని 26 (సీ)లో సూచించినట్లు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు (Socially and Educationally Backward Classes) అనే పదాలను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలుగా (Socially and Educationally Backward Castes) మార్చాలి. అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఓబీసీ/బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 243 డీ, 243 టీ అధికరణల్లో పేర్కొన్నట్లు వెనుకబడిన తరగతి పౌరులు (Backward Class Citizens) అనే పదాలను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలుగా (Socially and Educa tionally Backward Castes) మార్చాలి. లేనట్లయితే ఓబీసీ/ బీసీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ సమస్యను తొలగించడం, జనాభా దామాషా పద్ధతిలో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఓబీసీ/బీసీ కులగణన మొదలైన సమస్యలను అధిగమించడం అసాధ్యం.
-కోడెపాక కుమారస్వామి , 94909 59625