భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి విశేష, విస్తృత అధికారాలు కల్పించింది. రాజ్యాంగాన్ని అతిక్రమించిన ప్రభుత్వాలు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అలాంటి ఘటనలు ఈ మధ్య రెండు జరిగాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చినప్పుడు, రెండవది అనాలోచిత ‘అగ్నిపథ్’ నిర్ణయం తీసుకున్నప్పుడు. మన ప్రజాస్వామిక దేశంలో పార్లమెంటరీ వ్యవస్థ
అత్యున్నతమైనది. చట్టాలు రూపొందించే పవిత్ర స్థలమది. దేశ చట్టాలు బీజేపీ ఆఫీస్లోనో, ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలోనో, లోక్ కళ్యాణ్మార్గ్లోని పంచవటిలోనో రూపొందించకూడదని మోదీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి.
మిగతా ప్రజలకు భిన్నంగా కుటుంబాలకు దూరమై, ప్రాణాలకు తెగించి, కఠిన పరిస్థితుల్లో పనిచేసే సైనికులకు ఉద్యోగ, సామాజిక భద్రతను కల్పిస్తూ, నైపుణ్యాలు పెంపొందిస్తూ, ఆయుధాలు సమకూరుస్తూ ప్రోత్సహించాలి. కానీ కేంద్రం ఆ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తున్నది. పింఛన్, జీతాలు, గ్రాట్యుటీ ద్వారా అందించే డబ్బును ఆదా చేయడానికి నాలుగేండ్ల కాంట్రాక్టు ప్రాతిపదికన ‘అగ్నిపథ్’ను ప్రవేశపెట్టారనిపిస్తున్నది. అగ్నిపథ్ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఆశ్చర్యంగా ఉన్నాయి. అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన దేశ భధ్రత, జాతీయ ప్రయోజనాల విషయంలో కేంద్రం రాజీపడుతున్నదా? అనాలోచితంగా విఘాతం కలిగిస్తున్నదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
యువతను సాయుధ దళాల్లో చేర్చడానికి ఎన్నో ఏండ్లుగా, ఎంతో శ్రేయస్కరంగా ఉన్న ప్రక్రియను కాదని, కొత్త పద్ధతిని తెచ్చింది. ప్రస్తుత ప్రక్రియలో 17.5 ఏండ్లు నిండినవారు (మొన్నటి అల్లర్ల తర్వాత ఐదేండ్లు పెంచారు) అర్హులు. ఈ ప్రక్రియలో చేరినవారిని నాలుగేండ్లపాటు ఉద్యోగంలోకి తీసుకుంటారు. పింఛన్, వైద్య సదుపాయాలు, గ్రాట్యుటీ మొదలైన సౌకర్యాలు లేకుండా చేశారు. వృత్తి నైపుణ్యం, పోరాట పటిమతో ప్రపంచ సైన్యాలలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న భారత సాయుధ బలగాలను ఈ పథకం ప్రభావితం చేస్తున్నది. అనేక దేశాల్లో కొద్దికాలం యువత మిలిటరీలో పనిచేసే విధానం ఉన్నది. మనదేశంలో ఒక రాష్ట్రం అమలుచేసే మంచి పథకాన్ని మొత్తం దేశానికి పనికిరాదని తరచూ చెప్పే కేంద్రం, ఇతర దేశాల్లోని పథకం మన దేశానికి ఎలా పనికివస్తుందో చెప్పాలి?
అగ్నిపథ్ను రూపొందించడానికి రెండేండ్లకు పైగా కసరత్తు చేసినట్లు కేంద్రం అంటున్నా, ఇతర దేశాల పథకానికి ఇది కాపీలా కనిపిస్తున్నది. నిజానికి ‘అగ్నిపథ్’లో నాలుగేండ్ల పదవీ కాలాన్ని అమెరికా నుంచి, కాంట్రాక్ట్ ప్రాతిపదికను ఫ్రాన్స్ నుంచి, శిక్షణ పద్ధతిని రష్యా నుంచి తీసుకున్నారు. రష్యా ఏడాదిపాటు శిక్షణ ఇస్తుంది. అగ్నిపథ్లో 6 నెలలు ప్రతిపాదించారు. యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్), ఎన్ఐఓఎస్ (ది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్)లో లా ప్రిఫరెన్షియల్ అడ్మిషన్ ప్రతిపాదించింది. విద్యాసంస్థలలో ఇన్-సర్వీస్ ట్రైనర్ల కోసం 50 శాతం క్రెడిట్లను (యూజీ లేదా డిప్లొమా లేదా సర్టిఫికెట్లో) అనుమతించాలని ప్రతిపాదించారు. పారామిలటరీ బలగాల ఎంపికలో ‘ఈ లెఫ్ట్ అవుట్’ సిబ్బందికి ప్రాధాన్యం ఇవ్వడం ఒక్కటే ఇందులో ఇన్నోవేటివ్గా ఉన్నది. సైన్యం రిటైర్మెంట్ సగటు వయస్సును 32 ఏండ్ల నుంచి 26 ఏండ్లకు తగ్గించడాన్ని స్వాగతించాలి. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆధునిక నైపుణ్యాలను నేర్పించడాన్ని హర్షించాలి. కానీ, ప్రభుత్వం దేశ భద్రతకు కీలకమైన సైనికుల విషయంలో కేవలం పింఛన్, జీతం, గ్రాట్యుటీని మిగుల్చుకొని, ఇతర బాధ్యతల నుంచి తప్పుకొని, మన బలగాల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నట్లుగా కనిపిస్తున్నది.
దేశ రక్షణశాఖ బడ్జెట్ మొత్తం రూ.5.25 లక్షల కోట్లు. ఇందులో 25.6 శాతం జీతాలు,22.8 శాతం పింఛన్ల కోసం ఖర్చవుతున్నది. జీడీపీలో భాగంగా దేశ రక్షణ వ్యయం 2001లో2.9 శాతం నుంచి 2.7 శాతానికి తగ్గింది. దీని ఆధారంగా చూస్తే, ప్రభుత్వం మన బలగాలను తగ్గించి, మన సరిహద్దులను ఫణంగా పెడుతుందా? పాకిస్థాన్, చైనాతో నిరంతరమూ ఏదో ఒక ఘర్షణ నెలకొంటున్న తరుణంలో ఇలా ఎందుకు చేస్తున్నది? ‘పని చేస్తున్నదానిని చెడగొట్టకు’ అనే ప్రసిద్ధ ఆర్మీ వ్యాఖ్యను కేంద్రానికి గుర్తు చేయాలని అనుకుంటున్నా.
రాబోయే 90 రోజుల్లో అగ్నిపథ్ పథకాన్ని అమలుచేసేందుకు కేంద్రం హడావుడి చేస్తున్నది. దీన్నిచూసి ఆశావహులే కాదు, మాజీ సైనికులు, ప్రజాసంఘాలు, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. గతకొన్ని రోజులుగా ప్రజాగ్రహాన్ని, దాని ఫలితంగా జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం చూశాం. తమ జీవితంలో ఎప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం రాదనే ఆందోళన యువకుల మదిలో ఉండటం వల్లే హింస ప్రేరేపితమైంది. ఈ సున్నితత్వాన్ని పసిగట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. సికింద్రాబాద్లో రైల్వే పోలీసుల కాల్పుల్లో ఒక యువకుడు మరణించాడు. అగ్నిపథ్ను ప్రయోగాత్మకంగా ప్రారంభించి ఫలితాలను చూడకుండానే ప్రభుత్వం ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నదో అర్థం కావడం లేదు.
తెలంగాణ ప్రజలు దేశానికి చేసిన సేవలను గౌరవించేందుకు తెలంగాణ పదాతి దళ శాశ్వత పటాలాన్ని ఏర్పాటుచేయాలనే డిమాండ్ చాలాకాలంగా పెండింగ్లో ఉన్నది. హైదరాబాద్, సికింద్రాబాద్లకు భారతీయ సైన్యంతో సుదీర్ఘ చరిత్ర, అనుబంధం ఉన్నది. సికింద్రాబాద్ దేశంలోని అతిపెద్ద కంటోన్మెంట్లలో ఒకటి. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ కింద హైదరాబాద్ పదాతి దళ శాశ్వత పటాలం ఉండేది. ఇది మొదటి ప్రపంచయుద్ధం ముగింపులో ఏర్పడింది. 2వ ప్రపంచ యుద్ధంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. కానీ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేంద్రం దాన్ని రద్దుచేసింది. కాబట్టి, తెలంగాణ శాశ్వత పటాలాన్ని ఏర్పాటుచేయాలి. మొత్తంగా అగ్నిపథ్ పథకం ఒక ఆవివేకమైన చర్య. కాబట్టి కేంద్రం దానిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. అగ్నిపథ్పై పార్లమెంటులో చర్చిద్దాం, అందరికీ ఆమోదయోగ్యమైన ఒక సమున్నతస్థా యి విధానాన్ని మన సాయుధ సైనికులకు ఇద్దాం. మన దేశ సౌభాగ్యాన్ని సంరక్షించుకుందాం.
(వ్యాసకర్త: డాక్టర్ జి.రంజిత్రెడ్డి, చేవెళ్ల లోక్సభ సభ్యులు)