డైనోసార్లు అంతరిస్తాయి.. మంచుయుగం ఏనుగులు అంతరిస్తాయి.. కానీ, నేల అంతరిస్తుందా? వినటానికే విచిత్రంగా ఉన్నా.. ప్రస్తుతం జరుగుతున్నది అదే. భూమ్మీద ఉన్న నేలల్లో 52 శాతం ఇప్పటికే సాగుకు పనికి రాకుండా ఎడారిగా మారిపోయాయి. మరో 30 ఏండ్లలో ఈ ఎడారి దాదాపు భూమండలమంతా విస్తరించి, 10 శాతం భూములే వ్యవసాయానికి అనువుగా మిగిలే పరిస్థితి ఎదురుకానున్నది. ఇదొక నిశ్శబ్ద మహోత్పాతం. దీనివల్ల ఊహించనలవికాని విపరిణామాలు సంభవించనున్నాయి. ప్రపంచ జనాభా ఇప్పుడున్న 786 కోట్ల నుంచి 2050 నాటికి 980 కోట్లకు చేరుతుందని అంచనా. వీరి ఆకలి తీర్చటానికి మరింత అధికంగా వ్యవసాయం, ఆహారోత్పత్తులు అవసరమవుతాయి. కానీ, దీనికి పూర్తి విరుద్ధంగా జరుగనుంది. నేలలో సేంద్రియ పదార్థాల కొరత కారణంగా 2045 నాటికే వ్యవసాయరంగం క్షీణించి, ప్రస్తుత ఆహార ఉత్పత్తితో పోలిస్తే 40 శాతం తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.
ప్రపంచవ్యాప్తంగా విచక్షణ రహితంగా రసాయనిక ఎరువుల వాడకం, ప్రణాళిక లేకుండా సాగుతున్న వ్యవసాయం, ఉత్పత్తి లక్ష్యంగా మాత్రమే అమల్లోకి వస్తున్న ఆధునిక సాగు పద్ధతులు, అడవుల నరికివేత, పట్టణీకరణ తదితర అనేక కారణాలు మట్టి సారాన్ని పీల్చి పిప్పిచేస్తున్నాయి. పంటలు పండించటానికి వీలుగా ఉండాలంటే ఆ నేలలో కనీసం 3-6 శాతం కర్బన పదార్థం సజీవంగా ఉండాలి. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ అలా లేదు. భారత్లో 62 శాతం భూముల్లో ఇది 0.5 శాతమే ఉంది. దీని ప్రభావం పంట ఉత్పత్తులపైనే కాదు, వాటిలోని పోషకాల పైన కూడా తీవ్రంగా పడుతున్నది. మన తాతల కాలంలో ఒక్క నారింజ తింటే లభించే విటమిన్-ఏ ఈ రోజు 8 నారింజలు తింటేగానీ లభించని పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో ఇంకా ఎలా ఉంటుందో ఊహిస్తేనే భయమేస్తుంది.
ఈ మహావిపత్తును నివారించాలంటే.. మట్టిలోని సేంద్రియ గుణాన్ని, నేల కింది అనంత జీవవైవిధ్యాన్ని కాపాడుకోవటం తప్ప మరోమార్గం లేదు. ‘మట్టిని రక్షించుకుందాం’ అనే పిలుపుతో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ బైక్పై ప్రపంచయాత్ర చేపట్టి చైతన్యాన్ని పెంపొందించటానికి కృషిచేయటం హర్షణీయం. ఈ ప్రయత్నానికి సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడటం స్వాగతించదగినది. పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ ఇప్పటికే ముందున్నది. రాష్ట్ర సర్కారు మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంది. హరితహారంలో భాగంగా 250 కోట్లకు పైగా మొక్కలను నాటింది. అడవుల పెంపకాన్ని, విస్తరణను ఒక ఉద్యమంగా చేపట్టింది. చెరువుల పునరుద్ధరణ, ప్రాజెక్టుల నిర్మాణంతో భూగర్భ జలాలను గణనీయంగా పెంచింది. సేంద్రియ సాగుకు, ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. యావత్ దేశం కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి. మట్టిని రక్షించుకోవాలి. మానవాళి మనుగడను కాపాడుకోవాలి.