అనగనగా ఒక ఊరు. అది ఎడారికి మారు పేరు. చుట్టూ నెర్రెలిచ్చిన నేల. కాలం కలసివచ్చి మొన్ననే మొగులై చినుకురాలింది అక్కడ. నీరు పారింది. కర్రుకు పదును పెట్టి రైతన్న నాగలి కట్టిండు. గడ్డి దున్నిండు. దొడ్డి వేసిండు. చెట్టూ చేమ, కప్పా తుప్పా, పుట్టా పొద పుట్టినయి. పొలం పచ్చబడ్డది.
పశువును, పాకను చూసిన పొరుగు అడివిలోని పులికి దానిపై కన్నుపడ్డది. దొడ్డిలో జొరబడి, ఎడ్లపైకి దుంకింది. ఎడ్లు కలసికట్టుగా ఎదురు తిరిగినయి. నాలుగు దిక్కుల నుంచి నాలుగు తగులుకుని, బొక్కలిరిగేట్టు తొక్కినయ్. కొమ్ములతో కుమ్మినయి. గిట్టలతో తన్నినయి. పులి ఎత్తు పారలేదు. సత్తువ చాలలేదు. పారిపోయింది పులి. పొరక గోడ దుంకి వురికురికి తంగేళ్లలో కలిసిపోయింది. కసితో కుమిలిపోయింది. కోపంతో రగిలిపోయింది.
అర్ధరాత్రి గుట్టల గుహలోకి నక్క బావను, మాంసం విందుకు పిలిచి, అక్కసంతా వెళ్లగక్కింది. సాయం
అడిగింది. జిత్తుల మారి నక్క బావ సరేనంది. దొంగ ఏడుపు ఏడుస్తూ దొడ్డిలోకి చేరింది. పగలు పులి దగ్గర తిన్న మాంసం అరగకున్నా, ఆకలంటూ దొడ్డిలో గడ్డి తిన్నట్టు నటించింది. రోజుకో అబద్ధం చెప్తూ, దొడ్డి దూలానికి దొంగ దండాలు పెడుతూ, నేనూ ఈ దొడ్డి బిడ్డనే అంటూ ఎడ్లకు దగ్గరైంది. మన నక్కే కదా అని నమ్మడం మొదలు పెట్టినయి ఎడ్లు. ఒక ఎద్దు మీద మరొక ఎద్దుకు పితూరీలు చెప్పడం మొదలుపెట్టింది నక్క. సబూతులు, సాక్ష్యాలంటూ ఏవేవో బొమ్మలు చూపించేది. ఊలలు వినిపించేది. నాలుగు నెలలు
గడిచాయో లేదో.. ఎడ్ల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత పగ. నాలుగెడ్లు.. నలభై ఆలోచనలు. ఎదురుపడ్డయా.. కాలుదువ్వుడే. కొమ్ములిరుగుడే!
ఇదే అదనుగా పులిని పిలిచింది నక్క! ముందే తీసి ఉంచిన పనగడలోంచి
దొడ్డిలోకి దూరింది పులి! ఎడ్లు ఏకమై ఎదిరించకుండా, దేని మానాన అది,
తలోదిక్కుకు చేరి, దిక్కులు చూసినయి! తర్వాత ఏం జరిగిందో ఇంకా చెప్పాల్నా…!
2000 నుంచి ఇప్పటిదాకా తెలంగాణలో ఏం జరిగిందన్నది మన కళ్ల ముందున్నది. 13 ఏండ్ల ఉద్యమం ఎలా సాగిందో, 8 ఏండ్ల స్వయంపాలన ఎట్లా ఉన్నదో మనకు, మన మనసుకు తెలుసు. సైకిళ్లకు క్యాన్లు కట్టుకుని రోజూ మంచినీళ్ల కోసం ఆర్వో కాడికి పోతున్నమా? పొలానికి నీళ్లు పెట్టేందుకు అర్ధరాత్రి బాయికాడికి పోతున్నమా? అప్పుడు బోరెంత లోతేసినం? ఇప్పుడెంతేస్తున్నం? అప్పుడు కరెంటెట్లుండె? ఇప్పుడెట్లున్నది? కాళేశ్వరం నీళ్లు కాల్వ కొసదాక పారుతున్నయా లేదా? ముసలవ్వ ఖాతాల ముందెంత పింఛన్ పడ్డది? ఇప్పుడెంత పడుతున్నది? ఉద్యోగి జీతం అప్పుడెంతున్నది? ఇప్పుడెంతున్నది? అప్పుడు ఊర్లెట్లుండె? చెట్లెట్లుండె? చెర్లెట్లుండె? చెర్లల్ల నీళ్లెట్లుండె? చేప కప్పల సవ్వడెట్లుండె? ఇప్పుడెట్లున్నది? ఇట్వంటివన్నీ చూడనోళ్లం కాదు; తెల్వనోళ్లమూ కాదు మనం. కానీ జరిగిన వాటి గురించి కాదీ చర్చ. మనలోనే ఒకడు బయలెల్లి, జరిగిన వాటిని కూడా జరగలేదని, మన కళ్ల ముందున్న వాటిని లేవని చెప్తుంటే, మనమెట్ల వింటున్నం? ఎందుకు వింటున్నం? మనం సచివాలయం కట్టుకుంటే మూఢనమ్మకం. మరి కొత్త పార్లమెంటు ఎందుకు కడుతున్నరు? మనం ఇల్లు కట్టుకుంటే వాస్తుకు కట్టుకుంటమా లేదా? తన ప్రజలు, తన ప్రాంతం పది కాలాల పాటు బాగుండాలని, సకల సౌకర్యాలతో సచివాలయం కడితే అది మూఢనమ్మకమా? అబద్ధం అందంగ ఉంటదనీ, తొందరగా ఆకర్షిస్తదనీ మనందరికీ తెలుసు. అందరం ఎప్పుడో ఒకప్పుడు ఒకటో అరో అబద్ధాలు చెప్తనే ఉంటం. కానీ..
కాళేశ్వరంతో కొత్తగా ఎకరం కూడా పారలేదంటూ నిండిన చెరువుగట్టు మీద కూర్చుని చెప్తున్నారే… ఆ దుస్సాహసమెట్ల చేస్తున్నారు? దాన్ని మనమెట్ల సహించి చూస్తున్నాం? అబద్ధాలను వింటూ, వాట్సాప్లో పంచుతూ, పెంచుతూ మనం ఎంజాయ్ చేస్తున్నామే… ఈ నిర్లిప్తత తెలంగాణకు ప్రమాదకరమైనది.
ఏం జరుగుతున్నదిప్పుడు? ఉద్యమమప్పుడు ఏం జరిగిందో అదే! రాష్ట్రం కావాలని కొట్లాటకు దిగినప్పుడు కూడా ఇట్లనే పదేండ్ల పాటు అత్తరబిత్తర చేసి గత్తర లేపే ప్రయత్నం చేసిండ్రు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు! అయింది కానట్టు, కానిది అయినట్టు! ఉద్యమమే లేదన్నరు. అన్యాయమే జరగలేదన్నరు. అర్ధరాత్రి నిర్ణయమన్నరు. పేర్లెందుకుగాని… ఒక్కొక్క విదూషకుడు మహా నాయకుడై ఒక్కొక్క మాట మాట్లాడిండు. అంతా గడబిడ, గజిబిజి, గందరగోళం! మనమేం చేసినం? ఒక నాయకుణ్ని నమ్ముకున్నం. అతను చెప్పింది విన్నం. చెయ్యిమన్నది చేసినం. అతడి మార్గంలో నడిచినం. ఒక్కటిగ ఉన్నం. కుట్రలను తెగ్గొట్టినం. తెలంగాణ తెచ్చుకున్నం. అభివృద్ధి చేసుకున్నం. చేసుకుంటున్నం. మంచిగ బతుకుతున్నం, దేశాన్ని బతికిస్తున్నం. ఉద్యమంలో మనల్ని తిట్టినోళ్లంత ఇప్పుడు ఏడికిపోయిన్రో… యాడున్నరో పాపం!
అయితే ఉద్యమమప్పుడు బరి గిరిగీసి ఉండె. మనోడెవడో, పరోడెవడో తేటగ తెలిసేది. మరిప్పుడేం జరుగుతున్నది? మనలోనే కొందరిని మంచి చేసుకుని, మనమీదికే పంపుతున్నరు. అందులో ఒకడు మతం గురించి మాట్లాడుతడు. మరొకడు కులం గురించి మాట్లాడుతడు. తెలంగాణకు ‘అత్యంత అన్యాయం చేసిన వాళ్ల నాన్న వారసత్వం బహు గొప్పదని’ రోజూ ఏడుస్తది ఒకామె. ప్రభుత్వం పిల్లలకు చేసిన కృషిని తన ఘనతగా ప్రచారం చేసుకుంటడు ఇంకొకాయన. తానేం మాట్లాడుతున్నడో తనకే తెల్వని మరో కమేడియన్ కూడా లక్షల కోట్ల మహోపన్యాసాలు ఇస్తుంటడు. తన స్థానమేమిటో తెలంగాణ ప్రజలు ఒకటికి రెండుసార్లు చెప్పినా తెలుసుకోలేని మేధావి మరొకరు. సేమ్టు సేమ్ అదే గడబిడ, గజిబిజి, గందరగోళం. ఉద్యమమప్పుడు ఉన్నటువంటిదే! పేపర్లు, టీవీలు, ప్యాకేజీలు, కవరేజీలు సరేసరి!
ఎందుకు పెద్దపెద్ద లీడర్లంతా తెలంగాణకు బారులు తీరుతున్నరు? ఏదేదో మాట్లాడుతున్నరు. ఎన్నికల కోసమా? ఇంకా ఏడాదిన్నరదాంక లేవుకదా! అక్కడే ఉంది అసలు లోగుట్టు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన ర్యాంకుల సాక్షిగా ఇవాళ అభివృద్ధిలో, అవార్డుల్లో మనం ముందున్నం. ప్రగతి కండ్ల ముందు కనిపిస్తున్నది. అందువల్ల చర్చ వాటి మీద జరిగితే గెలవలేరు. మరేం చెయ్యాలె? రూటు మార్చాలె. మన మనసు మార్చాలె. చర్చను తప్పుదోవ పట్టించాలె. తెలంగాణ వాళ్లకు కొంచెం ఎమోషన్స్ ఎక్కువ. ఇప్పుడు దాంతో ఆడుకోవాలని, పబ్బం గడుపుకోవాలని చూస్తున్నరు. ‘దేశంలోని మసీదులన్నింటిలో శివ లింగాలు వెతుకుతమా ఏంది? అదేం పని! చరిత్రలో జరిగిందేదో జరిగిపోయింది. హిందువులకో రెండు మూడు ముఖ్యమైన ప్రార్థనా స్థలాలున్నాయి. వాటిని పరిష్కరించుకుంటే చాలు’ అంటాడు ఆరెస్సెస్ చీఫ్. ఇక్కడి బీజేపీ చీఫ్ మాత్రం… ‘మసీదులన్నీ తవ్వాలె.. శవాలు దొరికితే మీవి. శివాలు దొరికితే మావి’ అంటాడు. ఎవరు నిజం? మరొకాయనేమో తమ కులమే గొప్పదని తొడగొట్టి వాదిస్తడు. అయినా కులం, మతం లేనిదెవనికి? ఎవని మతం వానిది. ఎవని కులం వానిది. దాంతో తెలంగాణకు, రాజకీయాలకు, ప్రజలకు, పరిపాలనకు ఏం పని! అయినా వాటినే చర్చకు పెడుతున్నారంటే కారణం… వాటితో అయితేనే వాళ్లకు నాలుగు ఓట్లు వస్తాయని!
ఇప్పుడు జరుగుతున్నదంతా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం. కాంగ్రెస్ జాతీయ నేత తెలంగాణకు వస్తడు. బీజేపీని ఒక్క మాట అనడు. ప్రధానమంత్రి, హోంమంత్రి తెలంగాణకు వస్తరు. కాంగ్రెస్ను ఒక్క మాట అనరు. బీజేపీ కార్యకర్త ఒకరు ఆత్మహత్య చేసుకుంటడు. కాంగ్రెస్ నేతలు వెళ్లి పరామర్శిస్తరు. కాంగ్రెస్ నేత ఒకడు సందర్భం లేకుండా భాగ్యలక్ష్మి గుడిని లేవనెత్తుతడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దాన్ని పెద్ద చర్చ చేస్తడు.
నేనూ హిందువునే! ఎన్కట దేశంల ముస్లింల పాలన జరిగింది. గుళ్లు కూలగొట్టిన్రు. మసీదులు కట్టిన్రు. అదంతా నిజమే! మరిప్పుడేం చేస్తం? బాగుపడే బతుకు తెరువు వెతుక్కుంటమా? కొట్లాటలా? ఈ ప్రశ్న మనకు మనం వేసుకోవాలె. మనకు ఎదురైనోళ్లకూ వేయాలె!
ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది యాదృచ్ఛికమేమీ కాదు. నా అంచనా నిజమైతే ఇది మూడంచెల వ్యూహం. అనేకమంది ఆడుతున్నట్టు కనిపిస్తున్నా… ఆడిస్తున్నది ఒక్కరే! తెలంగాణ తెర మీద ఇప్పుడు రసవత్తరమైన తోలుబొమ్మలాట సాగుతున్నది. ఒక్కడిని కొట్టడానికి అనేకమంది ఒక్కటై అనేక ఆయుధాలతో అన్ని దిక్కుల చుట్టుముడుతున్నరు. తొలి దశ… అబద్ధాల ఎంటర్టెయిన్మెంట్తో జనాన్ని ఎంగేజ్ చేయాలె. కులాన్ని లేపాలె. మతాన్ని మోయాలె. ఉద్వేగాలు రేపాలె. అన్ని వర్గాల మధ్య అనైక్యత రెచ్చగొట్టాలె. పదేండ్ల తర్వాత ఏ ప్రభుత్వం మీద అయినా ఎంతో కొంత ఉండే వ్యతిరేకతను భూతద్దంలో చూపెట్టి, మూడ్ క్రియేట్ చేయాలె. మనవాళ్లను గుంజుకోవాలె. రెండో దశ… తెలంగాణ ప్రజానేతకు ఒక ప్రతిద్వంద్విని ప్రతిపాదించే ఎత్తుగడ ఇది. తర్వాత మాన్యుఫాక్చర్డ్ లీడర్స్ అందరూ ఆ ప్రతిద్వంద్విని తిడుతూ ఉంటారు. మన మతం కోసం ఒక్కడు కొట్లాడుతుంటే ఇంతమంది తిడుతున్నారే అని సానుభూతిని క్రియేట్ చేయడం ఇందులో అంతరార్థం. మూడో దశ… ముఖాముఖి అయితే తప్ప టీఆర్ఎస్ను ఢీకొట్టి ఎన్నో కొన్ని సీట్లు గెలుచుకోలేమనే ఎత్తుగడతో, ఎన్నికల నాటికి ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయడం. ‘నేను బలంగా ఉన్నచోట నువ్వుండకు.. నువ్వు బలంగా ఉన్నచోట నేను ఉండ’. ఇదీ లోగుట్టు! తెలంగాణ ఒక్కటిగా ఉంటే, తెలంగాణకు ఒక్క నాయకుడు ఉంటే గెలువలేమనే ఈ కుమ్మక్కు వ్యూహం.
ఇందులో భాగమే అర్రలో బంధించినట్టు సెల్ఫోన్లో బంధించి, స్కిట్లు, ఔట్ ఆఫ్ ది కాంటెక్స్ కట్ చేసిన బైట్లు, కామెడీ యాక్టర్లతో జోడించిన బిట్లు, ఫేక్ ఫొటోలు, నకిలీ వీడియోలు… మన మనస్సును తమ అధీనం చేసుకుని, ఆపరేట్ చేసే మాయా మశ్చీంద్ర సినిమా. మరి మనం దీనిలో పడిపోదామా? కళ్ల ముందు కనిపించే ప్రగతా? లేకపోతే దాన్ని కోళ్ల గంప కింద కమ్మే కనికట్టు ప్రచారమా? తల్లిని చంపి బిడ్డను బతికించిన్రు అంటున్న వాళ్లు అకస్మాత్తుగా అపర తెలంగాణ ప్రేమికులు అయిపోయి, ఆవిర్భావ దినోత్సవాన్ని జరిపి, అక్కడ కూడా శాపనార్థాలు పెడితే, వాళ్లకు అవసరం తెలంగాణ అభివృద్ధా? లేక అధికారమా? వందల ఏండ్ల చరిత్రను తవ్వుతున్న వాళ్లకు 8 ఏండ్ల క్రితం దాకా తెలంగాణకు తామేం చేసామన్న చరిత్ర ఉండదా? 8 ఏండ్లల్ల మనం ఏం తక్కువ చేసుకున్నం. మనకు ఏం తక్కువ జరిగింది? మరి మనం నిజ జీవిత సత్యాన్ని ఆస్వాదిద్దామా? అద్దాల అంగడిలో స్వప్నాలను చూద్దామా?
వందల ఏండ్ల కింద జరిగిన చరిత్రను తిరగరాసి సరిదిద్దాలంటున్నవాళ్లు,
అందుకోసం ప్రయత్నిస్తున్న వాళ్లు, రేపు తెలంగాణ రాష్ట్ర చరిత్రను కూడా తిరగ రాసే ప్రయత్నం చేయరనే గ్యారెంటీ ఏముంది? ఎనిమిదేండ్ల కింద తెలంగాణ ఏర్పాటు సరిగా జరగలేదని ప్రధాని నుంచి కిందిదాకా పదేపదే చెప్తూనే ఉన్నారు కదా! చారిత్రక కట్టడాల ఆధారంగా ఉద్వేగాలు రేకెత్తిస్తున్నవాళ్లు, రేపు రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ ప్రక్రియను తిరగరాయరనే హామీ ఏమున్నది? దేశమంతా విద్వేషాలు రేకెత్తిస్తున్నవాళ్లు, ఇప్పుడు తెలంగాణ-ఆంధ్ర ప్రజల మధ్య (లేని) విద్వేషాలు ఉన్నాయని అంటున్నారు. రేపటి వ్యూహానికి ఇది ఇప్పటి ఎత్తుగడా?
తెలంగాణకు కొన్నాళ్లు కోర్టులు వ్యతిరేకం. కొన్నాళ్లు ఇరుగు పొరుగు వ్యతిరేకం. కొన్నాళ్లు కేంద్రం వ్యతిరేకం. ఇప్పుడు తెలంగాణను అష్ట దిగ్బంధం చేసే ప్రయ త్నం. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో పని చేస్తున్నప్పుడు సమస్యలు సహజం. సమస్యల్లేని సందర్భమే ఉండదు. కానీ సమస్యలకు పరిష్కారం వెతుకుతున్నమా లేదా అన్నది ప్రశ్న. తత్తర బిత్తర పడితే గత్తర లేవడం ఖాయం. చెరువు మీద అలిగి ఏదో చేసినట్టు, మనం గందరగోళంలో పడితే అస్తిత్వాన్ని కోల్పోతం. అప్పుడు మిగిలేది బానిసత్వమే. ఉద్యమ సమయంలో కనిపించినట్టు ఇప్పుడు కుట్రలన్నీ కళ్లముందు తారసపడవు. అది బహిరంగ యుద్ధం. అక్కడ వైరి పక్షాలు పరస్పరం మోహరించి ఉన్నయి. ఇది అంతర్యుద్ధం. ఇక్కడ మనోడే మనతో పోరాడుతుంటడు. కానీ ఆ పోరాటం మనది కాదు. మనకోసం కాదు. ఎవరి గొంతో ఇక్కడ వినిపిస్తుంది. కానీ ఆ ధ్వని మన ప్రతిధ్వని కాదు.
ఇప్పుడు మనముందొక ప్రశ్న నిలబడి ఉన్నది. చర్చ కులం మీద జరగాల్నా? మతం మీద
జరగాల్నా? ప్రాంతం మీద జరగాల్నా? ప్రాంతాన్ని తక్కువ చేసి కులాన్ని, మతాన్ని పెంచే ప్రయత్నమొకటి జరుగుతున్నది.కులం-మతం గతం! ప్రాంతం మన భవిష్యత్తు!! మనం గతంలోకి జారిపోవడమా? భవిష్యత్తును దర్శించడమా? వాళ్ల రచ్చలోకి మనం వెళ్లడమా? మన చర్చలోకి వాళ్లను రప్పించడమా? మనమే తేల్చుకోవాలి.
ఏదో జరిగిపోతున్నది అనే ముందు, ఇదివరకు ఏం జరిగిందో మనం ఆలోచించుకోవాలె.ఎటు పోతున్నం అనుకునే ముందు,ఎక్కడి నుంచి వచ్చినం అని మనం ఆలోచించుకోవాలె.తప్పు జరిగిందనే నిర్ధారణకు వచ్చే ముందు,జరిగిన ఒప్పుల్ని కూడా మనం లెక్క వేసుకోవాలె.
– తిగుళ్ల కృష్ణమూర్తి , kruthi1972@gmail.com