వ్యవసాయం, నీటి పారుదల, సంక్షేమం, మౌలిక వసతులు తదితర రంగాలు తెలంగాణ అస్తిత్వాన్ని నింపుకొని దేశవ్యాప్తం కావడానికి ఎదురు చూస్తున్నాయి. ఉమ్మడి పాలనలో మసకబారిన తెలంగాణ సంపద వన్నెదేరుతూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్నది. ఇందుకు ప్రత్యక్ష సాక్షి ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ (ఐఎస్బీ). విద్యారంగంలో అనూహ్య ఫలితాలను సాధిస్తూ ప్రపంచపటంలో హైదరాబాద్ను సగౌరవంగా నిలబెట్టింది.
కొవిడ్ నేపథ్యంలో హైదరాబాద్, మొహాలి క్యాంపస్ల విద్యార్థులకు వర్చువల్ విధానంలో ఎంపికలు జరిగాయి. 270 కార్పొరేట్ సంస్థల నుంచి 2,066 ఉద్యోగ అవకాశాలు లభించాయి. అంటే ఒక్కో విద్యార్థికి సగటును రెండు ఉద్యోగాలు. ఒక్కో విద్యార్థికి లభించిన సగటు వార్షిక వేతనం రూ.34.07 లక్షలు. గతేడాదితో పోలిస్తే ఈసారి జీతభత్యాల్లో 20.78 శాతం పెరుగుదల ఉన్నది.
21 ఏండ్ల కిందట ప్రారంభమై అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోని బిజినెస్ స్కూల్స్లో మొదటి స్థానంలో నిలిచింది ఐఎస్బీ. ఆసియాలో 5వ స్థానాన్ని, ప్రపంచంలో 32వ స్థానాన్ని చేజిక్కించుకున్నది. రెండు ప్రతిష్ఠాత్మకమైన గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్ చార్ట్లో ముందంజలో ఉండటం విశేషం. 2022 ర్యాంకింగ్స్లో టాప్ అంతర్జాతీయ ఎంబీఏ ‘పోయెట్స్ అండ్ క్వాంట్స్’ (పీ అండ్ క్యూ) కాంపోజిట్ ర్యాంకింగ్లో ఐఎస్బీ ప్రపంచవ్యాప్తంగా 11వ ర్యాంక్ పొందగా, ఫైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్టీ) గ్లోబల్ ఎంబీఏ-2022 ర్యాంకింగ్లో మన దేశంలో అగ్రస్థానంలో ఉన్నది. ఆసియాలో నాలుగో ర్యాంకు పొందింది.
భారత్లో అంతర్జాతీయ ప్రమాణాలతో బిజినెస్ స్కూల్ ను ఏర్పాటుచేయాలన్న తలంపుతో రాహుల్ బజాజ్, ఆది గోద్రెజ్, లక్ష్మి మిట్టల్ వంటి వాణిజ్య దిగ్గజాల మదిలో మెదిలిన ఆలోచనకు కార్యరూపమే ఈ బిజినెస్ స్కూల్. విదేశీ బి-స్కూల్స్లోని కొంతమంది భారతీయ ప్రొఫెసర్లను కూడా తీసుకొని 1996లో ఓ బోర్డును ఏర్పాటు చేశారు. స్కూల్ను స్థాపించేందుకు హైదరాబాద్తో పాటు ముంబై, బెంగళూరు, చెన్నై పట్టణాలను పరిశీలించారు. చివరకు ఈ స్కూల్కు 1998లో హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో పునాదియి వేశారు. 260 ఎకరాల్లో 2001లో ఈ స్కూల్ ప్రారంభమైంది. అంచెలంచెలుగా ఎదుగుతూ వార్టన్, కెల్లాగ్, హార్వర్డ్ బి-స్కూళ్ల ప్రమాణాలతో ప్రపంచ స్థాయికి ఎదిగింది. అమెరికా, యూరప్ దేశాల్లోని స్కూల్స్లోని ఫ్యాక్టలీని విజిటింగ్ ఫ్యాక్టలీగా ఆహ్వానించి విద్యా ప్రమాణాలను పెంచుకున్నది. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు ముచ్చటపడి కొంతమంది పూర్తిస్థాయి ఫ్యాక్టలీగా స్థిరపడిపోవటం గమనార్హం.
ఐఎస్బీలో విద్యార్థులకు తెలియకుండానే కాలం గడిచిపోతుంది. దేశ విదేశాలకు చెందిన విద్యార్థులు ఏడాదిపాటు కలిసిమెలిసి పాఠాలు నేర్చుకొని నైపుణ్యాలను తీర్చిదిద్దుకుంటారు. ఓ మల్టీఫ్లెక్స్ థియేటర్ను తలపించేలా తరగతి గదులు ఉంటాయి. ఉదయం 8 నుంచి సాయం త్రం 7 గంటల వరకు బ్యాచుల వారీగా పాఠాలు సాగుతాయి. వివిధ దేశాల్లోని వ్యాపార మార్కెట్లపై పరిపూర్ణ అవగాహనను కలిగిస్తాయి. సంక్షోభంలో ఉన్న వాణిజ్య సంస్థలు ఇక్కడి విద్యార్థులకు ప్రాజెక్టులవుతాయి.
వందల రకాల దిన, వార, పక్ష, మాస పత్రికలు.. సీడీలు, డీవీడీలు.. వేల సంఖ్యలో పరిశోధన పుస్తకాలు కలగలసిన మూడంతస్తుల గ్రంథాలయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు దీని తలుపులు తెరుచుకుని ఉంటాయి. మెదడుకు పదును పెట్టుకోవడమే కాదు, శారీరక ఫిట్నెస్ కోసం కూడా ఐఎస్బీలో పలు సౌకర్యాలున్నాయి. స్విమ్మింగ్ పూల్, జిమ్, టెన్నిస్, షటిల్ కోర్టులు, యోగా, ఎరోబిక్స్ అందుబాటులో ఉన్నాయి.
నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునేందుకు ఉపయోగపడే హెల్త్, ఫైనా న్స్, మార్కెటింగ్, బిజినెస్ తదితర క్లబ్ లు ఉన్నాయి. ప్రతి విద్యార్థి ఏవేని మూడు క్లబ్లలో సభ్యులై ఉండాలి. మార్కెట్లోని తాజా మార్పులపై సెమినార్లు ఎప్పటికప్పుడు జరుగుతుంటా యి. ఇవి విద్యార్థులలో అవగాహనను పెంచుతాయి. భవిష్యత్తులో వారిని వాణి జ్యవేత్తలుగా స్థిరపడటానికి అవకాశం కల్పిస్తాయి.
వివిధ నేపథ్యాలకు చెందిన విద్యార్థులు ఐఎస్బీలో చేరుతుంటారు. కానీ, ఇక్కడ చేరాక అందరూ సమానులే. తమ తమ అనుభవాలను పంచుకుంటూ భవిష్యత్తుకు కొత్త బాట వేసుకుంటారు. ఆలోచన పరిధిని విస్తరించుకుంటూ, బాధ్యతలు పెంచుకుంటూ, వాటిని సమర్థవంతంగా నిర్వహించగలననే ఆత్మవిశ్వాసాన్ని ఐఎస్బీలో ప్రోది చేసుకుంటారు. విద్యార్థులతో పాటు వారి కుటుంబసభ్యులు ఉండటానికి స్టూడెంట్ విలేజీల్లో ప్రత్యేక వసతులున్నాయి.
క్యాంపస్ సెలక్షన్స్లో విద్యార్థులకు ఆకర్షణీయ జీతభత్యాలతో కూడిన ఆఫర్లతో ప్రతిష్ఠాత్మక సంస్థలు ముందుకువస్తాయి. ఈ ఏడాది (2022 బ్యాచ్)లో 929 మంది విద్యార్థులుండగా, వీరిలో 39 శాతం మంది విద్యార్థినులు. కొవిడ్ నేపథ్యంలో హైదరాబాద్, మొహాలి క్యాంప స్ల విద్యార్థులకు వర్చువల్ విధానంలో ఎంపికలు జరిగాయి. 270 కార్పొరేట్ సంస్థల నుంచి 2,066 ఉద్యోగావకాశాలు లభించాయి.
అంటే ఒక్కో విద్యార్థికి సగటును రెండు ఉద్యోగాలు. ఒక్కో విద్యార్థికి లభించిన సగటు వార్షిక వేతనం రూ.34.07 లక్షలు. గతేడాదితో పోలిస్తే ఈసారి జీతభత్యాల్లో 20.78 శాతం పెరుగుదల ఉన్నది. కన్సల్టింగ్, ఐటీ, ఐటీఈఎస్ (టెక్నాలజీ), బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్, బీమా తదితర రంగాలు), రిటైల్, ఔషధ, ఆరోగ్య రంగాలకు చెందిన అగ్రశ్రేణి కార్పొరేట్ సంస్థలు ఉద్యోగాలను ఆఫర్ చేశాయి. తెలంగాణ రాష్ర్టానికే గర్వకారణంగా నిలిచిన ఐఎస్బీ.. వ్యాపార, వాణిజ్య విజ్ఞాన వీచికగా హైదరాబాద్ ఘనకీర్తిని చాటుతున్నది.
-కోడం పవన్కుమార్
98489 92825