కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన బీజేపీ నాయకుల కుసంస్కారాన్ని, నోటి దురుసును మరింతగా బయటపెట్టింది. ఏదైనా రాజకీయ పక్షం అధికారంలోకి రావాలంటే, తాము సాధించిన విజయాలను, భవిష్యత్ ప్రణాళికలను ప్రజల ముందు పెట్టి ఓట్లు అర్థించడం పరిపాటి. కానీ బీజేపీ నాయకులకు తమ ఘనత గురించి చెప్పుకోవడానికంటూ ఏమీ లేదు. కేంద్రంలోని మోదీ సర్కారు అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైంది. బీజేపీ పాలిస్తున్న రాష్ర్టాలలో కూడా అవినీతి, అరాచకం పేట్రేగిపోతున్నాయి. తెలంగాణకు ఫలానా లబ్ధి చేకూర్చామనీ చెప్పుకోలేరు. అమిత్ షా తన పర్యటన సందర్భంగానైనా కేంద్రం ఇచ్చిన హామీలను ఆలస్యంగానైనా నెరవేరుస్తామంటూ ఒక్క మాట చెప్పినా బాగుండేది. కానీ తెలంగాణ ఆకాంక్షలపై జాతీయ నాయకులకే కాదు, రాష్ట్ర నాయకులకూ స్పష్టత లేదు. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లి, ముఖ్యమంత్రి కేసీఆర్పై సంస్కార హీనమైన ఆరోపణలు చేయాలనే దిగజారుడు మార్గాన్ని ఎంచుకున్నారు.
ఈ రోజు దేశాన్ని పోషిస్తున్న నాలుగైదు రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి అనే కనీస పరిజ్ఞానం కూడా లేనట్టుగా అమిత్ షా మాట్లాడారు. కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ నుంచి ఇప్పటివరకూ రూ.3,65,797 కోట్లు ముడితే.. రాష్ర్టానికి కేంద్రం నుంచి తిరిగొచ్చింది రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే. గత ఎనిమిదేండ్లలో ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు కాదుకదా కనీసం నవోదయ పాఠశాలలైనా ఇవ్వడానికి కేంద్రానికి మనసు రాలేదు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలనే నీతి ఆయోగ్ సూచనలు కూడా కేంద్రానికి పట్టలేదు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.7,183 కోట్లకు పైగా బకాయిలకు దిక్కు లేదు. కనీసం రాష్ట్ర బీజేపీ నాయకులైనా తెలంగాణ ప్రయోజనాలు నెరవేర్చమని కేం ద్రాన్ని కోరవలసింది. కానీ సిగ్గువిడిచి రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడమేమిటి? అమిత్ షాతో పాటు వారు కూడా తమ నోటి దురద తీర్చుకున్నారే తప్ప రాష్ర్టానికి సాధించి పెట్టిందేమీ లేదు.
బీజేపీ నాయకులు అప్పుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడే రుణాలు సేకరించింది. వాటిని కూడా రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఉపయోగిస్తున్నది. వాస్తవానికి అర్థంపర్థం లేని అప్పులు చేస్తున్నది కేంద్రమే. దేశాన్ని రుణవలయంలో పడేసే దిశగా నడిపిస్తున్నది మోదీ ప్రభుత్వమే. ప్రధాని మోదీ అధికారం చేపట్టిన తరువాత వంద లక్షల కోట్ల రూపాయల మేర అప్పు పెరిగింది. దీంతో చేపట్టిన మహత్తర కార్యమేమైనా ఉందా? మతకల్లోలాలతో, అబద్ధాల ప్రచారంతో యువత మెదళ్లను విషపూరితం చేస్తూ దేశాన్ని వినాశనం వైపు తీసుకెళ్లటం మినహా మోదీ సర్కారు సాధించినది ఏమైనా ఉందా? అబద్ధాలతో కొద్ది మందిని కొన్ని రోజులు నమ్మించవచ్చు. కానీ ప్రజలను ఎల్లకాలం అబద్ధాలతో నమ్మించడం సాధ్యం కాదు. బీజేపీ నాయకుల ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారు. దాని ఫలితం ఆ పార్టీ అనుభవించక తప్పదు.