దేశం రోజుకో వివాదంతో విద్వేషం పెచ్చరిల్లుతున్నది. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా అసహనం విస్తరిస్తున్నది. మతోన్మాదం వికటాట్టహాసం చేస్తున్నది. ఒకచోట హిజాబ్, మరోచోట హలాల్… వెరసి సమైక్యతాభావం విస్మృతిలోకి జారుతున్నది. ప్రజల మధ్య సోదరభావం, పరమత సహనం కొడిగడుతున్నది.
దేశ సమగ్రతను కాపాడుతామంటూ ప్రమాణాలు చేసి ఢిల్లీ గద్దెక్కిన నేతలే సమాజాన్ని మెజారిటీలు.. మైనారిటీలుగా, అగ్రజులు.. ద్విజులుగా చీల్చుతున్నారు.ఏకోన్ముఖంగా.. పురోగమనం దిశగా జాతిని ప్రేరేపించాల్సిన అధినేతలు ఇప్పుడు మధ్యయుగాల నాటి మతఛాందసంలోకి దింపుతున్నారు. ఇదీ ఇప్పటి దేశ దౌర్భాగ్యం. అడుగడుగులో.. అమలవుతున్నది బ్రిటీషు పాలకుల ద్వారా ఒంటబట్టించుకున్న ‘విభజించు- పాలిం చు’ నీతి. ఇది ఎందుకు చేస్తున్నారో? ఏం ఆశించి చేస్తున్నారో తెలుసుకోవడం కష్టం కాదు. ఆర్థిక, సామాజిక, రాజకీయ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం, వాటి నుంచి జనం దృష్టిని మళ్లించి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నదే కాషాయదళ కుటిల పన్నాగం.
ఇక్కడ చర్చించుకోవాల్సిందేమంటే,బీజేపీ పాదుకొల్పుతున్న విభజన రాజకీయాల ప్రభావం, పర్యవసానాలు ఎలా ఉండబోతాయి? అని లోతుగా పరిశీలిస్తే వెన్నులో వణుకు వస్తుంది. శాంతిని, సహనా న్ని ప్రదర్శించే సమాజమే ప్రగతి దిశగా పయనిస్తుం ది. విభిన్న సంస్కృతులు, అనేక వైవిధ్యాలున్నా భారతీయ సమాజం ఇప్పటికీ ఒక గొప్ప ప్రజాస్వా మిక దేశంగా నిలువటమే దీనికి సజీవ సాక్ష్యం. ఏడున్నరేండ్ల స్వల్పకాలంలో తెలంగాణ సాధిస్తున్న ప్రగ తి సూచికలు మరో ఉదాహరణ. కానీ ఒకసారి శాంతి, సహనమనే భావనలు ఆవిరైతే.., మిగిలేది విలయమే.
అంతా విధ్వంసమే. ఉమ్మడిగా జీవిస్తున్న జాతిలో ఒకసారి మెజారిటీ వాదం, మైనారిటీ వాదం, మతతత్వం.. కులతత్వం.. ఏదైనా సరే ఒకసారి మొగ్గతొడితే ఆ వేరు భావనను రూపుమాపటం కష్టతరం. ఉన్మాదం తలకెక్కి వెర్రితలలు వేశాక చేసేదేం ఉండదు. అంతా హింస, అశాంతి. ఆద్యులైన వారే కాదు, నేడు చోద్యం చూసిన వారూ బలికాక తప్పదు. ఉన్మాదం అలాంటిది. చరిత్ర పుటలను తిరగస్తే అలా కాలగర్భంలో కలిసిన జాతులు, నెత్తుటి ధారలెన్నో ఉదంతాలు కళ్లబడతాయి.
మైనారిటీలపై విషం చిమ్ముతూ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తున్న ఈ మతోన్మాద శక్తుల దాడులు ఇక్కడితో ఆగుతాయా? ఈ శక్తులు రాబోయే కాలంలో సమాజంలోని అన్ని వర్గాలపైనా దాడిని ముమ్మరం చేస్తాయి. ఈ రోజు మైనారిటీల ఆహారంపై, వేషధారణపై ఏ విధంగానైతే ఆంక్షలు విధిస్తున్నవో, ఆచారాలు, కట్టుబాట్లపై విద్వేషాన్ని చిమ్ముతున్నవో, మరెంతగా వాటిని అసహ్యించుకుంటున్నవో.. రేపు మిగతా మతాలు, వర్గాలపైనా అదే తరహాలో విరుచుకుపడతాయి. అందుకు ఇటీవల తెలంగాణలో చోటుచేసుకున్న సంఘటనలే నిదర్శనం.
శ్రీరామ నవమి రోజున చికెన్ తిన్నారని జేఎన్టీయూ విద్యార్థులపై ఓ వర్గం దాడికి దిగడం అందులో ఒకటి. మితవాద శక్తులకు ప్రతీకగా నిలిచే రాష్ర్టానికి చెందిన ఇద్దరు ఎంపీల చేతలు మరొకటి. ఒకరు చెప్పులు వేసుకొని తాటిచెట్టెక్కి గౌడకులాన్ని అవమానపరిస్తే.. మరొకరు చెప్పులు వేసుకుని ఎల్ల మ్మ తల్లికి ముడుపులు కట్టాలంటూ పిలుపునిచ్చి కించపరిచారు. మతశక్తుల రేపటి దాడులకు ఇది సంకేతం. అంతేకాదు నయా ఉదారవాదం దన్నుతో మొత్తంగా ప్రజాస్వామ్యాన్ని పాతరేసే నియంతృత్వాన్ని ఈ శక్తులు అమలుచేస్తాయి.
ఇక ఈ మతోన్మాద రాజకీయం రేపటి తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసే ప్రమాదం పొంచి ఉన్నది. తెలంగాణ ఇప్పుడు ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. ఒక్కో సమస్యను అధిగమిస్తూ ఇప్పుడిప్పుడే ఒక దరికి చేరుకుంటున్నది. అమరు ల ఆశయాల సాధనకు ఏకోన్ముఖంగా సాగుతున్న తెలంగాణ పయనానికి ఈ మతోన్మాద రాజకీయాలు ప్రతిబంధకమవుతాయి. అరాచకశక్తులు పేట్రేగితే తెలంగాణ ఏర్పాటు ఒక విఫలప్రయత్నం అనే ముద్ర పడే ప్రమాదం ఉన్నది. ఇది ఊహాజనితం కాదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే వామపక్ష తీవ్రవాదం, మత ఛాందసవాదం పేట్రేగిపోతుందని నాడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలో చెప్పింది నిజమయ్యే ప్రమాదం ఉన్నది.
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనాదక్షత ఫలితంగా రాష్ట్రంలో శాంతి సుస్థిర తలు నెలకొన్నాయి. కానీ ఇప్పుడున్న భయమంతా దేశవ్యాప్తంగా వెర్రితలలు వేస్తున్న మతోన్మాదం తోనే. ఆ అరాచకశక్తులు తెలంగాణ రాష్ట్రంలో మొగ్గతొడిగితే హింసోన్మాదమే రాజ్యమేలుతుంది. మతకల్లోలాలు చెలరేగి అంతిమంగా విఫల రాష్ట్రంగానే మిగిలి, తుదకు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఇప్పటికీ కేంద్రపాలిత ప్రాంతం పేరిట హైదరాబాద్ను తన్నుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నవారికి అస్ర్తాన్ని అందించినవారమవుతాం. తెలంగాణ సోయితో అంతలోతుగా ఆలోచించారు కాబట్టే, కేసీఆర్ మతోన్మాద రాజకీయాలను వ్యతిరేకిస్తూ నిలు వరిస్తున్నారు. సామరస్య సహజీవనానికి ఆయన పిలుపునిస్తున్నారు.
ఎవరి ఎజెండాలు వారు కలిగి ఉండం డి, ఎవరి జెండాలను వారు మోసుకోండి. కానీ తెలంగాణ సోయితోని పనిచేయాల్సిన సందర్భం ఇది. రేపటిరోజు వాటిల్లబోయే హానిని గుర్తెరిగి మసలుకోవాల్సిన తరుణం ఇది. మతోన్మాద శక్తులను ప్రతిఘటించడమే కాదు, పాతరేయాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడిది. అది రేపటి ప్రశాంత తెలంగాణ మనుగడకు ఓ కచ్చితమైన అవసరం కూడా.
-మ్యాకం రవికుమార్
91827 77621