తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అప్పట్లో పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రాంతం లేకుండా తెలంగాణ మనుగడ సాగించడం కష్టమన్నారు. కానీ, ఇప్పుడు ఆ ఊహాజనిత, పక్షపాత అభ్యంతరాలు నిజం కాదని తేలిపోయింది. పైగా త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న కొత్త రాష్ట్రంగా కూడా పేరు సంపాదించుకుంటున్నది. నాటి విశ్లేషకులు తెలంగాణ అంతర్గత స్వాభావిక సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేశారని తేలింది.
1956లో రాష్ట్ర పునర్విభజన కమిషన్ అంచనాల ప్రకారం తెలంగాణ ఆంధ్ర, ప్రాంతాల తలసరి రెవెన్యూ ఆదాయం రూ.15.54, రూ10.53లతో 1.43:1.00 నిష్పత్తిలో ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలోనూ, విడిపోయిన తర్వాత కూడా ఇంచుమించు అదే ఒరవడి కొనసాగింది. ఇప్పటి తలసరి రెవెన్యూ, కంప్ట్రోలర్ జనరల్ గణాంకాల ప్రకారం 2015-16లో 1.58:1.00, 2021లో 1.59: 1.00 నిష్పత్తిలో ఉన్నది. ఈ లెక్కలు రెండు ప్రాంతాల భిన్న రెవెన్యూ ఆదాయ సామర్థ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అయితే కేంద్ర పన్ను ల పంపిణీ, గ్రాంట్స్ విషయంలో చాలా తేడా ఉన్నది. ఆంధ్ర రాష్ట్ర విస్తీర్ణం, జనాభా ఎక్కువ ఉండటం వల్ల ఆ రాష్ట్రం వాటా ఈ గ్రాంట్స్లలో ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ, ఆంధ్ర మధ్య 2015-16లో అది 0.75:1.00 , 2020-21లో 0.64: 1.00 నిష్పత్తిలో ఉన్నది. దీనికితోడు ఆంధ్ర రూ.52,000 కోట్లు, డెఫిసిట్ గ్రాంట్ 2015-26 వరకు కేంద్రం నుంచి పొందుతున్నది. తెలంగాణ ఆర్థికమంత్రి ప్రకటన ప్రకారం కేంద్రం తెలంగాణ నుంచి 2014-15 నుంచి 2020-21 వరకు కేంద్ర పన్నుల కింద రూ.3,65,797 కోట్లు వసూ లుచేసింది. అందులో కేవలం రూ.1,68.647 కోట్లు మాత్రమే తిరిగి పంపింది. ఆంధ్ర విషయం లో ఇది రివర్స్. ఫార్ములా ప్రకారం వసూలుచేసిన పన్నుల కంటే చాలా ఎక్కువగా ఏటా ఆంధ్రకు కేంద్రం నుంచి లభిస్తున్నది.
ఇటువంటి ప్రతికూలత ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం 2018-19 వరకు తన బడ్జెట్ను మిగులు రెవెన్యూ బడ్జెట్గా నిర్వహించగలిగింది. కరోనా సమయంలో మాత్రం అన్ని రాష్ర్టాల వలె లోటు బడ్జెట్ చూపించవలసి వచ్చింది. అయితే ఆ లోటు నిబంధనలకు లోబడి ఉన్నది. ఆంధ్ర రాష్ట్రం మాత్రం, అధిక కేంద్ర పన్నుల, గ్రాంటుల వాటా ఉన్నప్పటికీ 2014-15 నుంచి 2020-21 వరకు క్రమేపి పెరుగుతున్న లోటు బడ్జెట్ను చూపిస్తూనే ఉన్నది. ఇదికాకుండా, తెలంగాణ తన మొత్తం రెవెన్యూలో సొంత టాక్స్ రెవెన్యూ 74 శాతం కలిగి ఉండి, దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 51 శాతం కలిగి ఉంది. దేశంలోని అన్ని రాష్ర్టాల సగటు 54 శాతం. ఇదంతా కలిపిచూస్తే కానీ అసలు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్వావలంబన అర్థం కాదు.
తెలంగాణకు ఇక్కడి అన్ని వనరులను ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగించే రాజకీయ స్వాతంత్య్రం లభించింది. తెలంగాణకు ఇప్పుడు తన రెవెన్యూ మీద పూర్తి అధికారం వచ్చి ఇక్కడ ఖర్చుపెట్టే అవకాశం ఏర్పడింది. 2013-14 ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ రూ.1.61 లక్షల కోట్లు. దాంట్లో తెలంగాణ వాటా సుమారు రూ.68,000 కోట్లు. ఇప్పుడు తెలంగాణ ప్రతిపాదించిన తాజా బడ్జెట్ రూ.2,56,959 కోట్లు. 2014-15లో తెలంగాణ జీఎస్డీపీ రూ.5,05,849 కోట్లు. అది 2020-21కి రూ.11,54,860 కోట్లకు పెరిగింది. తలసరి జీఎస్డీపీ రూ.1,24,104 కోట్ల (2014-14) నుంచి, రూ.2,78,833 కోట్లకు (2021- 22) పెరిగింది. రాష్ట్ర అప్పులు అధికారిక నిబంధనల పరిధికి లోబడి ఉన్నాయి. గుజరాత్ 1960 లో, హర్యానా 1966లో రాష్ర్టాలుగా ఏర్పడ్డాయి. విభజన తర్వాతే అవి తమ ఉమ్మడి రాష్ర్టాల కంటే ఎక్కువ అభివృద్ధిని సాధించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లను కూడా 1956లో విడిగా ఉంచితే సరిపోయేది. లేదా 1969 ఉద్యమం సందర్భంగా విభజన చేసి ఉంటే రెండు రాష్ర్టాలు నేడు దేశంలోని అగ్ర రాష్ర్టాల వరుసలో ఉండేవి.
రాష్ర్టాభివృద్ధికి, ఆర్థిక స్వావలంబనే కాకుండా, సమర్థ రాజకీయ నాయకత్వం, వ్యూహాత్మక ప్రణాళిక, ధృడచిత్తమైన పథకాల రచన, వాటి అమలు, వివేకవంతమైన బడ్జెట్ నిర్వహణ అవసరం. తెలంగాణలో ఈ ఎనిమిదేండ్లు అలాంటి పాలన సాగుతూ, ప్రగతికి స్పష్టమైన మార్గం ఏర్పడింది. తెలంగాణ రాష్ర్టాభివృద్ధికి విస్తృతమైన గుర్తింపు లభించింది. ‘నీతి ఆయోగ్’, అనుబంధ ప్రచురణ ‘అర్థ నీతి’ తన ఆగస్టు 2021 సంపుటం లో తెలంగాణ రాష్ర్టాభివృద్ధిపై ఒక ప్రత్యేక వ్యాసం ప్రచురించింది. ‘తెలంగాణ 2015-16 నుంచి సంయుక్త వార్షిక వృద్ధి రేటు 11 శాతం కంటే ఎక్కు వ సాధించింది. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి రాష్ట్ర ఆర్థి వృద్ధి రేటు సగటున 9 శాతం కన్నా ఎక్కువగా ఉంది’ అని నీతి ఆయోగ్ చెప్పింది. ఎన్డీటీవీ చానెల్ తెలంగాణ రాష్ర్టాభివృద్ధిపై ‘తెలంగాణ ఫీనిక్స్ రైజెస్’ అనే ప్రత్యేక వీడియో రిపోర్ట్ను ప్రసారం చేసింది.
తెలంగాణ రాష్ట్ర పురోగతిపై విమర్శకులు ఏమై నా అనవచ్చు, కానీ సాగునీటి రంగంలో రూ. 1,28,000 కోట్లు ఖర్చుపెట్టి 90 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించడమే కాకుండా స్థూల పంటల విస్తీర్ణాన్ని 190 శాతం మేర పెంచింది. ప్రభుత్వ కొత్త పారిశ్రామిక ప్రోత్సాహక పాలసీ ద్వారా రూ.2,32,000 కోట్ల పెట్టుబడులు వచ్చా యి. ఐటీ రంగంలో ఎగుమతులు 2020-21లో రూ.1.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. సామాజిక సంక్షేమ రంగంలో 450 పథకాలు అమలవుతు న్నాయి. ఇదొక మౌలిక సదుపాయాల, సాంఘిక సంక్షేమాల మేలు కలయికతో కూడి న ప్రభుత్వ వ్యయం అని చెప్పవచ్చు. ఇదంతా కేంద్రం నుంచి ఎటువంటి ప్రత్యేక ఆర్థికసహాయం లేకుండా రాష్ట్ర ఆర్థిక వనరులతోనే జరగడం విశేషం. తెలంగాణ ప్రభు త్వ పనితీరు ఈ ఎనిమిదేండ్లలో ఎం తో స్ఫూర్తిదాయకంగా ఉన్నది. అయితే రాష్ట్ర నిర్మాణం నిరంతర ప్రక్రియ. ఇంకా జరగవలసింది ఎం తో ఉన్నది.
-జె.ఆర్.జనుంపల్లి