గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, కర్ణాటక, బీహార్, తమిళనాడు, రాజస్థాన్, ఏపీ వంటి రాష్ర్టాల్లో తీవ్ర విద్యుత్ సంక్షోభంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రాష్ర్టాల్లో 3 నుంచి 12 గంటల పాటు విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణలోని మన విద్యుత్ సంస్థలు అన్నివర్గాల వినియోగదారులకు నిరంతర విద్యుత్ను సరఫరా చేస్తుండటం అభినందనీయం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారమవుతుందని చెప్పినవారే.. విద్యుత్ కోతల్లేకుండా బంగారు తెలంగాణ నిర్మాణంలో తెలంగాణ విద్యుత్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నేడు చెప్తుండటం గర్వించదగిన విషయం. ఇప్పుడు యావత్ దేశం కరెంటు కోతలనే నిశీధిలో ఉంటే తెలంగాణ మాత్రం నక్షత్రంలా వెలుగుతున్నది. రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఇంతటి ప్రగతిని ఎలా సాధించాయి? విద్యుత్ కోతల్లేని తెలంగాణ ఎలా సాధ్యమైంది. దీనంతటికి ముఖ్య కారణం సీఎం కేసీఆర్. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ నాడు ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు తెలంగాణ విద్యుత్రంగ పరిస్థితులపై ఇంజినీర్లు, అధికారులు, మేధావులతో చర్చించారు. లోతుగా అధ్యయనం చేశారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే కరెంటు కోతల్లేని తెలంగాణ కోసం ముందస్తు వ్యూహాలను రచించుకున్నారు. విద్యుత్లోటును అధిగమించి, నిరంతర విద్యుత్ను అందించడానికి పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో అపార అనుభవం, నిజాయితీ, సమర్థతతో పనిచేసే దేవులపల్లి ప్రభాకర్రావును జెన్కో సీఎండీగా నియమించింది. ఇదంతా ఒక ఎత్తయితే, తన ఆశయాలకు అనుగుణంగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, ఉద్యోగులు, కార్మికులందరికీ ‘మన తెలంగాణను మనమే పునర్నిర్మించుకోవాలని’ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసి కార్యోన్ముఖులను చేశారు. రాష్ట్ర ప్రజలకు నిరంతర విద్యుత్ను అందించాలన్న కేసీఆర్ ధృడ సంకల్పానికి ఇది నిదర్శనం.
2015లో 1,157 మంది ఆంధ్రా అధికారులను రిలీవ్ చేసినప్పటికీ తెలంగాణ ఉద్యోగులు అదనపు బాధ్యతలు నిర్వహించి విద్యుత్ వ్యవస్థను పటిష్ఠపరచడంలో విశేష కృషిచేశారు. కష్టపడే ఉద్యోగులు ఉన్నప్పటికీ విద్యుత్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను పటిష్ఠపరచాలంటే వేల కోట్ల రూపాయల పెట్టుబడి కావాలి. రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలంటే విద్యుత్ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచటం చాలా అవసరమని సీఎం కేసీఆర్ గుర్తించారు. విద్యుత్ సంస్థలు, ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం కోసం అన్నివిధాలుగా ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించారు. అందువల్లనే విద్యుత్ సంస్థల పురోగాభివృద్ధి సాధ్యమైంది.
కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో దేశానికే ఆదర్శమని చెప్పుకొన్న గుజరాత్ రాష్ట్రంలో కూడా వ్యవసాయానికి 8 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారు. కానీ ఏ రాష్ట్రంలో లేనివిధంగా మన తెలంగాణలో 24 గంటలు ఉచిత విద్యుత్తును అందిస్తున్నది ప్రభుత్వం. ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల విస్తరణకు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో విద్యుత్ సంస్థలు రూ.35,968 కోట్లు ఖర్చుపెట్టాయి. పేద, గృహ, వ్యవసాయ వినియోగదారులకు తక్కువ ధరలో విద్యుత్ అందించడం కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ.10 వేల కోట్ల సబ్సిడీ అందిస్తున్నది. ప్రభుత్వం గత ఐదేండ్లలో సుమారు రూ.9 వేల కోట్ల అదనపు సబ్సిడీ చెల్లించింది.
విద్యుత్ సంక్షోభం అంటే రోజువారీ విద్యుత్ వినియోగానికి, విద్యుత్ లభ్యతకు మధ్య వ్యత్యాసం పెరగడం. ప్రస్తుతం దేశంలో గరిష్ఠంగా 2.07 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. దేశంలో 3.95 గిగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఉన్నప్పటికీ 2.07 గిగావాట్లు కూడా సరఫరా చేయలేకపోతున్నారు. ప్రస్తుతం విద్యుత్ సంక్షోభం నుంచి దేశం గట్టెక్కాలంటే కేంద్రం తమ ఆధ్వర్యంలో ఉన్న విద్యుత్, రైల్వే, బొగ్గు, మంత్రిత్వ శాఖలను సమన్వయపరచాలి. బొగ్గు ఉత్పత్తిని వీలైనంతగా పెంచాలి. ఉత్పత్తి చేసిన బొగ్గును వీలైనంత త్వరగా రైల్వే ద్వారా రవాణా చేయాలి.
తెలంగాణలో కూడా బొగ్గు నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ ప్రమాదకరస్థాయికి తగ్గకుండా జెన్కో యాజమాన్యం చర్యలు తీసుకుంటున్నది. సింగరేణి కాలరీస్ మన రాష్ట్రం లో ఉండటం వల్ల తెలంగాణలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి (సుమారు 4 వేల మెగావాట్లు) జరిగేలా చూస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ప్రభుత్వం సౌరవిద్యుత్పై కూడా దృష్టి సారించింది.
తద్వారా అనతికాలంలోనే 4 వేల మెగావాట్లకు పైగా సామర్థ్యాన్ని పెంచడం ఇప్పుడు ఉపయోగపడుతున్నది. వీటితోపాటు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి కాలరీస్ యాజమాన్యం జైపూర్లో నిర్మించిన రెండు 600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రా లు కూడా రాష్ట్ర విద్యుత్ అవసరాలకు అండగా నిలుస్తున్నాయి. తెలంగాణ జెన్కో జలవిద్యుత్ కేంద్రాలు నీటి లభ్యతను బట్టి విద్యుత్ ఉత్పత్తికి దోహదపడుతున్నాయి. ఈ సమగ్రచర్యల వల్లే దేశమంతటా విద్యుత్ సంక్షోభం ఏర్పడినా తెలంగాణలో మాత్రం ఆ సమస్య లేదు. ముందుచూపు, దార్శనికత, పట్టుదల, ఆత్మైస్థెర్యం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ వల్లే ఇది సాధ్యమైందని ఘంటాపథంగా చెప్పవచ్చు.
-(వ్యాసకర్త: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఇంజినీర్ల అసోసియేషన్ అధ్యక్షులు)
పీసర రత్నాకర్రావు 96185 90592