భారత సమాజంలో వర్గ దోపిడితోపాటు కుల పీడన కూడా కొనసాగుతున్నది. అందుకే శ్రామిక కులాలు శ్రమ దోపిడికి, కుల వివక్షకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోంచే అణచివేతలకు, అసమానతలకు వ్యతిరేకంగా కులనిర్మూలన కోసం కుల సంఘాలు ఆవిర్భవించాయి. ఆ క్రమంలోంచే హైదరాబాద్లో 1909లో ‘యాదవ మహాజన సంఘం’ ఏర్పడింది.
తెలంగాణలో 18 శాతం జనాభా యాదవ, ఇతర ఉపకులా లది. యాదవులు తమలో తాము ఐక్యతను సాధించటంతోపాటు మిగతా బహుజన కులాల మద్దతు కూడా పొందాల్సిన అవసరం ఉన్నది. యాదవుల్లో చాలామంది విద్యావంతులుగా, సంపన్నులుగా ఎదిగారు. వారంతా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ.. విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థికరంగాల్లో తమ జాతిని ముందువరుసలో నిలపడానికి కృషిచేయాలి.
ఇప్పటికీ యాదవుల్లో పట్టణ ప్రాంతాల వారు మినహాయిస్తే ఎక్కువమంది గొర్రెలు కాస్తున్నారు. ఉన్నితీయడం, గొంగళ్ళు నేయడం, ఒగ్గు కథలు చెప్పడం, మాంసం ఉత్పత్తి.. ఇలా అనేక వృత్తి పనులున్నాయి. యాదవుల సమస్యలు, వాటి పరిష్కారం కోసం.. మే 3న (నేడు) హైదరాబాద్లో ‘యాదవుల ఆత్మగౌరవ సభ’ జరుగుతున్నది. ఈ సభలో యాదవులు, ఉపకులాల అభివృద్ధికి ప్రణాళికలు రచించాలి. సంప్రదాయ డిమాండ్లకు బదులుగా కొత్త డిమాండ్లను పాలక, ప్రతిపక్ష పార్టీల ముందుంచాలి.
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గొర్రెల పంపకం నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమచేసేలా కృషిచేయాలి. ‘తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య’తో పాటు కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రయత్నించాలి. ఇప్పటికే ‘దళితబంధు’ పథకం ఈ పద్ధతిలో నడుస్తున్నది. దీనికితోడు కార్పొరేట్ పద్ధతిలో షీప్ఫామ్లను ఏర్పాటుచేయాలి. ఇప్పటికీ సంచార జాతులుగా ఉన్న యాదవ, ఇతర ఉపకులాలకు ప్రత్యేక రిజర్వేషన్లు అవసరం. ఇలాంటి డిమాండ్లతో రాజకీయ పార్టీలను ఒప్పించేలా ఆత్మగౌరవ సభ కృషిచేయాలి.
– చలకాని వెంకట్ యాదవ్, 98665 89914
(వ్యాసకర్త: హైకోర్టు న్యాయవాది, బార్ కౌన్సిల్ మెంబర్)