ద్రవ్యోల్బణం వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. నగదు విలువ తగ్గిపోవడంతో ప్రజల పొదుపు చేసే సామర్థ్యం పడిపోతుంది. దీనికి తోడు ఉపాధి అవకాశాలు తగ్గితే, ప్రజలు కష్టాల పాలవుతారు. గడిచిన ఆరేండ్లలో దేశ ఆర్థికవిధానం (Fiscal policy), ద్రవ్య విధానం (Monetory policy) పరిశీలిస్తే ద్రవ్యోల్బణానికి మోదీ ప్రభుత్వ అసమర్థ విధానాలు కారణమని స్పష్టమవుతున్నది.
డబ్బు సరఫరా, వడ్డీరేటు నిర్ణయాధికారం సెంట్రల్ బ్యాంక్ అధీనంలో ఉంటుంది. దీన్ని ద్రవ్యవిధానం అంటారు. పన్ను శాతం, ఖర్చు, దేశంలో అభివృద్ధిని పెంపొందించే విధంగా ఉంచే బాధ్యత కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది, దీన్ని ఆర్థికవిధానం అంటారు. కేంద్రం ద్రవ్య వినిమయ చట్టంలో తెచ్చిన మార్పుల వల్ల, ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగిందని 2015 ఫిబ్రవరి నుంచి దేశంలోని ద్రవ్య విధానాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. 2014 మే లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2015 ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి రాజీవ్ మెహెర్షి, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మధ్య Monetory Policy Frame Work Agreement (MPFA) జరిగింది. దీనిని అనుసరించి ద్రవ్యోల్బణం 4 శాతానికి (ప్లస్ లేదా మైనస్ 2)గా ఆర్బీఐ ఉంచాలని, ఒకవేళ ఆర్బీఐ 3 క్వార్టర్స్ (9 నెలలు) ఉంచలేకపోతే ప్రభుత్వానికి వివరణ ఇవ్వవల్సిందిగా ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందానికి కట్టుబడి రఘురామ్ రాజన్ ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలు తీసుకున్నారు. తాము ఆశించిన మేరకు వృద్ధి జరగడం లేదని గమనించి మోదీ సర్కారు రెపో రేట్ (అంటే.. బ్యాంకులకు ఆర్బీఐ రుణాలిచ్చే వడ్డీ రేటు) తగ్గించాలని ఒత్తిడి చేసింది.
విదేశీ పెట్టుబడిదారులకు లబ్ధి చేసేందుకు రఘురామ్ రాజన్ రెపో రేటు తగ్గించడం లేదని 2015 ఆగస్టులో రాజీవ్ మహర్షి ఆరోపణలు చేశారు. ఒకవేళ ఆ ఆరోపణ నిజమైతే, రెపో రేట్ తగ్గించినపుడు విదేశీ పెట్టుబడులు వాపస్ పోవాలి, కానీ ఆ విధంగా జరగలేదని మన FOREX రిజర్వ్, Sensex, Nifty గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆర్బీఐ గవర్నర్పై ఫైనాన్స్ సెక్రెటరీ చేసిన ఆరోపణలు కేవలం మీడియా ఇంటర్వ్యూలోనే వచ్చాయి కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి విచారణ గడిచిన ఆరేండ్లలో చేపట్టలేదు. అంటే ఆ ఆరోపణల వెనుక అసలు ఉద్దేశం తెలిసిపోతున్నది. 2016 మే నెలలో ఆర్థిక మంత్రిత్వశాఖ, Monetory Policy Frame work Agreement (MPFA)లో భాగంగా Flexible Inflation Targeting (FIT)ను ఆర్బీఐతో చేసుకుంది. దానిలో భాగంగా ముగ్గురు స్వతంత్ర సభ్యులను MPCలో కేంద్రం nominate చేసింది. అంటే ఆర్బీఐ ద్రవ్య విధాన స్వయంప్రతిపత్తిని కేంద్రం తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నంగా ఈ చర్యను చూడవలసి ఉంటుంది.
రఘురామ్ రాజన్ పదవీకాలం తర్వాత అప్పటి డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ను ఆర్బీఐ గవర్నర్గా సెప్టెంబర్ 2016 లో నియమించారు. వారి పదవీకాలంలో కేంద్రం నోట్లరద్దు నిర్ణయం తీసుకున్నది. నవంబర్ 8, పెద్దనోట్లరద్దు అనంతరం ఆర్థికవ్యవస్థకు తగిలిన షాక్ నుంచి తేరుకునేందుకు కేంద్రం రెపోరేట్ను తగ్గించాలని ఒత్తిడి తీసుకువచ్చింది. దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అది సరైన చర్యకాదని భావించిన ఉర్జిత్పటేల్ అందుకు నిరాకరించారు. అయితే MPC సభ్యులను కలిసి ఆర్థిక మంత్రిత్వశాఖ ఆలోచనలు తెలియజేయాలని 2017 మేలో నాటి ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ను, ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్ సంజీవ్ సన్యాల్ను అప్పటి ఎకనమిక్ అఫైర్స్ సెక్రెటరీ అయిన శక్తికాంత్ దాస్ ఆదేశించారు. దీని వెనుక నాటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఉన్నారు. ఈ చర్య ఆర్బీఐ యాక్ట్కు వ్యతిరేకమైనదని, MPFAకు కూడా వ్యతిరేకమైనదని ఉర్జిత్ పటేల్ తీవ్రంగా వ్యతిరేకించారు. తర్వాత జరిగిన అనేక పరిణామాల కారణంగా ఆయన 2018 డిసెంబర్లో రాజీనామా చేశారు. దాదాపు అదే సమయంలో CEA అరవింద్ సుబ్రహ్మణ్యన్ కూడా రాజీనామా చేశారు.
డిసెంబర్ 2019 కరోనా ముందే ద్రవ్యోల్బణం 6.7 శాతానికి చేరుకుంది. జనవరి-మార్చి మధ్యలో కూడా 6.7 శాతం నమోదైంది. అంటే అడ్డదిడ్డంగా రెపో రేట్ తగ్గించడం వల్ల కరోనా కంటే ముందే ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఆర్బీఐ చర్యలు కారణమని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే నోట్ల రద్దు, తప్పుడు జీఎస్టీ విధానాల వల్ల దేశ ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నమై దేశ వృద్ధి రేటు పడిపోతుంటే, రెపో రేట్ తగ్గించి వృద్ధి రేటు పడిపోకుండా కేంద్రం ప్రయత్నించినప్పటికీ కరోనా కంటే ముందే వృద్ధి రేటు 4 శాతానికి పడిపోయి, భారత దేశం అభివృద్ధి చెందే దేశమనే గుర్తింపు 2019 నాటికే కోల్పోయిం ది. అంటే నోట్లరద్దు, దోషపూరితమైన జీఎస్టీ భారత ఆర్థికవ్యవస్థను ఎంత దెబ్బకొట్టాయో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిణామాల కారణంగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆచార్య తన పదవీ కాలానికి ముందే రాజీనామా ప్రకటించారు.
కరోనా సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, నోబెల్ గ్రహీతలు అభినవ్ బెనర్జీ, అమర్త్యసేన్తో పాటు అనేక ఆర్థిక నిపుణులు హెలికాప్టర్ మనీ ద్వారా ప్రజలకు డబ్బు చేరవేయడం ద్వారా నే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని, తద్వారానే ఆర్థికచక్రం మళ్లీ గాడిలో పెట్టవచ్చని కేంద్రానికి సూచించారు. ఆ సూచనలు కేంద్రం పెడచెవిన పెట్టింది. తద్వారా ప్రజల కొనుగోలుశక్తి తగ్గడంతో పాటు ద్రవ్యోల్బణం పెరిగింది.
ఆర్బీఐ రెపో రేట్ పెంచితే అత్యధికంగా నమోదు కాబోయే నెగెటివ్ గ్రోత్కు కేంద్రం జవాబు చెప్పాల్సి ఉంటుంది. కేంద్రం, ఆర్బీఐ తమ బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు 2020 ఏప్రిల్, మే నెలల ద్రవ్యోల్బణాన్ని గుర్తిచండం లేదని, లాక్డౌన్ కారణంగా ఆ సంఖ్యలకు ప్రామాణికత లేదని అభిప్రాయపడి, ద్రవ్యోల్బణం లెక్క లు జూలై నుంచి పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని తాము ఆమోదించలేమని డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆర్థిక మంత్రిత్వశాఖకు తెలిపింది. అంతేకాకుండా తాము గణాంకాలు ప్రకటించే ముందు ఆర్థికశాఖ అనుమతితోనే ప్రకటించామని, ఇప్పుడు మార్చుకోలేమని తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అభిప్రాయాన్ని బుట్టదాఖలు చేస్తూ, ఆర్థికశాఖ ఏప్రిల్, మే ద్రవ్యోల్బణ గణాంకాలను తిరస్కరించి, జూలై నుంచి ద్రవ్యోల్బణం పరిగణనలోకి తీసుకునేవిధంగా ఆదేశాలు జారీచేసింది!
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్, ఆర్బీఐ, MPC 2016-20 మధ్య సభ్యుడైన చేతన్ ఘాటె, ఈ ద్రవ్యోల్బణ రేటు ఉల్లంఘనను ఒప్పుకొని ఉంటే ఆర్బీఐ, ఆర్థికశాఖ విశ్వసనీయత పెరిగి ఉండేదని, అందువల్ల విశ్వసనీయతలో కొరత ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ఈ అస్తవ్యస్త ద్రవ్య విధానం ద్రవ్యోల్బణానికి కారణమైందని ఆర్థిక నిపుణులు, స్థూల ఆర్థికవ్యవస్థపై అవగాహన ఉన్నవారు భావిస్తున్నారు.
నోట్ల రద్దు, దోషపూరిత జీఎస్టీ, కార్పొరేట్ టాక్స్ను తగ్గించడం వంటి చర్యల వల్ల ద్రవ్యలోటు పెరిగింది. దాన్ని పూరించేందుకు పెట్రోల్పై సెస్ను కేంద్రం పెంచింది. పెట్రోల్పై విధిస్తున్న మొత్తం సుంకంలో కేంద్రం వసూలు చేస్తున్న ది 63 శాతం కాగా, రాష్ర్టాలు వసూలు చేస్తున్నది 37 శాతం మాత్రమే. అయినప్పటికీ రాష్ర్టాలను వ్యాట్ తగ్గించమని మోదీ చెప్పడం రాజకీయ లబ్ధి కోసమే. గడిచిన ఎనిమిదేండ్లలో పెట్రోల్, డీజిల్పై కేంద్రం వసూలు చేసిన సుంకం సుమారు రూ.26.5లక్షల కోట్లు. ఇందులో అత్యధిక భాగం సెస్ రూపేణా వసూలు చేసింది! దేశ ప్రజల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్పై సెస్సును రూ.10-15 వరకు తగ్గిస్తే రాష్ర్టాలు విధించే వ్యాట్ కూడా అదే నిష్పత్తిలో తగ్గుతుంది. తాము తగ్గించం కానీ, రాష్ర్టాలు మాత్రం తగ్గించాలని చెప్పే కేంద్రం కుటిలనీతిని భారతీయులు గమనిస్తున్నారు.
– పెండ్యాల మంగళాదేవి