విజ్జన్న పహిల్వాన్
హైదరాబాద్లోని గతకాలపు వస్తాదులలో రామయ్య ఒకరు. ఆయన ఎందరికో తర్ఫీదును ఇవ్వడమే కాకుండా తన పిల్లలను కూడా అదే రంగంలోకి దింపారు. దండ్రి వారసత్వాన్ని నిజాయితీగా, నిష్ఠగా కొనసాగించారు బొల్లబోయిన విజయ్ కుమార్ యాదవ్. మల్లయుద్ధాన్ని ప్రాణప్రదంగా ప్రేమించి ఎందరో శిష్యులను తీర్చిదిద్ది విజ్జన్న వస్తాద్గా పేరుగాంచారు. 67 ఏండ్ల వయస్సులో ఈ నెల 12న ఆయన గుండెపోటుతో మరణించారు.
తండ్రి అందించిన కళను మరింత విస్తృతపరిచేందుకు పంజాగుట్టలో ‘రామయ్య వస్తాద్ వ్యాయామశాల’ను నెలకొల్పారు విజయ్కుమార్ యాదవ్. హైదరాబాద్ యువకులు కుస్తీలో ఆరితేరి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని రాష్ర్టానికి, దేశానికి పేరు తేవాలనే పట్టుదలతో జీవితాంతం కృషిచేశారు. ముందుకొచ్చిన యువకులకు అవసరమైన పౌష్టికాహారం తానే అందించేవారు. వారికోసం రోజూ చిక్కని పాలు, బాదం పలుకులు సిద్ధంగా ఉంచేవారు. తన ఇంట్లోనే మల్లయుద్ధ క్రీడాస్థలాన్ని ఏర్పాటుచేసి సాధన చేయించేవారు. ఆంధ్రప్రదేశ్ కేసరి, తెలంగాణ కేసరి లాంటి బిరుదులతో పోటీలు నిర్వహించేవారు. రాష్ట్ర ఛాంపియన్లను తీర్చిదిద్ది జాతీయ పోటీల్లో పాల్గొని హింద్ కేసరి టైటిల్ సాధించాలని ఆయన ఆకాంక్ష. ఉత్తరభారతంలో ఉన్నంత పట్టింపు, కఠిన సాధన మన దగ్గర లేనందున మనవాళ్లు మొదటి దశలోనే వెనక్కిరావడం జరుగుతున్నదని బాధపడేవారు.
హైదరాబాద్లో మల్లయుద్ధ పోటీల నిర్వహణ కోసం విజయ్ కుమార్ యాదవ్ సొంత డబ్బును లక్షల్లో వెచ్చించారు. 2012లో ఆయన నగరంలో నిర్వహించిన జాతీయ పోటీల్లో 400 మంది వస్తాదులు పాల్గొన్నారు. విజేతకు 2 లక్షల నగదు బహుమతి, ఒక గద, పట్టా బహూకరించారు. అదే కార్యక్రమంలో జాతీయ కుస్తీ పోటీల్లో నెగ్గి అర్జున అవార్డు పొందిన 40 మందికి 10 వేల నగదు బహుమతి ఇచ్చి సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ఛాంపియన్ పోటీలను వరుసగా నిర్వహిస్తూ విజేతను తెలంగాణ కేసరిగా ప్రకటిస్తున్నారు. కరోనా కారణంగా రెండేండ్లుగా ఆ పోటీలు నిలిచిపోయాయి. ఈ యేడు నిర్వహించాలని ప్రయత్నిస్తున్న సమయంలో విజయకుమార్ పహిల్వాన్ ఆకస్మికంగా మరణించడం బాధాకరం.
విజయ్ కుమార్ యాదవ్ స్వయంగా కుస్తీ పోటీల్లో పాల్గొని ఎన్నో టైటిళ్లను సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో ఒక స్వర్ణం, రెండు రజతాలు గెల్చుకున్నారు. 1970లో నేషనల్ ఛాంపియన్గా నిలిచారు. అలా 13 నేషనల్స్లో పాల్గొని ప్రతి పోటీలో ఏదో ఒక గుర్తింపు సాధించారు. మల్లయుద్ధ శిక్షణ తీసుకునేవారికి క్రమశిక్షణ, ఓపిక, పట్టుదల, ఆటపై అవగాహన, కఠిన సాధనకు సంసిద్ధత ఎంతో అవసరమనేవారు. శిష్యుల ఎంపికలో ఆయన తగిన జాగ్రత్తలు తీసుకునేవారు. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ పహిల్వాన్ల స్థాయికి మనవాళ్లు ఎదగాలని ఆశపడేవారు.
విజయ్ కుమార్ 1994లో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు స్వస్తిపలికి పూర్తి సమయం కుస్తీ పోటీలు, శిక్షణకే కేటాయించారు. అదే దారిలో ఆయన ఆలిండియా ఇండియన్ ైస్టెల్ రెజ్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. కుస్తీని ఒక నిష్ఠాపూర్వక కార్యంగా భావించి తాను ఆ కళలో రాణిస్తూ, దాని వృద్ధి కోసం మనసా వాచా కర్మణా అవిరళ కృషిచేసిన విజయకుమార్ యాదవ్ ‘పహల్వాన్’ చిరకాలం గుర్తుండిపోతారు.
వస్తాదులకు నిలయం ఒకప్పటి హైదరాబాద్. నగరంలో అన్నివైపులా వ్యాయామశాలలు ఉండేవి. వీటికి రాజపోషణ కూడా ఉండేది. తమ సంస్థానంలో, రాజ్యంలో ఇంతమంది మల్లయోధులున్నారని చెప్పుకోవడానికి పాలకులు గర్వపడేవారు. అందుకే తమ రాజ్యంలో పహిల్వాన్ల సంఖ్య పెరగడానికి 200 ఏండ్ల కిందటే నిజాం రాజు నాగ్పూర్, పుణేల్లో ఉన్న అరబ్ దేశ పహిల్వాన్లను హైదరాబాద్ రప్పించారు. వ్యాయామశాలలను ఏర్పాటుచేసి ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత ఇక్కడ కూడా మల్లయుద్ధ పోటీల నిర్వహణ, గెలిచినవారికి విజయసూచికగా గదలు, పతకాలు బహూకరించే సంప్రదాయం మొదలైంది. రాజ్యాలు పోయాక మల్లయోధుల రాజసం కూడా కొంత మసకబారింది. ఆ తర్వాత వారు బాడీగార్డులుగా, సినిమాల్లో గూండా పాత్రలు వేసే వారిగా మారారు. కండబలంతో కొందరు దాదాగిరి చేస్తున్నారు. ఇతర వృత్తుల్లో బతుకు బండిని నడుపుతున్నారు మరికొందరు.
-బి.నర్సన్
94401 28169