దాదాపు ఆరు దశాబ్దాలుగా వివిధ సామాజిక, సారస్వత, సాంస్కృతిక, చారిత్రక, స్వాతంత్య్ర, జాతీయోద్యమ అంశాలపై, జాతీయ నాయకుల జీవిత విశేషాలపై సాధికారికంగా వ్యాఖ్యానిస్తూ రచనలు చేసిన సృజనశీలి, కాలమిస్ట్, జర్నలిస్ట్, కవి, రచయిత, అనువాదకుడు, తెలుగు అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకరరావు గురువారం సాయంత్రం పరమపదించారు. గాంధీ మహాత్ముని జీవితాన్ని, ఆయన సిద్ధాంతాలను గురించి తెలుగులో వీరు విస్తృతంగా రాశారు. తొలితరం 1969 ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం దాకా వారు పలు పత్రికలకు ఉద్యమ రచనలు చేశారు.
సాయంకాల పత్రికలకు కరపత్రాల్లాంటివి రాసి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించారు. ‘నా తెలంగాణ’ పేరుతో పత్రిక రిజిస్టర్ చేశారు. ఆర్థికభారం మోయలేక పత్రికను ఇతరులకు ఇచ్చేశారు. ‘పెన్షనర్ మూవ్ మెంట్’ మాస పత్రిక సంపాదకవర్గంలో ఉంటూ ఇటీవలి దాకా ప్రముఖుల జీవితాలను పరిచయం చేశారు .‘నమస్తే తెలంగాణ’ పత్రికలో ఇటీవలిదాకా ‘ముక్తసరి’ అనే శీర్షిక నిర్వహించారు.
దేవులపల్లి ప్రభాకరరావు జన్మస్థలం వరంగల్ నగరం. సంపన్న భూస్వాములైన దేశముఖ్ల కుటుంబంలో శ్రీమతి ఆండాళమ్మ-వెంకటాచలపతిరావు దంపతులకు జన్మించారు. ప్రభాకరరావు తండ్రి హన్మకొండ కోర్టులో ప్రముఖ న్యాయవాది. వెంకటాచలపతిరావు గారు సారస్వత ప్రియుడిగా, కవిగా, వరంగల్లోని శబ్దానుశాసనాంధ్ర భాషా నిలయానికి పోషకుడిగా, అప్పటి వరంగల్ నగర సాంస్కృతిక వర్గాల్లో ప్రసిద్ధులు. భారతి తెలుగు మాస పత్రిక, సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన ‘గోలకొండ కవుల సంచిక’లో వెంకటాచలపతిరావు రాసిన పద్యాలు ప్రచురితమైనాయి. ప్రభాకరరావు పెద్దన్న దేవులపల్లి రామానుజరావు. ఈయన బహుముఖీన ప్రతిభాశాలి. సాహిత్య అకాడమీ, సారస్వత పరిషత్తు లాంటి సంస్థల నిర్మాణ, నిర్వహణాదక్షుడు. సురవరం తర్వాత ‘గోలకొండ పత్రిక‘కు సంపాదకత్వం వహించిన నిరంతర సారస్వత సేవకుడు. తెలుగు ప్రజల్లో చైతన్యం కలిగించిన విద్యావేత్త. వీరి మరో సోదరుడు మదన్మోహన్ కూడా హిందీలో మంచి కవి, రచయిత.
సారస్వత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సమన్వయవాద వాతావరణంలో, భక్తిపరులు, సాహిత్యప్రియులు అయిన కుటుంబసభ్యుల ఒడిలో ప్రభాకరరావు గారి బాల్యం గడిచింది. ప్రభాకరరావు వరంగల్లోనే ప్రాథమిక విద్య పూర్తిచేసి, ఉన్నతవిద్య కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం వచ్చి ఆర్థిక, వాణిజ్య శాస్ర్తాల్లో పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖలో, కుటుంబ సంక్షేమశాఖలో, మాస్ మీడియా విభాగంలో పనిచేశారు.
హైస్కూల్ నుంచే ఆయన రచనా వ్యాసంగం ప్రారంభించారు. తొలినాళ్లలో విశాలాంధ్ర పత్రికలో అనేక వ్యాసాలు ప్రచురితం కావడం వల్ల ఆయనకు వామపక్ష మేధావులతో స్నేహం ఏర్పడింది. తెలుగు దినపత్రికలో వ్యవహార భాష ప్రవేశపెట్టిన తాపీ ధర్మారావుతో పరిచయం ఆయన జీవితం కొత్త మలుపు తిప్పింది. తాపీ గారు విజయ విలాస గ్రంథానికి ‘హృదయోల్లాస వ్యాఖ్య’ రచిస్తున్నప్పుడు దాదాపు ఏడాది పాటు ప్రభాకరరావు గారితో పని చేయించారట. దీనివల్ల ప్రభాకరరావు గారికి తెలుగంటే వల్లమాలిన అభిమానం ఏర్పడింది.
సికింద్రాబాద్ నుంచి కొత్తగా పండితారాధ్యుల నాగేశ్వరరావు సంపాదకత్వంలో వచ్చిన ఆంధ్రభూమి పత్రికలో సబ్ ఎడిటర్గా కొంతకాలమే పనిచేసినప్పటికీ తర్వాత వచ్చిన గోరా శాస్త్రి వారంవారం ‘యథాలాపం’ శీర్షిక రాయించారు. ఇట్లా ప్రారంభమైన వారి రచ నా వ్యాసంగం ఆ తర్వాత ఈనాడు, వార్త, ప్రజాతంత్ర, నమస్తే తెలంగాణ పత్రికల్లో కొనసాగింది. సామాజిక -రాజకీయ వారపత్రిక ‘ప్రజాతంత్ర’లో ప్రభాకరరావు గారు పనిచేస్తున్నప్పుడు సంపాదక విభాగంలో అన్నీ తానే అయి, ఎన్నో ప్రయోగాలు చేశారు. సుప్రసిద్ధ రచయిత్రి కమలాదాస్ రచించిన సంచలనాత్మక జీవిత కథను వారే అనువదించి పాఠకులను పెంచారు.
ప్రభాకరరావు గారు- ఈ వ్యాసకర్త కలిసి, పీవీకి ‘ప్రతిభా మూర్తి’ పురస్కార ప్రదానం సందర్భంగా ప్రచురించిన బృహత్ ప్రత్యేక సంచికకు సంపాదకత్వం వహించాం. ప్రభాకరరావు గారు తమ అమ్మ పేరున ‘శ్రీ ఆండాళ్ ప్రచురణలు’ ప్రారంభించి ఇంతకాలం వారు రచించిన అనేక ఇతర రచనలకు గ్రంథరూపం ఇవ్వడం ప్రారంభించారు. వాటిలో ‘మహాకవి గురుజాడ’, ‘సమరం నుంచి స్వాతంత్య్రానికి’, ‘చెప్పుకోదగిన మనుషులు’, ‘తెలంగాణ తేజోమూర్తులు’, ‘సంపాదకీయాలు’ సంకలనం, ‘మన పి.వి.’ వెలువరించారు.
‘పారిజాతాలు’ (కవితా సంకలనం), జ్ఞాపకాలు, ‘మహనీయతకు మరో పేరు మన రోశయ్య గారు’,‘అమరుడు బాపూజీ’,‘శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం- సాంస్కృతిక చైతన్య మహోద్యమం’, దేవులపల్లి రామానుజరావు ‘మోనో గ్రాఫ్’ లాంటి పలు గ్రంథాలు వెలువరించారు. కమాండర్ ఆర్.ఎస్.గులాటి గారి రచనను ‘మన నౌక బలం’ పేరుతో నేషనల్ బుక్ ట్రస్ట్ కోసం అనువదించారు. వారి రచనల్లో ‘గురజాడ జీవితం-సాహిత్యం’ గ్రంథానికి యునెస్కో అవార్డు లభించింది.
జాతీయ సమైక్యతపై రచించిన ‘నేను ఎవరు?’ గ్రంథం భారత ప్రభుత్వ అవార్డు గెలుచుకుంది.‘అల్లూరి సీతారామ రాజు’ అనే రేడియో నాటికకు జాతీయ పురస్కారం లభించింది. వీరి రచనా వ్యాసంగానికి గుర్తింపుగా 2009లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ‘కీర్తి’ పురస్కారం ఇచ్చి గౌరవించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరికి సాహిత్య పురస్కారం ప్రదానం చేసింది. ఇటీవలి వరకు పలు పత్రికలలో ప్రచురితమైన అనేక వ్యాసాలకు గ్రంథరూపం ఇస్తే, వారి సందేశం ముందు తరాలకు అందుతుంది.
-(వ్యాసకర్త: ప్రముఖ పాత్రికేయులు)
టి. ఉడయవర్లు