రాజ్యాంగ నిర్మాతగా, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడుగానే బీ ఆర్ అంబేద్కర్ గురించి చాలామందికి తెలుసు. కానీ, ఆయన తన కాలం నాటి గొప్ప ఆర్థికవేత్తల్లో ఒకరు. ఆర్థికరంగం, దాని సమస్యలు, పరిష్కారాల గురించి అంబేద్కర్ రాసిన గ్రంథాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏర్పాటుకు అంబేద్కర్ రచించిన సిద్ధాంతగ్రంథమే ఆధారంగా నిలిచింది. ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వ ఆర్థిక విధానాలు ఉండాలన్న బాబాసాహెబ్ బాటలోనే కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం పయనిస్తున్నది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1907లో మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. ఆ తర్వాత ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్తో బీఏ చదివారు. కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ చేశారు. 1927లో ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ పొందారు.
అంబేద్కర్ పలు సబ్జెక్టుల్లో నిష్ణాతుడు. 11 భాషలను అలవోకగా మాట్లాడగలిగేవారు. ఆర్థికశాస్త్రం అంటే ఆయనకు చాలా ఆసక్తి. ఆర్థికవేత్తగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన అంబేద్కర్.. తన కాలం నాటి ప్రధాన ఆర్థిక చర్చలకు సహకారం అందించారు. మనదేశంలోని అత్యుత్తమ ఆర్థికవేత్తల్లో ఆయనొకరు. అంబేద్కర్ పరిశోధ న వ్యాసాల్లో అత్యంత విశిష్టమైనది 1918లో ‘ఇండియన్ ఎకనమిక్ సొసైటీ జర్నల్’లో ప్రచురితమైన ‘వ్యవసాయం, వ్యవసాయ హోల్డింగ్స్’పై రాసిన వ్యాసం. నాటి ఆర్థిక చర్చల్లో ఇది అత్యంత ప్రాధాన్యమైనది.
ఆర్థికవేత్తగా అంబేద్కర్ పలు పుస్తకాలు రాశారు. వాటిలో మూడు సిద్ధాంత గ్రంథాలు.
అవి 1. ఈస్ట్ ఇండియా కంపెనీ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, 2. బ్రిటీష్ ఇండియాలో ప్రొవిన్షియల్ ఫైనాన్స్ యొక్క పరిణామం, 3. రూపాయి సమస్య: దాని మూలం మరియు పరిష్కారం.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురించి ఈ దేశ ప్రజలు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు ఏమంటే… ఆయన రాసిన ‘రూపాయి సమస్య- దాని మూలం మరియు పరిష్కారం’లో అందించిన మార్గదర్శకాలు, దృక్పథం ప్రకారం ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఏర్పాటైంది. ఈ రచనను హిల్టన్ యంగ్ కమిషన్కు అంబేద్కర్ సమర్పించారు. భారతీయ కరెన్సీ మరియు ఫైనాన్స్పై 1926 రాయల్ కమిషన్ చేసిన సిఫారసుల ఆధారంగా ఆర్బీఐ ఏర్పాటైంది.
1951లో అంబేద్కర్ ‘ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా’ను స్థాపించారు. తక్కువ ఆదాయవర్గాలకు ఆదాయపు పన్ను విధించడాన్ని వ్యతిరేకించారు. ఆర్థికవ్యవస్థను స్థిరీకరించేందుకు భూ రెవెన్యూ పన్ను, ఎక్సైజ్ డ్యూటీ విధానాలను రూపొందించడానికి ఆయన దోహదపడ్డారు. భూ సంస్కరణలు, దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
‘బ్రిటిష్ ఇండియాలో ప్రొవిన్షియల్ ఫైనాన్స్ యొక్క పరిణామం’ అంబేద్కర్ పీహెచ్డీ పరిశోధన. ఈ పనిలో, అతను భారతదేశంలో ఆర్థిక నిర్వహణకు బ్రిటిష్ వలస ప్రభుత్వం ఉపయోగించే వివిధ వ్యవస్థలను విశ్లేషించారు. ప్రభుత్వాలు తమ ఖర్చులకు ‘విశ్వసనీయత, వివేకం, ఆర్థిక కోణం’ కలిగి ఉండేలా చూసుకోవాలని సూచించారు. ‘విశ్వసనీయత’ అంటే ప్రభుత్వాలు డబ్బును అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగాలకు అధికంగా ఉపయోగించాలి. ‘వివేకం’ అంటే ప్రజా ప్రయోజనాల కోసం వ్యయం చేయాలి. ‘ఆర్థిక కోణం’ అంటే ఖర్చు చేసే నిధుల నుంచి గరిష్ఠ ప్రయోజనాన్ని రాబట్టుకోవాలి.
డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ సూచించిన ఈ అన్ని విధానాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్నారు. అందుకే మన రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తున్నది. దేశంలోని ఇతర రాష్ర్టాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నది. దేశాన్ని బలోపేతం చేసే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నది. అంబేద్కర్ చెప్పినట్టుగా ఒక సాధారణ రైతు బలమైన రైతుగా ఎదగాలంటే పంట ఒక్కటి వస్తే సరిపోదు. అందుకు కావలసిన సదుపాయాలను సమకూర్చాలి. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా ‘రైతుబంధు’ను ప్రవేశపెట్టి రైతుకు బలం చేకూర్చేలా అండగా నిలుస్తున్నారు. అలాగే ‘రైతు బీమా’ అందిస్తున్నారు. సకాలంలో అన్ని రకాల పంటలకు విత్తనాలు, ఎరువులు, ఉచిత కరెంటు, చార్జీలు లేని నీటిని తెలంగాణ రైతాంగానికి అందిస్తున్నారు. రానున్న రోజుల్లో మనందరం గర్వపడేలా దేశంలోనే బలమైన ఆర్థికశక్తిగా తెలంగాణను అవతరింపజేస్తున్నారు.
రాష్ట్రంలో అత్యంత పేదవర్గాలుగా ముద్రపడిన దళితజాతిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి, వారు సమాజంలో గౌరవంగా జీవించడానికి బృహత్తర ‘దళితబంధు’ పథకాన్ని ప్రవేశపెట్టి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్వతంత్ర భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ కూడా. ఆయన చేసిన కృషికి ‘భారతరత్న’ పురస్కారం లభించింది. అంబేద్కర్ ‘ఇండిపెండెంట్ లేబర్ పార్టీ’ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. ప్రపంచంలోని యువ న్యాయవాదులందరికీ ఆయన స్ఫూర్తి. ఆర్థికవేత్త, న్యాయ నిపుణుడు, రాజకీయవేత్త, ఉపాధ్యాయుడు, వక్త, తత్వవేత్త, సంఘ సంస్కర్త, మానవ హక్కుల విజేతకు హృదయపూర్వక నివాళి.
(వ్యాసకర్త: చైర్మన్, టీఎస్ఈఆర్సీ)
-తన్నీరు శ్రీరంగరావు