‘నేను తలచుకుంటే తెలంగాణ రాష్ట్ర శాసనసభను రద్దు చేయగలుగుతా’ అని గవర్నర్ తమిళిసై ఢిల్లీలో అన్నట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ విధంగా ఆమె మాట్లాడారా లేదా అనే ప్రశ్న తలెత్తుతున్నది. నిజానికి ప్రజా ప్రభుత్వాన్ని రద్దుచేసే అధికారం గవర్నర్కు లేదు. మేడారం సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లినప్పుడు అధికారులు ఎవరూ రాలేదని, యాదాద్రి ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని, తన తల్లి మరణిస్తే తనను పరామర్శించడానికి ముఖ్యమంత్రికి సమయం లేకుండా పోయిందని ఆవేదన చెందారు. ఇవి రాజ్యాంగ పాలనకు సంబంధించిన విమర్శలు కావు. ఇవన్నీ కనీస మర్యాదతో ముడిపడిన సమస్యలు.
ఆర్టికల్-174 ప్రకారం రాష్ట్ర శాసనసభ సమావేశాల మధ్య 6 నెలలకు మించి విరామం ఉండటానికి లేదు. 6 నెలలు దాటినా అసెంబ్లీ సమావేశం కాకపోతే శాసనసభ కూలిపోయే అవకాశం ఉంది. అయితే 6నెలల విరామం కారణంతో వెంటనే శాసనసభ తనంత తానే రద్దుకావడం జరగదు. రాజ్యాంగం ప్రకారం శాసనసభను సమావేశపరిచే అధికారం గవర్నర్కు ఉంటుందన్న మాట వాస్తవమే, కానీ గవర్నర్ కేవలం రాష్ట్ర ప్రభుత్వ సలహా మేరకు ఈ అధికారాన్ని నిర్వహించవలసి ఉంటుందని రాజ్యాంగం చాలా స్పష్టంగా వివరించింది. గవర్నర్ అనుమతి కోసం ఫైలు రాదు. గవర్నర్ సలహా ఇచ్చే పత్రం అది. ఆ సలహాను పాటించక తప్పదని రాజ్యాంగం వివరిస్తున్నది.
రాష్ట్ర శాసనసభ ప్రభుత్వాధికారులు తెలంగాణ శాసనసభను ఫిబ్రవరి నెలలో సమావేశపరచాలని గవర్నర్కు సలహా పంపారు. ఈ మేరకు గవర్నర్ ఫిబ్రవరిలో సమావేశపరిచారు, బడ్జెట్ సమావేశాలు జరిగాయి. కానీ ఇప్పుడు గవర్నర్ ఏమంటున్నారంటే ‘నేను తలుచుకుంటే మరో 15 రోజులు ఆ ఫైల్ మీద సంతకం చేయకుండా పెండింగ్లో పెట్టేదాన్ని, అప్పుడు శాసనసభ సమావేశాలు జరగకుండా నిలిచిపోయేవి’ అంటున్నారు. ఆర్టికల్-144 కింద గవర్నర్ శాసనసభ సమావేశాలను 6 నెలల విరామంలోనే నిర్వహించాలి. ఇది గవర్నర్ అధికారం కాదు, తప్పనిసరిగా చేయవలసిన బాధ్యత. కానీ కావాలని పెండింగ్లో పెట్టే అధికారం లేదు. రాజ్యాంగం ఆ విధంగా చేసే వీలు కల్పించలేదు. రాష్ట్ర శాసనసభను రద్దుచేసే అధికారం గవర్నర్కు రాజ్యాంగం ఇచ్చిన మాట నిజమే. కానీ దాని అర్థం తనకు నచ్చలేదనే నెపంతో ఎప్పుడంటే అప్పుడు రద్దు చేయడం కాదంటూ రాజ్యాంగ నియమాలను హైకోర్టు, సుప్రీంకోర్టులు తమ తీర్పులలో చెప్పాయి. ఆ తీర్పులను కూడా చదవాలి. లేకపోతే గవర్నర్లు తమకు విపరీతమైన అధికారాలుంటాయనే భ్రమలో ఉంటారు.
రాష్ట్ర విధాన మండలిలో కౌశిక్రెడ్డిని సభ్యుడిగా నియమించాలని కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ తమిళిసైని కోరారు. కానీ ప్రభుత్వ ప్రతిపాదనపై గవర్నర్ చాలాకాలం పాటు ఏ చర్యా తీసుకోలేదు. ఆ తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేల ప్రతినిధిగా పోటీలో నిలబెట్టి గెలిపించుకొని శాసనమండలికి పంపింది. ఈ వివాదం గవర్నర్కు, ముఖ్యమంత్రికి మధ్య విభేదాలకు దారితీసిందనే విమర్శ ఉన్నది. తమిళిసై వివరించిన మరో అంశమేమంటే 2022లో కొత్త బడ్జెట్ సమావేశాలు ప్రారంభించినప్పుడు గవర్నర్ ప్రసంగం ఉండితీరాలని ఆర్టికల్-175 నిర్దేశించినప్పటికీ గవర్నర్ ప్రసంగాన్ని తొలగించడం అవమానకరమన్నారు. సెప్టెంబర్లో జరిగిన శాసనసభ సమావేశాలు ముగియలేదని, అవే సమావేశాలు ఫిబ్రవరిలో కొనసాగించామనీ, అది కొత్త సమావేశం కాకపోవడం వల్ల గవర్నర్ ప్రసంగం అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. ఇద్దరి మధ్య సయోధ్య లేదనడానికి ఈ సంఘటనలు ఉదాహరణలవుతాయి. కానీ ప్రభుత్వాలను, శాసనసభలను రద్దుచేయడానికి ఇవి కారణాలు కాజాలవు. అభిప్రాయ భేదాలున్నప్పటికీ గవర్నర్ హోదా లో ఉన్న ఏ వ్యక్తి అయినా ఆ పదవి గౌరవానికి భంగం కలిగించకూడదు. ఒక ఫైల్ పెండింగ్లో పెట్టి రెండు సమావేశాల మధ్య 6 నెలల కృత్రిమ విరామం దాటించి, తర్వా త శాసనసభను రద్దుచేయడానికి ఇది హాంఫట్ మాయాబజార్ కాదు, రాజ్యాంగ పాలన చేయవలసిన ప్రజారాజ్యం.
-మాడభూషి శ్రీధర్