రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్నిరంగాల్లో ముందుకుపోతున్నది. రాష్ర్టాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నా కేంద్రం నుంచి రిక్తహస్తమే ఎదురవుతున్నది. ముఖ్యంగా విద్యాసంస్థల కేటాయింపులో కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నది. కేంద్ర విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైసర్), జవహర్ నవోదయ విద్యాలయాలు(జేఎన్వీ), కేంద్రీయ విద్యాలయాల(కేవీ)ను కేంద్రం మంజూరు చేయకపోవటం గర్హనీయం.
ప్రతిష్ఠాత్మకమైన ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, నైసర్లు ఆయా రాష్ర్టాల ప్రతిష్ఠకు ప్రతీకలుగా నిలుస్తాయి. ఇవి ఉన్న రాష్ర్టాల్లో వాటికి అనుబంధంగా ఉండే సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటవుతాయి. దీనివల్ల అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటయ్యాయి. వీటిలో కేంద్రం జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పదేపదే విజ్ఞప్తులు చేసింది. సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీని కలిసి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. అయినా ఫలితం శూన్యం. అదేవిధంగా కొత్త జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలను కూడా ఏర్పాటుచేయాలని కోరుతున్నా కేంద్రం నుంచి స్పందన ఉండటం లేదు. కొన్ని రాష్ర్టాలకు కేటాయించి తెలంగాణ విషయంలో మొండిచేయి చూపటం వివక్ష కాక మరేమిటి?
రాష్ట్రం నుంచి బీజేపీ తరఫున నలుగురు ఎంపీలున్నారు. మంత్రివర్గంలో కిషన్రెడ్డి క్యాబినెట్ హోదాగల మంత్రి. కానీ రాష్ర్టానికి విద్యాసంస్థలను తీసుకురావడంలో వారి ప్రయత్నాలేవీ లేవు. కానీ అదే ఉమ్మడి రాష్ట్రం నుంచి వేరుపడిన ఏపీకి మాత్రం ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ట్రిపుల్ ఐటీ వంటి సంస్థలను ఏర్పాటుచేసింది. తెలంగాణకు మంజూరుచేయకపోవటం వెనుక ఉన్న నీతి ఏమిటో బీజేపీ నేతలే చెప్పాలె. కేంద్రం చాలా రాష్ర్టాలకు ఐఐఎంలను కేటాయించి, తెలంగాణకు మాత్రమే ఇవ్వలేదు. ఈ ఏడేండ్లలో 2015లో ఏడు ఐఐఎంలను సంబల్పూర్ (ఒడిశా), విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్), బుద్ధగయ (బీహార్), అమృత్సర్ (పంజాబ్), నాగ్పూర్ (మహారాష్ట్ర), సిర్మౌర్ (హిమాచల్ప్రదేశ్)లలో ఏర్పాటుచేసింది. 2016లో జమ్మూ(జమ్మూ, కశ్మీర్)కు మంజూరు చేసింది. తాజాగా వీటికి శాశ్వత భవనాల నిర్మాణాలు కూడా పూర్తి కావస్తున్నాయి. కేంద్రప్రభుత్వానికి తెలంగాణ ఎందుకు కనిపించటం లేదు? టీఆర్ఎస్ ఎంపీలు ఎన్నోసార్లు కేంద్రానికి వినతులు ఇచ్చి వేడుకుంటున్నా ప్రయోజనం ఉండటం లేదు. దక్షిణాదిన తెలంగాణకు తప్ప అన్ని రాష్ర్టాలకు ఐఐఎంలు ఏర్పాటుకావటం గమనార్హం.
వచ్చే ఏడాది మరో 99 కొత్త నవోదయ విద్యాలయాలు ఏర్పాటుచేస్తామని కేంద్ర విద్యా మంత్రి ఈ మధ్య ప్రకటించారు. మన తెలంగాణలో ఏర్పాటైన 23 కొత్త జిల్లాలకు మంజూరు చేస్తారా లేదా? అందుకే రాష్ర్టానికి చెందిన ఎంపీలు పార్టీలకతీతంగా ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, నైసర్, జేఎన్వీ, కేవీల మంజూరు కోసం కేంద్రంపై ఒత్తిడి చేయాలి. రాష్ర్టానికి రావాల్సిన కేంద్ర విద్యాసంస్థలను సాధించాలి.
(వ్యాసకర్త: కె.బాలకిషన్ రావు ,99665 54945, సీనియర్ జర్నలిస్ట్)