హైదరాబాద్ మహా నగరానికి స్వాగత తోరణం వలె విస్తరించి ఉన్న ఈస్ట్ హైదరాబాద్ సిగలో మెట్రో నగ చేరనున్నది. దూరదృష్టితో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న సంస్కరణలు ఉప్పల్ నుంచి బీబీనగర్ వరకు విస్తరించి ఉన్న ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతాల దశ, దిశను మార్చుతున్నాయి.
ఒక ప్రణాళికాబద్ధంగా పల్లెలను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధునిక పట్టణాలుగా తీర్చిదిద్దడంతో ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతాలు అభివృద్ధిలో నేడు హైదరాబాద్తో పోటీ పడుతున్నాయి. వరంగల్ జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ఈ ప్రాంతంలో పల్లె, పట్టణాల మీదుగా రోడ్డు, రైలు మార్గాలకు అనుసంధానంగా సువిశాలమైన ఓఆర్ఆర్ను పూర్తిచేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా ఈస్ట్ హైదరాబాద్ మార్గంలో వేల కోట్లతో 25 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ నిర్ణయం ఈ ప్రాంత ప్రజలకు కొత్త ఆశలను రేకెత్తిస్తున్నది. ఓఆర్ఆర్కు ఇరువైపుల ఉన్న పట్టణాలతో పాటు పల్లెల్లో కూడా నేడు ఆకాశాన్ని తాకేలా బహుళ అంతస్తుల భవంతులు, కోట్ల విలువ చేసే విల్లాలు, వందల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే పరిశ్రమలు, ప్రసిద్ధిగాంచిన ఆధ్మాత్మిక క్షేత్రాలతో పాటు అకుపచ్చని అందాలతో ఆహ్లాదాన్ని పంచే ఆక్సిజన్ పార్కులు దర్శనమిస్తున్నాయి. తాజాగా మెట్రో విస్తరణ నిర్ణయంతో స్థానిక ప్రజలు ఈస్ట్ హైదరాబాద్ను తెలంగాణ భవిష్యత్తు పట్టణంగా భావిస్తున్నారు.
ఐటీకి ప్రత్యామ్నాయం…: హైదరాబాద్, సైబరాబాద్ కేంద్రంగా ఐటీ సంస్థలను రాష్ట్ర నలుదిక్కులా విస్తరించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్లను నిర్మిస్తున్నది. వరంగల్ జాతీయ రహదారి, ఓఆర్ఆర్ రూపంలో ప్రతిష్ఠాత్మక రోడ్డు రవాణా వ్యవస్థ, రైల్వే మార్గాలు విస్తరించి ఉన్న ఈస్ట్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే ఇన్ఫోసిస్, రహేజా ఐటీ పార్క్, ఉప్పల్ ఐటీ సెజ్, జెన్ప్యాక్ట్లో ఐటీ పరిశ్రమలు తమ తమ సంస్థలను ఏర్పాటుచేసుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తాజాగా మెట్రో విస్తరణ ప్రకటనతో పాటు విశాలమైన రోడ్డు రవాణా వ్యవస్థ, రీజినల్ రింగ్ రోడ్డు వంటి బృహత్తర అభివృద్ధి ప్రణాళికలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే దక్షిణ తెలంగాణ జిల్లాల నుంచి నిమిషాల వ్యవధిలోనే ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఆయా ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్తగా వరంగల్ హైవే పక్కనే మాదారం వద్ద సుమారు 450-500 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఐటీ పార్కును నిర్మించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందిస్తున్నది.
ఎడ్యుకేషనల్, మెడికల్ హబ్..: హైదరాబాద్ మహా నగరంలో జనసాంద్రత క్రమంగా పెరుగుతున్నది. దీంతో హైదరాబాద్ నగర శివారు ప్రాంతం విస్తరిస్తున్నది. ఈ క్రమంలోనే పెద్ద పెద్ద విద్యాసంస్థలు ఈస్ట్ హైదరాబాద్లో తమ తమ సంస్థలను నెలకొల్పాయి. బీబీ నగర్లో ఎయిమ్స్తో పాటు ఉప్పల్ నుంచి బీబీనగర్ వరకు వందల సంఖ్యలో ఇంజినీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, వేల సంఖ్యలో కార్పొరేట్ స్కూల్స్, ఇంటర్, డిగ్రీ కాలేజీలు వెలిశాయి. అలాగే అనురాగ్ విశ్వవిద్యాలయం, నీలిమ మెడికల్ కాలేజీ కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నది. ఈ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ల పిల్లలు చదువుతున్న విద్యాసంస్థలకు దగ్గరగా నివాసం ఉండేందుకు ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో బీబీనగర్ వరకు మెట్రో విస్తరణ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్థిర నివాసానికి అనువైన ప్రాంతం: ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్సిటీ, సైబరాబాద్ కేంద్రంగా అభివృద్ధి జరిగింది. తద్వారా ఆ ప్రాంతంలో ఐటీ పరిశ్రమలు విస్తరించడంతో మెజారిటీ ఐటీ ఉద్యోగులు ఆ ప్రాంతాల్లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ప్రజల డిమాండ్ దృష్ట్యా ఆ ప్రాంతాల్లో భూముల ధరలతో పాటు ఇంటి అద్దెలు కూడా భారీగా పెరిగాయి. దీంతో ఐటీ పరిశ్రమలపై ఆధారపడి జీవించే అనేకమంది పేద, మధ్య తరగతి ప్రజలకు స్థిర నివాసం నేటికి అందని ద్రాక్షే అయ్యింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి అభివృద్ధి వికేంద్రీకరణకు శ్రీకారం చుటుతుండటంతో పరిస్థితి కొంతవరకు మెరుగుపడింది. తాజాగా హైదరాబాద్ నలుదిక్కులా మెట్రోరైల్ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నది. హైదరాబాద్ వెస్ట్, నార్త్, సౌత్లో ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు కూడా ఉప్పల్ నుంచి బీబీనగర్ వరకు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నట్టయితే మెట్రోతో పాటు ఔటర్, ఎంఎంటీఎస్, రీజినల్ రింగు రోడ్డు, వరంగల్ జాతీయ రహదారి మార్గాల ద్వారా నిమిషాల వ్యవధిలో గమ్యస్థానాలకు చేరుకునే వెసులుబాటు కలుగుతుంది. అలాగే హైదరాబాద్ వెస్ట్, నార్త్, సౌత్ ప్రాంతాలతో పోల్చితే ఈస్ట్ హైదరాబాద్లో తక్కువ ధరలకే ప్లాట్లు, ఇండ్లు లభిస్తుండటంతో ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
కేంద్రం కక్షసాధింపు ధోరణి వీడాలి..: వరంగల్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీని తగ్గించాలనే లక్ష్యంతో ఎంఎంటీఎస్ ఫేజ్-2లో భాగంగా సికింద్రాబాద్, లాలాపేట్, చర్లపల్లి, ఘట్కేసర్ మీదుగా యాదాద్రి-రాయగిరి వరకు ప్రత్యేకంగా ఎంఎంటీఎస్ రైలు మార్గాన్ని ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. అయితే ఈ పనులు ప్రారంభించి సుమారు ఎనిమిదేండ్లు కావస్తున్నా నేటివరకు కేంద్రం ఈ మార్గాన్ని పూర్తిచేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేసినప్పటికీ పనులను పూర్తిచేయడంలో కేంద్రం తాత్సారం చేయడం విచారకరం. అలాగే ఉప్పల్ టు నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ పనులు కూడా ఒక్క అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కీ అన్నట్టుగా సాగుతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్షసాధింపు చర్యలను మానుకొని ఫెడరల్ స్ఫూర్తితో ప్రతిపాదిత ప్రాజెక్టులను పూర్తిచేస్తే ఈస్ట్ హైదరాబాద్ రూపంలో మరో అత్యాధునిక నగరం తెలంగాణలో ఆవిష్కృతమవుతుంది.
(వ్యాసకర్త: మేయర్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్)
-జక్క వెంకట్రెడ్డి