రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పల్లెలు, పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది. మెదక్ జిల్లా కౌడిపల్లిలో 2015లో ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం మొదలైంది. స్వల్ప కాలవ్యవధిలోనే తెలంగాణ గ్రామాల రూపురేఖల్ని ఈ కార్యక్రమం మార్చివేసింది.
మహాత్మాగాంధీ చెప్పినట్లు పల్లెలు స్వయంసమృద్ధి సాధించినప్పుడే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. ఆయన మాటల్ని నినాదప్రాయంగా చెప్పి వదిలేసిన వారు అనేకమంది ఉన్నారు. కానీ సీఎం కేసీఆర్ అలా కాకుండా సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లారు. పల్లెల కనీస అవసరాలు తీర్చడానికి కల్పించవలసిన వసతులను గుర్తించారు. పంచాయతీరాజ్ చట్టాన్ని సమగ్రంగా అధ్యయనం చేశారు. గత పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న లొసుగులు తొలిగించి కొత్త చట్టాన్ని రూపొందించారు. గ్రామాలు స్వయంసమృద్ధి సాధించాలంటే సమకూర్చాల్సిన వనరులను నిర్దేశించారు. అవసరమైన అధికారులను, సిబ్బందిని నియమించారు. ప్రతి గ్రామానికి పంచాయతీ సెక్రటరీ నియామకం జరిగింది. దీంతో గ్రామాల పరిపాలన గాడిలో పడింది. చట్టంలో వచ్చిన మార్పు వల్ల ప్రజాప్రతినిధుల బాధ్యత మరింత పెరిగింది. ఇది పల్లెల ప్రగతి వేగాన్ని పెంచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులను నేరుగా గ్రామపంచాయతీలకే జమ చేయడం వల్ల పంచాయితీల పరిపాలనలో స్వతంత్రత పెరిగింది.
పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాల అమలుతో గ్రామసీమల్లో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాలలో 31,781 డంప్యార్డుల నిర్మాణం చేయడం అంటే సాధారణమైన విషయం కాదు. గతంలో అనేక గ్రామాల్లో స్మశాన వాటికలు ఉండేవి కావు. మృతుల అంత్యక్రియలు జరపాలంటే అనేక వివక్షలు, ఆంక్షలు ఉండేవి. ఈ పరిస్థితి నేడు ఎక్కడా కనిపించటం లేదు. ప్రతి గ్రామంలో వైకుంఠధామాన్ని నిర్మించారు. 19,472 పల్లె ప్రకృతి వనాలను నిర్మాణం చేశారు.
వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తో పంట దిగుబడి అనేకరెట్లు పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం ఎండబెట్టుకోవడానికి సుమారు 23 వేల కల్లాలు నిర్మించారు. 2600ల రైతు వేదికల నిర్మాణం జరిగింది. గ్రామాలు ఆహార ఉత్పత్తిలో స్వావలంభన సాధించాయి. పెరిగిన పచ్చదనంతో పర్యావరణ స్థిరత్వం వచ్చింది.
ప్రతి గ్రామానికి ఒక నర్సరీ, మిషన్ భగీరథ ద్వారా తాగు నీటి సదుపాయం వచ్చింది. మిషన్ కాకతీయతో నిండుకుండల వంటి చెరువులు నిర్మాణమయ్యాయి. విద్యుత్ షాక్లతో జరిగే ప్రమాదాలను నివారించడానికి ‘పవర్ డే’ను ప్రవేశపెట్టారు. దీంట్లోభాగంగా గ్రామం లో ప్రమాదకరంగా పరిణమించిన కరెంటు స్తంభాలను తొలగించి కొత్త వాటిని వేశారు. రాత్రిపూట కరెంటు కోసం బావుల దగ్గరకు వెళ్లే అవసరం లేదిప్పుడు. ఈ గొప్ప మార్పులన్నీ గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచినయి. ఒకటికి బదులుగా రెండు పంటలు పండిస్తుండడంతో రైతులకు ఆర్థిక సమృద్ధి కలిగింది. వెలవెల బోయిన రోజులను మరిపిస్తూ నేడు పల్లెలు కళకళలాడుతున్నాయి. ప్రజల స్వప్నం సాకారం కావాలంటే పాలకుడికి దృఢమైన సంకల్పం ఉండాలి. అప్పుడు అసాధ్యాలన్నీ సుసాధ్యాలవుతాయి. తెలంగాణ ఏర్పాటు, రాష్ట్ర పునర్ నిర్మాణం ఇదే రుజువు చేస్తున్నది.
(వ్యాసకర్త : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వికాస సమితి)
-ఎర్రోజు శ్రీనివాస్
97003 02973