రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రభుత్వం పల్లెలు, పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది. ‘పల్లెలు స్వయం సమృద్ధి సాధించినప్పుడే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందన్న’ గాంధీజీ మాటల స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ సరైన ప్రణాళికతో ముందుకువెళ్లారు. పల్లెల కనీస అవసరాలు తీర్చడానికి సంకల్పించారు. గ్రామాల అభివృద్ధికి అడ్డంకులు గుర్తించారు.
గత పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న లొసుగులు తొలగించి కొత్త చట్టాన్ని రూపొందించారు. గ్రామంలో జరిగే అభివృద్ధికి, లోపాలకు సర్పంచిని కూడా జవాబుదారుగా చేశారు. చట్టంలో వచ్చిన ఈ మార్పు వల్ల ప్రజాప్రతినిధుల బాధ్యత మరింత పెరిగింది. ఇక్కడే పాలకుడి కార్యదీక్ష, అభివృద్ధి కాంక్ష, కచ్చితమైన భవిష్యత్తు ప్రణాళిక కనిపిస్తుంది. అందుకే పక్కా పణాళికలు రూపొందించి ఆచరణలో పెట్టారు.
గ్రామాలు అంటే అభివృద్ధికి ఆమడదూరం అనే అభిప్రాయాన్ని ప్రభుత్వం ఈ ఏడేండ్లలో తుడిచివేసింది. పల్లెలు, పట్టణాలతో పోటీపడుతూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వసతుల కల్పనతో గతంలో ఉన్న అనేక ఇబ్బందులు తొలగిపోయాయి. ప్రజలు సౌకర్యవంతంగా పల్లెల్లో జీవించే వాతావరణం ఏర్పడింది. 19,472 పల్లె ప్రకృతివనాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో గత నాలుగేండ్లలో 31,781 డంప్యార్డుల నిర్మాణం జరిగింది. ఇది సాధారణమైన విషయం కాదు.
కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తీసుకున్న ఐదు దశల ‘పల్లె ప్రగతి’ ప్రణాళికతో రాష్ట్రంలోని గ్రామాలు అద్భుతంగా తయారయ్యాయి. రోడ్లు, మురుగు కాల్వలు శుభ్రమయ్యాయి. పాడైపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటయ్యాయి. త్రీ ఫేజ్ విద్యుత్ వైర్లు ఏర్పాటయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీరు తొలగిపోయింది. కూలిపోయే అవకాశం ఉన్న పురాతన భవనాలను పడగొట్టి శిథిలాలను తొలగించటం, ఉపయోగంలో లేని పురాతన బావులను పూడ్చివేయటం, చెట్లు నాటడం, ఎండిన చెట్ల స్థానంలో పచ్చని మొక్కలతో పునః స్థాపితం చేయటం మొదలైన పనులపై ఈ ఐదు దశల పల్లె ప్రగతిలో దృష్టిసారించారు. వ్యర్థాలను పారవేసే ప్రదేశాలు (డంప్ యార్డులు), వైకుంఠధామాలు నిర్మాణమయ్యాయి. ఊరిలోని చెత్తను వర్గీకరించి డంప్యార్డులకు చేరవేయటం కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్, ట్రాలీని ప్రభుత్వం సమకూర్చింది. అలాగే, హరితహారం కార్యక్రమం కింద నాటిన మొక్కలకు నీరు పోయడం కోసం ఒక నీటి ట్యాంకర్ను కూడా అందించింది.
ఈ ప్రణాళిక విజయవంతంగా అమలుకావడంతో పల్లెల్లో విప్లవాత్మక మార్పు వచ్చింది. కేంద్రం ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తే అగ్రభాగాన మన గ్రామాలే ఉన్నాయి. కొన్నిసార్లు మొదటి పది స్థానాలు మనమే సాధించాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇంతటి అభివృద్ధి సాధించడం మనకు గర్వకారణం.
ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతాల జాబితాలో ఉన్న తెలంగాణ ప్రాంతం ఇవాళ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాల సరసన నిలబడింది. వెనుకబాటుతనం నుంచి ముందువరసలో గ్రామాలు నిలబడటం వెనుక జరిగిన కృషి అమోఘం. 2015లో ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం మొదలైంది. ఈ ఏడేండ్లలో తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. నిర్దేశిత కార్యక్రమాలు అమలుచేయడంలో ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగంలో చిత్తశుద్ధి కనిపిస్తున్నది.
ఒక గ్రామానికి అవసరమైన అధికారులను, సిబ్బందిని నియమించారు. ప్రతి గ్రామానికి పంచాయతీ సెక్రటరీ నియామకంతో గ్రామాల పరిపాలనా వ్యవస్థ గాడిలో పడింది. గ్రామాధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం పల్లెల ప్రగతి వేగాన్ని పెంచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు నేరుగా గ్రామపంచాయతీల్లో జమకావడం వల్ల పంచాయితీల పరిపాలనలో స్వతంత్రత పెరిగింది. గ్రామీణ గణతంత్రం దిశగా తెలంగాణ పల్లెలు సమృద్ధి సాధిస్తున్నాయి.
గ్రామాలు అంటే అభివృద్ధి ఆమడదూరం అనే అభిప్రాయాన్ని ప్రభుత్వం ఈ ఏడేండ్లలో తుడిచివేసింది. పల్లెలు, పట్టణాలతో పోటీపడుతూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వసతుల కల్పనతో గతంలో ఉన్న అనేక ఇబ్బందులు తొలగిపోయాయి. ప్రజలు సౌకర్యవంతంగా పల్లెల్లో జీవించే వాతావరణం ఏర్పడింది. 19,472 పల్లె ప్రకృతివనాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో గత నాలుగేండ్లలో 31,781 డంప్యార్డుల నిర్మాణం జరిగింది. ఇది సాధారణమైన విషయం కాదు.
గతంలో తెలంగాణ ప్రాంతంలో చాలా గ్రామాల్లో శ్మశానవాటికలు ఉండేవి కావు. ఎవరైనా చనిపోతే వారి అంత్యక్రియలు జరపాలంటే వివక్ష, ఆంక్షలుండేవి. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చారు. ప్రతి గ్రామంలో ఆధునిక వసతులతో వైకుంఠధామాన్ని నిర్మించారు. నాలుగేండ్లలోనే ఇంతటి అభివృద్ధి సాధించి చరిత్ర సృష్టించారు. గతకాలపు గాయాలు తుడిచేస్తూ గ్రామాభ్యుదయాన్ని పరుగులు తీయించారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఒకప్పుడు పల్లెలు అనగానే ప్రజల వలసలు, వెతలు గుర్తుకువచ్చేవి. దశాబ్దాలుగా వెనుకపడేయబడ్డ తెలంగాణను తొమ్మిదేండ్లలోనే ప్రగతిపథంలో నడిపించడానికి ఉద్యమస్ఫూర్తితో నిరంతరం శ్రమించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. స్వల్పకాలంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ ఘనత సాధించింది.
తెలంగాణ వచ్చేనాటికి గ్రామాల్లో 10 గంటల కరెంటు మాత్రమే ఉండేది. వ్యవసాయరంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తుతో పంట దిగుబడి అనేక రెట్లు పెరిగింది. రూ.524. 57 కోట్ల వ్యయంతో 2,601 రైతు వేదికల నిర్మాణం జరిగింది. రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు రూ.143.3 కోట్ల వ్యయంతో 22,858 కల్లాల నిర్మాణం జరిగింది. ఇది గ్రామీణుల ప్రధానవృత్తి అయిన వ్యవసాయరంగానికి, దానిపై ఆధారపడిన ప్రజలకు అందించిన చేయూత. గ్రామాలు ఆహారపు ఉత్పత్తిలో స్వావలంబన సాధించాయి. పెరిగిన పచ్చదనంతో పర్యావరణ స్థిరత్వం వచ్చింది. ‘మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలలకు నిధులిచ్చారు. పాఠశాలలను ఆధునికంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మౌలిక వసతుల కల్పన జరుగుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2022-23 వరకు 13,813.4 కిలోమీటర్ల సీసీ రోడ్లను నిర్మించింది. గ్రామాలు పక్కా రోడ్లతో సుందరంగా తయారయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని యువతలోక్రీడల పట్ల ఆసక్తిని పెంచేందుకు, శారీరక దృఢత్వం పెంపొందించడానికి 13,031 క్రీడా ప్రాంగణాల నిర్మాణం పూర్తయింది. రాష్ట్రంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, పంచాయతీరాజ్ రోడ్లు మొత్తం కలిపి సుమారుగా 76 వేల కిలోమీటర్ల రోడ్లున్నాయి. ఇందులో 99 శాతం రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ జరిగింది. దాంతో రహదారులన్నీ హరితహారాలయ్యాయి.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామంలో ఏర్పాటుచేసిన కనీస సౌకర్యాలలో కొన్నింటిని పరిశీలిస్తే తెలంగాణ పల్లెలు ఎంత ఆధునీకరించబడ్డాయో అర్థమవుతుంది. నూతన సౌకర్యాలతో పల్లె ప్రజల కష్టాలు తీరాయి. ఈ రోజు గ్రామీణ ప్రజల ఆరోగ్య రక్షణ, భద్రత మెరుగుపడింది. రెండు పంటలు పండిస్తుండటంతో రైతులు ఆర్థిక సమృద్ధి సాధిస్తున్నారు. వెలవెలబోయిన రోజులను మరిపిస్తూ నేడు పల్లెలు కళకళలాడుతున్నాయి. ప్రజల స్వప్నం సాకారం కావాలంటే పాలకుడికి దృఢమైన సంకల్పం ఉండాలి. దానికి నిజాయితీతో కూడిన కార్యదీక్ష తోడైంది. నేడు తెలంగాణ పల్లెలు సకల సౌకర్యాలకు నెలవుగా మారాయి. పల్లె ప్రగతి ద్వారా మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నది.
(వ్యాసకర్త: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వికాస సమితి)
ఎర్రోజు శ్రీనివాస్
94906 31368