‘నేడు తెలంగాణ వ్యవసాయం అంటే.. ఒక కోటి ఎకరాలకు పైగా మాగాణి, రెండు కోట్ల ఎకరాల పైచిలుకు సాగుభూమి. మూడు కోట్ల టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి.. ఇది కదా అభివృద్ధి. ఇదంతా కేసీఆర్ రైతు అనుకూల సంక్షేమ పథకాల కారణంగానే అని సగర్వంగా చెప్పుకోవచ్చు. దండుగన్న వ్యవసాయాన్ని పండుగలా చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుంది. ఈ విజయాన్ని సాధించటానికి కేసీఆర్ మహాయజ్ఞమే చేశారు’ అని తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధిని విశ్లేషిస్తున్నారు ప్రాస.
గతంలోకి తొంగి చూస్తే తెలంగాణలో అనాదిగా పంటల సాగు ఉన్నప్పటికీ, ఇక్కడి విశిష్టతలను గుర్తించిన పాలకులు గానీ, ప్రభుత్వాలు గానీ లేవు. మూడొంతుల వర్షాధారం, తరచూ దెబ్బతీస్తున్న పత్తి పంటకు తోడు కాలువల ద్వారా సాగునీటి వసతి లేకపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలో చిల్లిగవ్వ కూడా చేతిలో లేని పరిస్థితి వారిది. తెలంగాణ రైతంటే ఆత్మహత్యలకు దగ్గరన్నట్టే. తెలంగాణలో వ్యవసాయం మరిచిపోయిన వ్యాపకంగా ఉండేది. ఆ చీకటి రోజులను చీల్చుతూ సీఎం కేసీఆర్ వ్యవసాయానికి బంగారు రోజులు తీసుకువచ్చారు. ఇందుకు దశాబ్దాలు పట్టలేదు. కేవలం 9 ఏండ్లే పట్టింది. ఏ దేశ చరిత్ర చూసినా, ఒక కొత్త పరిణామాన్ని సృష్టించటానికి ‘దశకాలు’ పట్టాయని అధ్యయనాలు చెప్తున్నాయి.
ఇప్పటికే వ్యవసాయిక అగ్రగామి రాష్ర్టాలుగా పేరొందినవి కూడా సాధించలేని ఫలితాలను తెలంగాణ అనతికాలంలో సాధించగలిగింది. ఒక రైతు బాధ మరో రైతుకు మాత్రమే తెలిసింది. బోరుబావుల చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన పథకాలను రూపొందించింది. అత్యంత విలువైన పోషకాలను అందించే తృణధాన్యాలు సహా వరి పంటకు సైతం నీటి వసతిని కల్పించింది. గ్రామాలకు జీవనాధారాలైన చెరువుల పునరుద్ధరణను చేపట్టింది. ‘మిషన్ కాకతీయ’ ద్వారా 46 వేల పైచిలుకు చెరువుల పునరుద్ధరణ మహాయజ్ఞంగా జరుగుతున్నది. దీంతో భూగర్భ జలమట్టాలు రాష్ట్రమంతటా పెరిగాయి. బోరుబావులు నిండుకుండల్లా మారా యి. చెరువు మట్టితో పొలాలు సారవంతమై, పంటల ఉత్పాదకత పెరిగిందని, పోషకాలు, ఎరువులపై పెట్టుబడి ఖర్చులు సైతం తగ్గాయని ఇక్రిశాట్ పరిశోధనలు తెలుపుతున్నాయి.
దాదాపు అన్ని పంటల్లో పెట్టుబడి ఖర్చులు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం, కాల్వల ద్వారా సాగునీరు అందుబాటులో లేకపోవటమే. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అర్థం చేసుకున్నది. తొలి బడ్జెట్ నుంచి ఏటా బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తూ వచ్చింది. పెండింగ్లో ఉన్న చిన్న, మధ్య, భారీ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తూ పొలాలకు నీటిని అందించింది. ఏటా బడ్జెట్లో సాగునీటికి సగటున రూ.25 వేల కోట్లు కేటాయించిన రాష్ర్టాలు ఇప్పటివరకు లేవు. వీటితోపాటు 24 గంటల ఉచిత విద్యుత్తో తెలంగాణ చరిత్రలోనే మొదటిసారిగా రికార్డు స్థాయి వరి పంట ఉత్పత్తి సాధించగలిగాం. రాష్ట్రంలో మొత్తం రైతుల్లో చిన్న, సన్నకారు రైతులు 86 శాతానికి పైన ఉన్నారు. వీరికి సాగులో పెట్టుబడి పెట్టగలిగే సామర్థ్యం చాలా తక్కువ. తెలంగాణ రాకముందు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయేవారు.
వారు వ్యవసాయంలో కొనసాగేలా చూడాలంటే అప్పుల ఊబిలోంచి బయటపడేయాలి. మళ్లీ సాగుకు ఆర్థికంగా చేయూతనివ్వాలి. కేసీఆర్ ప్రభుత్వం అదే సాహసం చేసింది. లక్షల మంది పైచిలుకు రైతుల పంట రుణాలను మాఫీ చేసింది. ఆ తర్వాత ఎకరానికి రెండు పంటలకు కలిపి రూ.10 వేల పెట్టుబడి మద్దతు పథకంగా ‘రైతుబంధు’ను ప్రవేశపెట్టింది. 50 శాతానికి పైగా జనాభాకు వ్యవసాయమే ప్రధాన జీవనోపాధి రంగం. ఈ రంగంలో పెట్టుబడులతో ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరుగుతాయన్న ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ సూత్రీకరణను రాష్ట్ర ప్రభుత్వం అక్షరాలా నిజం చేసింది. రైతే జెండా, అజెండాగా రూపొందించి, అమలు చేసిన విధానాలు సత్ఫలితాలనిచ్చాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవసాయిక ప్రధాన రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది. పలు రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్రం వ్యవసాయ ఆదాయ వృద్ధి రేటులో 6.59 శాతంతో దేశంలో రెండవ ర్యాంకు సాధించింది. పెద్ద రాష్ర్టాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణదే మొదటి ర్యాంకు.
రైతు మరణిస్తే కుటుంబసభ్యులకు రూ.5 లక్షలు చెల్లించే రైతుబీమా పథకం వేలాది రైతు కుటుంబాలకు అండగా ఉంటున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల ఫలితమే నేటి వ్యవసాయరంగ ప్రాధాన్య ‘బంగారు తెలంగాణ’, ‘రైతు తెలంగాణ’. ఈ అభివృద్ధిని గమనించిన ఆర్థికవేత్తలు కేరళ, గుజరాత్ అభివృద్ధి మాడల్స్కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ఎదుగుతుందని చెప్తున్నారు.
2013లో 51.5 శాతం ఉన్న వ్యవసాయ కుటుంబాలు 2019 నాటికే 54.2 శాతానికి పెరిగాయి. పట్టణాల నుంచి గ్రామాలకు వలసలు పెరిగాయని ఈ గణాంకాలు తెలుపుతున్నాయి. దేశంలోని 11 రాష్ర్టాల నుంచి వ్యవసాయ, ఇతర రంగాలలో పనుల కోసం తెలంగాణకు వలస వస్తున్నారు. దేశంలోని ఏ రాష్ట్రం కూడా వ్యవసాయం కోసం తెలంగాణ రాష్ట్రం చేసినంత పెద్దఎత్తున ఖర్చు చేయడం లేదు. తెలంగాణలో వ్యవసాయరంగం ఆర్థికవృద్ధి రేటు 2015-16 లో -0.5 శాతం కాగా 2021-22 నాటికి 9.1 శాతానికి వృద్ధి చెందటం కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన వ్యవసాయ విధానాలకు నిదర్శనం. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించటం తెలంగాలో తప్ప ఎక్కడా లేదు. వ్యవసాయశాఖ ద్వారా తెలంగాణ రైతాంగానికి 63 శాతం వ్యవసాయ సాంకేతిక సలహాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని 95.3 శాతం రైతాంగం అనుసరిస్తున్నారని ఎన్ఎస్ఎస్ 67వ రౌండు నివేదిక స్పష్టం చేసింది. పక్కాగా శాస్త్రీయ సాగును ప్రోత్సహిస్తున్న రాష్ట్రం తెలంగాణ. అందుకే రైతురాజ్యంగా తెలంగాణ అవతరించింది.
– ప్రాస, 75692 30768