ఒక వర్గం పట్ల పోరాడటమంటే ఆ వర్గానికి నాయకత్వం వహించడమే కాదు, కష్టకాలాన్ని కూడా కసితో ఛేదించాలి. కానీ, ఒక రాజకీయపార్టీని చుక్కాని లేని నావ వలె మిగిల్చడం జయప్రకాష్ నారాయణకు మాత్రమే సొంతమైందని చెప్పవచ్చు.ఉద్యోగానికి రాజీనామా సమర్పించి మరీ ఆయన అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా పార్టీ స్థాపించారు. ఇంతవరకు బాగానే ఉన్నది. ఉద్యోగం చేయడం, రాజకీయం చేయడం పరస్పర విరుద్ధ కార్యాలు. ఉద్యోగంలో నెలకు జీతం వస్తుంది. ఇక్కడ నెలనెలకు సామాజిక స్పృహ పెరుగుతుంది. కొత్త తరం కోసం కొత్త రాజకీయం నినాదంతో కొంతమేర సంచలనమైంది. కానీ, అది ఆరంభశూరత్వంగానే మిగిలిపోయింది. ఒక పార్టీకి ఒకే విధానం ఉండాలి. ఇది ఏ పార్టీకైనా కనీస సూత్రం. కానీ జేపీ రాష్ట్ర విభజనలో రెండు కండ్ల సిద్ధాంతం పాటించడమే కాదు, గోడమీది పిల్లివాటం ప్రకటన చేస్తూ మాటల గారడీతో ఊరేగాడు.
జేపీ ఇటీవల మెట్రో విస్తరణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవి. అవి అభివృద్ధికి తీవ్ర విఘాతంగా ఉన్నాయి. వీటిగురించి ఆలోచించే ముందు ఆయనపై మనం దృష్టిసారిద్దాం. ఆయన కథా, కమామిషు ఏమిటో తెలుసుకుందాం. నాయకుడు రంగంలోకి దిగి పనిచేస్తేనే కార్యకర్తలు కదులుతారు. కార్యకర్తలను నాయకుడు తన మాటలతో చేతలతో కదిలించాలి, ముందుకు నడిపించాలి. అవి ఏవీ చేయకపోగా, జేపీ ఎప్పుడూ ఏసీ రూంలో చేసే సమీక్షలకే పరిమితమయ్యారు. లోక్సత్తా తర్వాత అదే లక్ష్యంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావమైంది. ఆ పార్టీ సంప్రదాయ జాతీయ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీలను ఓడించి అఖండ మెజారిటీతో ఢిల్లీ పీఠమెక్కింది. పంజాబ్లోనూ పాగా వేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దూరదృష్టి, క్షేత్రస్థాయిలో పడిన కష్టం పనిచేసింది. ఫ్రెంచ్, రష్యా, అమెరికా విప్లవాలు భారత స్వాతంత్య్ర పోరాటం ఏదైనా క్షేత్రస్థాయిలో నాయకులు దిగి పోరాడితేనే వచ్చాయి. కానీ ఆఫీసులకే పరిమితమై ప్రెస్నోట్ ఇస్తే కాదన్న విషయం జేపీ గుర్తెరగాలి. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిన కమ్యూనిస్టులు కూడా మహాసభలు, ప్లీనరీ ఏర్పాటు చేసుకొని ఎన్నికల్లో చేసిన పోరాట వ్యూహాన్ని సమగ్రంగా చర్చించుకున్నారు. కనీసం జేపీ ఆ రివ్యూ సమావేశం పెట్టే సాహసం కూడా చేయలేదు. ఆయన నడిపేది పార్టీయో, ఎన్జీవోనో అర్థం కాని పరిస్థితి. ఇలాంటివేవీ చేయకుండా జేపీ ఎన్నికలకు దూరంగా ఉంటామని స్వతహాగా నిర్ణయించారు.
ఎలక్షన్లలో పోటీ చేయడం ఇష్టం లేకుంటే ఎన్జీవో(నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్) పెట్టుకొని పోరాడాలి. అక్కడైనా ఫీల్డ్లోకి దిగి పోరాటంలో ఉండాల్సిందే. ఆయన ఉద్యోగంలో ఉన్నా ఇప్పటికి రిటైర్ అయి కనీసం పింఛన్ అయినా వచ్చేది. అటు అందులోనూ రాణించక, ఇటు రాజకీయాల్లో రాణించక రెంటికీ చెడ్డ రేవడిలా మారారు జేపీ. ఇప్పటికైనా ఎన్నికల్లో తమ ఓటమికి సరైన కారణాలు ఏమిటో జేపీ విశ్లేషించుకోవాలి. లేనిపక్షంలో ఇంట్లో కూర్చొని కృష్ణా, రామా అని కీర్తనలు పాడుకుంటే కనీసం ఆరోగ్యానికైనా మంచి జరుగుతుంది.
బలమైన క్యాడర్ లేకపోవడం, నాయకత్వంపై సరైన పట్టులేకపోవడం, ప్రజల సమస్యలపై పోరాటం చేయకుండా టీవీ చర్చల ద్వారా ప్రజలకు దగ్గరవుదామనుకోవడం లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్ అవివేకం. ఆయన ఒక్కరోజు కూడా పేద ప్రజల పక్షాన నిలబడి మాట్లాడిన దాఖలాల్లేవు. తాను చిన్న రాష్ర్టాలకు అనుకూలమంటూ అధికార వికేంద్రీకరణ జరగాలని, జిల్లాలను రాష్ర్టాలుగా చేయాలని, ఎన్నో రాష్ర్టాలున్నాయని అమెరికాతో పోలుస్తూ మాటల గారడి చేస్తూ వచ్చారు. చివరికి వస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ర్టానికి ‘నో’ చెప్పారు. రాజకీయాల్లో తనంత మేధావి లేడనుకునే జేపీ నిజానికి ఓ గురివింద గింజ. ఆయన స్వభావం కూడా పార్టీకి, ప్రజలకు మధ్య అంతరాన్ని పెంచింది. ఇక ఆయనను దూరం పెట్టాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉన్నదని అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
(వ్యాసకర్త: రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ లోక్సత్తా పార్టీ)
-మన్నారం నాగరాజు
95508 44433