నేడు ప్రపంచ సైకిల్ దినోత్సవం
ఆరోగ్యమే మహా భాగ్యం. ఆరోగ్యంగా ఉంటే అడవిలోనైనా బతుకవచ్చు. నేటి ఆధునిక సమాజంలో యువతీ, యువకులు అందంగా, నాజూకుగా కనిపించేందుకు ఆరాటపడుతుంటారు. ఇందుకోసం వ్యాయామం, యోగా చేస్తుంటారు. అందులో సైక్లింగ్ కూడా ఒకటి. సైకిల్ సామాన్యుని సాధారణ రవాణా సాధనం. దీన్ని ఐరోపాలో 19వ శతాబ్దంలో మొదటిసారి ఉపయోగించారు. ప్రయాణ సాధనాల్లో అన్నింటికన్నా అద్భుతమైంది సైకిలే. ప్రపంచవ్యాప్తంగా సామాన్య మానవునికి అందుబాటులో ఉండే సాధనంగా సైకిల్ పరిగణించబడుతున్నది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా సైకిల్ జోరు తగ్గడం లేదు.
దాదాపు మూడు వందల ఏండ్ల కిందట రోడ్డుపై నడిచే తేలిక పాటి వాహనం కోసం ప్రయత్నాలు మొదలై 1817 నాటికి ఆ ప్రయత్నం సాకారమైంది. రెండు చక్రాల సైకిల్ మోడల్ ఆవిష్కారమైంది. కొయ్యతో చేసిన వాహనాన్ని కాళ్లతో తొక్కుకుంటూ నడపొచ్చని జర్మనీకి చెందిన బరన్ క్లార్క్ డ్రెయిన్ సైకిల్ను రూపొందించారు. ప్రమాదాలు లేని పర్యావరణ హిత ప్రయాణ సాధనం సైకిల్. ఒకప్పుడు అవసరం కోసం, మరొక్కప్పుడు సరదా కోసం, ఇప్పుడు ఆరోగ్యం కోసం సైకిల్ అవసరమవుతున్నది.
బహుళ ప్రయోజనకారి అయిన సైకిల్ గురించి అందరికీ తెలియాలని మొదటి సారి 2018జూన్ 3న ఐరాస న్యూయార్క్లోని ఐరాస జనరల్ అసెంబ్లీ వేదికగా ఈ ‘సైకిల్ డే’ను నిర్వహించింది. సైకిల్ వాడకంలో కలిగే లాభాలను ప్రచారం చేయడమే దీని ఉద్దేశం. నడక, సైక్లింగ్లు సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తెలిపింది.
ఇప్పటికీ నగరాల్లో అల్పాదాయ వర్గాల వారు, యువకులు, విద్యార్థులు ఎక్కువగా సైకిల్నే వినియోగిస్తారు. ఏ విధమైన కాలుష్యాన్ని ఉత్పన్నం చేయకుండా, ఇంధ నం అవసరం లేని చౌకైన ప్రయాణ వాహనం సైకిల్. సైకిళ్ల ఉత్పత్తిలో చైనా మొదటిస్థానంలో, భారత్ రెండో స్థానంలో ఉన్నది. జపాన్లో అయితే 80 శాతం మంది పిల్లలు సైకిళ్లనే వాడుతారు. ప్రపంచంలో ఏటా 10.3 కోట్ల సైకిళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు వంద కోట్ల సైకిళ్లు సేవలందిస్తున్నాయి. నానాటికీ పెరిగిపోతున్న కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ కోసం, ట్రాఫిక్ రద్దీని మహా నగరాలలో తగ్గించేందుకై సైకిల్ వినియోగానికి ప్రాధా న్యం పెరిగింది. కాలుష్యరహిత నగరాల కోసం స్మార్ట్ సిటీలలో ‘ఇండియా సైకిల్ ఫర్ ఛేంజ్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో సైకిల్ ట్రాక్ను ఏర్పాటుచేయటం గమనార్హం.
సైక్లింగ్తో బరువు తగ్గడంతో పాటు శరీరం దృఢంగా తయారవుతుంది. ఉదయం ఎండలో సైకిల్ తొక్కితే శరీరానికి ‘డి’ విటమిన్ లభిస్తుంది. తద్వారా శరీరం కాంతివంతంగా తయారవుతుంది. సైకిల్ వాడకంతో గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. సైకిల్ తొక్కితే శారీరక ఉల్లాసంతో పాటు మానసక ఉల్లాసం కలుగుతుంది. రక్తప్రసరణ బాగుంటుంది. సైకిల్ తొక్కడం వల్ల మనిషి ఆయుర్దా యం కూడా పెరుగుతుంది. అందుకే చిన్న, తక్కువ దూరంలో ఉండే పనుల కోసం వెళ్లేందుకు సైకిల్ను వినియోగిద్దాం. సైకిల్ ప్రయోజనాలను అందరికీ వివరిద్దాం.
కె.రామ్మోహన్రావు
(వ్యాసకర్త: విశ్రాంత ఉపాధ్యాయులు)