‘తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు’ అంటూ వేమన శతకంలో ఒక పద్యం ఉంటుంది. ఇతరుల్లో తప్పులు వెతికేవారు, తమ తప్పులను తెలుసుకోలేరని ఆ పద్య భావం. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తీరు అచ్చం అలాగే ఉన్నది. 64 సీట్లతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ప్రజలు కోటి ఆశలతో ఆ పార్టీకి పట్టం గట్టారు. ఇప్పుడు ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ హమీలను అమలుచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. ఆరు గ్యారంటీల అమలును పక్కదారి పట్టిస్తూ గత పదేండ్లుగా పాలన సాగించిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై అవాకులు, చెవాకులు పేలుతున్నది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల పేరుతో కాలాన్ని వృథా చేస్తున్నది. పదేండ్లుగా బీఆర్ఎస్ ఏ అభివృద్ధీ చేయలేదంటూ, పైగా అప్పులు చేసిందంటూ విష ప్రచారం చేస్తున్నది. కాంగ్రెస్ అబద్ధాలను రాష్ట్ర ప్రజలు నమ్ముతారా అంటే లేదనే చెప్పాలి.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ అంతరించిపోయినట్టు కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నది. ఇప్పుడున్న కాంగ్రెస్ మంత్రుల్లో అందరూ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్/ బీఆర్ఎస్ దెబ్బను రుచిచూసినోళ్లే. కాంగ్రెస్ పార్టీ గెలిచింది 64 సీట్లు, బీఆర్ఎస్ గెలిచింది 39 సీట్లు. గెలిచిన స్థానాల్లో 5 వేల లోపు వ్యత్యాసం ఉన్నవే ఎక్కువ. రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 2 శాతం కన్నా తక్కువే అనే విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ మరో 20 మంది అభ్యర్థులను మార్చితే కాంగ్రెస్ పరిస్థితి వేరేలా ఉండేది. ఇది గ్రహించని కాంగ్రెస్ మంత్రులు ఇక బీఆర్ఎస్ పనైపోయిందనుకొని భ్రమపడుతూ బీఆర్ఎస్పై అబద్ధాలు మోపుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తుండటం విడ్డూరం.
ఒకసారి చరిత్రను వెలికితీద్దాం. 2004-2009 మధ్య ఉద్యమపార్టీ టీఆర్ఎస్ను, తెలంగాణ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు నాటి సీఎం వైఎస్సార్ ‘ఆపరేషన్ ఆకర్ష్’ పేరుతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కున్నారు. ఉద్యమంలో అదొక కుదుపు అనే చెప్పవచ్చు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ దెబ్బతిన్నది. అప్పుడే ‘ఇక టీఆర్ఎస్ పనైపోయింది’ అనుకున్నారంతా. ఉద్యమంతో పాటు టీఆర్ఎస్ అంతమైపోతుందని గేలి చేశారంతా. అలా వెకిలి చేసినవాళ్లు కనుమరుగైపోయారు కానీ, అదే టీఆర్ఎస్ రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణను సాధించింది. రాష్ట్రంలో రెండుసార్లు అధికారాన్ని చేపట్టింది. అదీ కేసీఆర్ చాణక్యం. అదీ కేసీఆర్ వ్యూహం. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. పడిన ప్రతీసారి నేలకు కొట్టిన బంతిలా పైకి ఎగిరిందే తప్ప భూమిలో చిక్కుకోలేదు.
స్వరాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వం, టీఆర్ఎస్ పనితీరు ప్రజల కండ్లల్లో ఇప్పటికీ మెదులుతూనే ఉంటుంది. కేసీఆర్ అలుపెరగని ఉద్యమ ప్రస్థానాన్ని, బీఆర్ఎస్ పోరాటాన్ని చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. ఒక్క ఓటమితో బీఆర్ఎస్ను కుంగదీయాలనుకుంటే అది అత్యాశే అవుతుంది. కొన్ని స్వీయ తప్పిదాలు, ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత, క్షేత్రస్థాయి నాయకత్వంలో ఉన్న గ్రూపు తగాదాలు వెరసి బీఆర్ఎస్ ఓటమి పాలైంది తప్ప, ఇది కాంగ్రెస్ విజయమో లేక ఏ ఒక్క వ్యక్తి విజయమో కాదు. ఓటమి చెందిన ప్రతీసారి తమ తప్పులను సమీక్షించుకొని బీఆర్ఎస్ పార్టీ ముందుకు కదిలింది, విజయం సాధించింది. ఇకముందూ అదే జరుగుతుంది. అలుపెరగని పోరాట, అభివృద్ధి ప్రస్థానానికి ఇదొక కామా మాత్రమే. పుల్స్టాప్ కాదు, కాబోదు.
ఇక గత పదేండ్లుగా తెలంగాణలో జరిగిన అభివృద్ధి విషయానికి వద్దాం. మంత్రులు వరుస ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. అసెంబ్లీలో అప్పులపై ప్రజెంటేషన్ ఇవ్వబోయి బొక్కబోర్లా పడ్డారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావుల సమాధానాలతో ప్రజెంటేషన్ ఫెయిల్యూర్గా మిగిలింది. పనిగట్టుకొని బీఆర్ఎస్కు మైలేజీ ఇచ్చామని కాంగ్రెస్ నాయకులే నాలిక్కరుచుకోవడం హాస్యాస్పదం. బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్లలో అప్పులు తీసుకుని ఆటలు ఆడలేదు. ప్రజల ఆస్తులను పెంచింది, రాష్ట్ర స్థాయిని ఆకాశానికి తీసుకువెళ్లింది.
దేశంలో తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దింది. పదేండ్లలో వందేండ్ల ప్రగతిని సాధించింది. సంపదను పెంచి పేదలకు పంచింది. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ప్రజల కండ్లముందున్న అభివృద్ధి సాక్ష్యాలను ఎలా చెరిపేయగలదు? మిషన్ కాకతీయతో బాగుపడ్డ చెరువులను ఎలా మరిపించగలదు? లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం వంటి ప్రాజెక్ట్ను ఒక్క విజిట్తో చెరిపేయగలదా? కాంగ్రెస్ పాలనలో పట్టించుకోకుండా వదిలేసిన యాదాద్రి నరసన్న దైవక్షేత్రం నేడు అద్భుతమైన హంగులతో నిత్యం ప్రజలతో విరాజిల్లుతున్నది. ఈ చరిత్రను ఎవరు, ఎలా చెరిపేయగలరు?
ఒక్క ఓటమితో బీఆర్ఎస్కు వచ్చే నష్టమేమీ లేదు. ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాల చరిత్ర కలిగిన బీఆర్ఎస్ పార్టీ కొద్దిరోజుల్లో రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ముందుకువస్తుంది. ‘వ్యక్తులపై కోపంతో కేసీఆర్ను కోల్పోయామ’ని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే పశ్చాత్తాపపడుతున్నారు. క్షేత్రస్థాయిలో తిరిగే నాలాంటి వాళ్లెవరినడిగినా ఇదేమాట చెప్తారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మంచి విజయాన్ని కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ చేయవలసిందల్లా కార్యకర్తలకు తామున్నామనే భరోసా ఇవ్వటం, పార్టీని పునర్నిర్మించడం.
తెలంగాణ పునర్నిర్మాణ క్రమంలో పార్టీని కొంత నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం. అయినా, ప్రజా తీర్పును బీఆర్ఎస్ పార్టీ గౌరవిస్తున్నది. ఇక పార్టీని బలంగా పునర్నిర్మిస్తూ ప్రజల్లోకి వెళ్లటం, విజయం సాధించడమే మిగిలి ఉంది. కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్లీ తిరుగులేని అజేయశక్తిగా ముందుకు వస్తుంది. మళ్లీ అధికారం చేపడుతుంది. కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష. గత పదేండ్ల కేసీఆర్ పనితీరును చెరిపేయాలని చూస్తే అది కాంగ్రెస్ నాయకుల అత్యాశే అవుతుంది.
తెలంగాణ విజయ్
94919 98702